టిడిపితో దోస్తీపై పునరాలోచనలో బిజెపి?


Babu and Modi in Delhi

రాష్ట్రంలో టి.డి.పి, బి.జె.పి లు దగ్గరవుతున్న సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నప్పటికీ ఆ విషయంలో బి.జె.పి పునరాలోచనలో పడినట్లు వివిధ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతు ఇచ్చిన బి.జె.పి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన టి.డి.పి తో దోస్తీ కట్టడానికి బి.జె.పి తెలంగాణ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చే పక్షంలో టి.ఆర్.ఎస్ కూడా ఆ కూటమిలో చేరే అవకాశాలున్నాయని బి.జె.పి నాయకులు కొందరు భావిస్తున్నారు. దానితో టి.డి.పి తో పొత్తు విషయమై తొందరపడడం తగదని వారు సూచిన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ది హిందు పత్రిక నేడొక విశ్లేషణ ప్రచురించింది. ఈ విశ్లేషణ ప్రకారం టి.డి.పితో దోస్తీ విషయంలో వేచి చూడడమే మంచిదని బి.జె.పి నాయకులు భావిస్తున్నారు. ఉమ్మడి మిత్రుల చొరవతో ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా మిత్రపూర్వకమైన చర్చలు జరిగాయి. మతతత్వం పేరుతో బి.జె.పికి దూరంగా ఉంటూ వచ్చిన టి.డి.పి అధ్యక్షుడు ఈ మధ్య కాలంలో మోడికి సన్నిహితంగా మెలుగుతున్న వార్తలు వచ్చాయి. బి.జె.పిని విమర్శించడం కూడా ఆయన మానుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో తెలంగాణ బి.జె.పి కార్యకర్తలు టి.డి.పి తో దోస్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా, తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేస్తానని ఆశచూపిన కె.సి.ఆర్, సి.డబ్ల్యూ.సి, కేబినెట్ నిర్ణయాల తర్వాత విలీనం ఆలోచనను విరమించుకుంటున్నట్లు సూచనలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ను నమ్మడానికి లేదని, తెలంగాణ ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తమ కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారు. దానితో ఎన్నికల తర్వాత టి.ఆర్.ఎస్, ఎన్.డి.ఏ గూటికి చేరినా ఆశ్చర్యం లేదని బి.జె.పి నాయకులు ఆశపడుతున్నారు.

Babu and Singh in Delhi

Babu and Singh in Delhi

ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చే పక్షంలో అధికారంలో లేని యు.పి.ఏ వైపుకు టి.ఆర్.ఎస్ ఎందుకు వస్తుందన్నది బి.జె.పి నాయకుల అంచనాగా కనిపిస్తోంది. భారత దేశంలో రాజకీయ పార్టీల రాజకీయాలన్నీ అధికారం చుట్టూ తిరిగేవే. సిద్ధాంతాలు, రాద్ధాంతాలతో వాటికి పని లేదు. ఒకటి, అరా సిద్ధాంతాలు చెప్పినా అధికారంలో భాగస్వామ్యం వస్తుందనుకుంటే అవి ఇట్టే అదృశ్యం అయిపోతాయి. కాబట్టి బి.జె.పి నాయకుల అంచనా నిజమైనా ఆశ్చర్యం లేదు.

కాబట్టి టి.డి.పి తో పొత్తు పెట్టుకుని పదో, పరకో సీట్లు గెలుచుకునే టి.ఆర్.ఎస్ కు దూరం కావలసిన అవసరం బి.జె.పి కి ఎందుకు? అన్నది బి.జె.పి నాయకుల ప్రశ్న! తెలంగాణ బి.జె.పిలో 90 శాతం నాయకులు, కార్యకర్తలు టి.డి.పి తో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నారని బి.జె.పి వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.  టి.డి.పి ఇప్పటికీ ‘తెలంగాణ వ్యతిరేక పార్టీ’ గానే కొనసాగడం దానికొక కారణం కావచ్చు.

పైగా తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశిస్తున్న బి.జె.పి, ‘టి.డి.పితో దోస్తీ కడితే జూనియర్ భాగస్వామిగానే పరిమితం కావలసి వస్తుంది. ఎదుగుదల ఉండకపోవచ్చు’ అని బి.జె.పి నాయకులు భావిస్తున్నారు. అందుకే టి.డి.పి విషయంలో తొందర కూడదని బి.జె.పి నాయకులు భావిస్తున్నారు.

అయితే టి.డి.పి నాయకులు కూడా ‘మేం మాత్రం తక్కువా?’ అని ప్రశ్నిస్తున్నారు. బి.జె.పి తో స్నేహం చేయడానికి తాము అంత తొందరగా యేమీ లేమని వారు చెబుతున్నారని పత్రిక తెలిపింది. ఎవరితో దోస్తీ ఉన్నా లేకపోయినా తమ క్యాడర్ పునాది చెక్కు చెదరనందున తమకు నష్టం లేదని తెలంగాణ టి.డి.పి నాయకులు భావిస్తున్నారు. యు.పి.ఏ, ఎన్.డి.ఏ లలో ఏ కూటమికి మెజారిటీ రాని పక్షంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలు మెరుగుపడతాయని కాబట్టి కేంద్రంలో టి.డి.పి ది ప్రధాన పాత్ర అవుతుందని టి.డి.పి వారి వాదన.

అయితే టి.డి.పి-బి.జె.పి దోస్తీ ఇరు పార్టీలకు లాభకరమని అనేకమంది ఒక సాధారణ అవగాహనతో ఉన్న మాట వాస్తవం. బెట్టుకు పోకపోతే గనక బి.జె.పి, టి.డి.పి లు కూడా ఈ విషయం గుర్తిస్తాయి. కాంగ్రెస్ వ్యతిరేక గాలి నుండి లాభం పొందాలంటే ఈ పార్టీలకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు.

ఏ ప్రత్యామ్నాయం లేనిది మాత్రం జనమే. కానీ ఆ సంగతి జనానికే ఇంకా తెలియదు.

వ్యాఖ్యానించండి