
మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.
2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే. నికర ఎఫ్.డి.ఐలు ఇలా పెద్ద మొత్తంలో తగ్గిపోవడానికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో తమ లాభాలను తరలించుకు వెళ్ళడమే అని ఆర్.బి.ఐ తెలియజేసింది. దానితో పాటు భారత పెట్టుబడిదారులు సైతం గణనీయ మొత్తంలో దేశం లోని వారి పెట్టుబడిని విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తరలించుకుపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
అంటే అగ్నికి వాయువు తోడైంది అన్న మాట! కాదు కాదు, ఇప్పుడు మనల్ని పాలిస్తున్నది ఆర్.ఎస్.ఎస్-బి.జే.పి నేతృత్వం లోని హిందూత్వ ప్రభుత్వం కనుక అగ్ని దేవుడికి వాయు దేవుడు తోడై భారత దేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయేలా ఆశీర్వదించారు (శపించారు అనాలేమో!?).
ఆర్.బి.ఐ గణాంకాల ప్రకారం FY 2024లో దేశం లోకి వచ్చిన ఎఫ్.డి.ఐ ల మొత్తం (గ్రాస్) 70.9 బిలియన్ డాలర్లు కాగా, డివిడెండ్లు (లాభాలు), భారత కంపెనీల షేర్ల అమ్మకాలు లేదా పెట్టుబడుల ఉపసంహరణ మొ.న కార్యకలాపాల ద్వారా విదేశీ బహుళజాతి సంస్థలు మరియు వివిధ సంస్థాగత పెట్టుబడులు 44.4 బిలియన్ డాలర్లు తరలించుకుపోయారు.
ఇక భారత బడా పెట్టుబడిదారులు విదేశాలకు మదుపు (investment) నిమిత్తం 15.96 బిలియన్ డాలర్లు పట్టుకుపోయారు. వెరసి మొత్తం 60.36 బిలియన్ డాలర్లు దేశం నుండి తరలించ బడ్డాయి. ఆ విధంగా దేశం లోకి వచ్చిన నికర ఎఫ్.డి.ఐ లు (70.9 – 60.36) 10.54 బిలియన్ డాలర్లుగా తేలింది.
2007 తర్వాత ఇంత తక్కువగా ఎఫ్.డి.ఐ ల రాబడి ఉండడం ఇదే మొదటిసారి. 2007-08 సంవత్సరంలో “ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం” సంభవించడం వల్ల దేశం నుండి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ప్రధానంగా అమెరికా సావరిన్ బాండ్ల లోకి వెళ్ళిపోయింది. తీవ్ర మాంద్యం, ఆర్ధిక సంక్షోభం ఏర్పడ్డ సందర్భాల్లో పెట్టుబడులన్నీ అమెరికా ట్రెజరీస్ (అమెరికా సావరిన్ బాండ్లు) లోకి వెళ్ళడం పరిపాటి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత భద్రమైన చోటు అమెరికా ట్రెజరీస్ మాత్రమే అని పెట్టుబడులకు గాఢ నమ్మకం.
కాని ఇప్పుడు అలాంటి సంక్షోభం ఏమీ ఏర్పడలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇలా పెట్టుబడులు ఎగిరిపోవడానికి కారణంగా చెబితే అది నమ్మదగ్గ విషయం కాదు. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై గత మార్చి నాటికి రెండు సం.ల ఒక నెల అయ్యింది. గాజాపై ఇజ్రాయెల్ దమనకాండ, హత్యాకాండ మొదలై కూడా 8 నెలలు దాటింది. కనుక ఈ యుద్ధాలను పెట్టుబడులు ఎగిరిపోవటానికి సాకుగా చూపలేరు.
ఎఫ్.డి.ఐ లు దేశం దాటిపోవడం గురించి ఇంతగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే మన ప్రధాని మోడీ (జరిగిన ఎన్నికల్లో ఎన్.డి.ఏ ప్రభుత్వమే ఏర్పడనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి గనుక నరేంద్ర మోడీ గారిని ఇంకా ప్రధాన మంత్రి గానే సంబోధించడం జరుగుతోంది) తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఎఫ్.డి.ఐ లు పెద్ద మొత్తంలో దేశంలోకి రావడం ఒకటిగా ఎప్పుడూ చెబుతుంటారు గనుక! మన నేతలు చెబుతున్నది నిజామా కాదా అన్నది మనం చెక్ చేసుకోవాలి కదా!
గత పోస్ట్ / ఆర్టికల్ లో 2021, 2022, 2023 ఆర్ధిక సంవత్సరాలలో మొత్తం 109 బిలియన్ డాలర్లు దేశం నుండి తరలిపోయాయని చెప్పుకున్నాం. ఈ 2024 ని కూడా కలిపితే గత నాలుగేళ్ళలో 169.36 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం తరలిపోయాయన్నమాట! ఇది దాదాపు రు 14.06 లక్షల కోట్లకు సమానం. దీనిని ఒక సందర్భంలో (context) పెట్టి చూస్తే ఈ మొత్తం భారత దేశపు గత వార్షిక బడ్జెట్ (రు 45,03,097 లక్షల కోట్లు) అంచనా లో దాదాపు మూడవ వంతుకు సమానం. ఇదేమీ చిన్నా చితకా మొత్తం కాదు. విదేశీ పెట్టుబడులు తమ లాభాల కింద భారత దేశం నుండి ఎంత పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని తరలించుకుపోతున్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
కనుక ఎఫ్.డి.ఐలు, ఎఫ్.ఐ.ఐలు, ఎఫ్.పి.ఐ లు పేరు ఏదైనా (ఏ రాయైతేనేం పళ్ళు ఊడగొట్టు కునేందుకు?) మనకు/భారత జనానికి ఒరగబెడుతున్నది ఏమీ లేదని అర్ధం అవుతోంది. ఎఫ్.డి.ఐ లు వస్తూ వస్తూ ఆధునిక టెక్నాలజీని తెస్తాయనీ తద్వారా దేశానికి ఆధినిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వస్తుందనీ కేంద్రం చెప్పే మాటల్లో వాస్తవం లేనే లేదు.
అమెరికా, ఐరోపా దేశాలలో ఏ దేశమూ ఇంతవరకు మనకు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిన ఉదాహరణ లేదు. పైగా ఆ దేశాలు ఇవ్వకపోగా ఇచ్చే దేశాలను కూడా ఇవ్వకుండా అడ్డుకుంటాయి. రష్యాకు ఎల్టిసిన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాకు క్రయోజనిక్ ఇంధన టెక్నాలజీ ఇవ్వడానికి రష్యా సిద్ధ పడింది.
అప్పట్లో ఎల్టిసిన్ అమెరికా అదుపాజ్ఞల్లో ఉన్నాడు. ఇప్పటి పుతిన్ నాయకత్వం లోని రష్యా వలే అప్పటి రష్యా అమెరికాకు ఎదురు చెప్పే స్థితిలో లేదు. అమెరికా అభ్యంతరం చెప్పడంతో క్రయోజనిక్ పరిజ్ఞానం ఇవ్వడంలో రష్యా వెనక్కి తగ్గింది. దానితో అధిక పే లోడ్ తో కూడిన ఉపగ్రహ ప్రయోగాలలో భారత దేశం ఒక దశాబ్దం వెనకబడి పోయింది. పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞానం అందజేత అలా ఏడ్చింది మరి! అయినా సరే మన పాలకులు జనానికి కాకమ్మ కబుర్లు చెప్పడం మానలేదు.
అధిక లాభాల రంగాల్లోకే ఎఫ్.డి.ఐ ల ప్రవేశం
ఇంతకీ దేశం లోకి వచ్చే ఎఫ్.డి.ఐ లు ఏయే రంగాలకు ప్రధానంగా వెళ్తున్నాయి? ఆర్.బి.ఐ వెలువరించిన ‘ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులు’ (స్టేట్ ఆఫ్ ఎకానమీ) నివేదిక ప్రకారం ఎఫ్.డి.ఐ ఈక్విటీ పెట్టుబడుల్లో 60 శాతం మాన్యుఫాక్చరింగ్, విద్యుత్ మరియు ఇతర ఇంధన రంగాలు, కంప్యూటర్ సేవలు, రిటైల్ మరియు హోల్ సేల్ రంగాల లోకి వస్తోంది.
విద్యుత్ యూనిట్ ధరలు నానాటికి పెరగడం మనం అనుభవిస్తున్నాం. ఇంధనం (పెట్రోలు, డీజిల్, కిరోసిన్, పెట్రోలియం శుద్ధి మొ.నవి) ధరలు మోడీ హయాంలో లీటర్ పెట్రోలు రు 70 (2013) నుండి ఏకంగా రు 70 నుండి రు 120 కీ, లీటర్ డీజిల్ ధర రు 52 నుండి రు. 93 కీ పెరిగిపోయింది. అంటే ఇండియాలో ఇంధన శుద్ధి, సరఫరా కంపెనీల్లో భారీ లాభాలు వచ్చేందుకు భారత ప్రభుత్వం మార్గం వేసింది.
అందుకే విద్యుత్, ఇంధన రంగాల్లో విదేశీ పెట్టుబడులు రావడం జరుగుతోంది. అంటే మనం విద్యుత్ కీ, పెట్రోల్, డీజిల్ లకీ చెల్లిస్తున్న అత్యధిక ధరల ద్వారా విదేశీ పెట్టుబడి బాగా లబ్ది పొందుతోంది. అంబానీ సోదరులు, అదానీ లకు చెందిన కంపెనీలు విద్యుత్, ఇంధన రంగాలలో గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. వీళ్ళ కంపెనీల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అత్యధిక లాభాలను ఎఫ్.డి.ఐ లు భారత దేశం నుండి తరలించుకు పోతున్నాయని దీన్ని బట్టి గ్రహించాలి. అనగా అదాని, అంబానీ తదితర స్వదేశీ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడులకు భారతీయ ముఖంగా అవతారం ఎత్తారు తప్ప వారివి గా చెప్పే కంపెనీలలో వారి పెట్టుబడి కంటే విదేశీ పెట్టుబడుల వాటాయే ఆధిక్యంలో ఉంటోందని అర్ధం అవుతోంది.
ఇక కంప్యూటర్ సేవలు చూస్తే మనవిగా చెప్పే కంపెనీలు వేళ్ళ మీద (ఇన్ఫోసిస్, విప్రో, TCS, HCL, టెక్ మహీంద్ర) లెక్క పెట్టవచ్చు. ఇంకా ఓ డెబ్భై ఎనభై వరకూ చిన్నా, చితకా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ కంపెనీలు ఉన్నాయి గాని అవి మళ్ళీ అమెరికా, ఐరోపాలలోని కంప్యూటర్ MNC ల పైనే ఆధారపడి ఉంటాయి. బడా MNC లు ఈ చిన్న కంపెనీలకు సాఫ్ట్ వేర్ తయారీ కాంట్రాక్టు లు ఇవ్వొచ్చు. దానితో పాటు ఈ చిన్న కంపెనీలు తమ ఐడియాని పశ్చిమ ఫైనాన్స్ కంపెనీల ముందు ప్రదర్శిస్తే వాళ్ళు పెట్టుబడిని సమకూర్చ వచ్చు.
ఇండియాకు చెందిన బడా సాఫ్ట్ వేర్ కంపెనీలకైతే అమెరికా, ఐరోపా దేశాలే ప్రధాన మార్కెట్! మన కంప్యూటర్ మేతావులు రేయింబవళ్ళు కష్టపడి ఒళ్ళు హూనం చేసుకుంటూ, చట్ట బద్ధ మైన పని గంటలు అనే పరిమితి లేకుండా పని చేస్తూ ఉంటే వారి కష్ట ఫలితాన్ని విదేశీ సాఫ్ట్ వేర్ కంపెనీలు అత్యంత కారు చౌకగా వినియోగించుకుంటున్నాయి. క్యాప్ జెమిని, జనరల్ ఎలక్ట్రిక్ ఫైనాన్స్ లాంటి బడా గుత్త ఫైనాన్స్ కంపెనీలు భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు తామే స్వయంగా కూడా ఇండియాలో షాపులు తెరుస్తున్నాయి.
షాపులు అంటే రోడ్డు పక్క షాపులు కాదు, ఆకాశ హర్మ్యాలలో భారత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కళ్ళూ, మెదడూ, చేతి వేళ్ళు కంప్యూటర్లకు అప్పజెప్పి రోజుకు కనీసం 12 గంటల పాటు పని చేసే బడా కంపెనీలు. ఈ కంపెనీలు తమ తమ దేశాలలోని గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వార్షిక ప్యాకేజీలలో కేవలం 50 వ వంతు నుండి 10 వ వంతు వరకు ఉండే వార్షిక ప్యాకేజీలతో భారతీయుల చేత పని చేయిస్తారు. ఆ విధంగా పదుల రెట్లు లాభాలను తరలించుకు పోతున్నారు.
మరో కోణంలో ఇండియన్ సి.ఇ.ఓ ల పరిస్ధితి కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకి గూగుల్ సి.ఇ.ఓ సుందర్ పిచాయ్ 2021లో వార్షిక వేతనం, బోనస్ లు $6 మిలియన్లు కాగా 2022లో $7.4 మిలియన్లు. అదే కాగ్నిజెంట్ సి.ఇ.ఓ 2022లో 108.282 మిలియన్ డాలర్లు వార్షిక సంపాదన పొందాడు. ఇందులో వేతనం భాగం $950,000 కాగా బోనస్ కింద $3.613 మిలియన్లు, స్టాక్ ఆప్షన్స్ కింద $103.7 మిలియన్లు పొందాడు. సత్య నాదెళ్ళ (మైక్రో సాఫ్ట్ సి.ఇ.ఓ) కాస్త మెరుగ్గా 2020లో $84 మిలియన్లు పొందాడు. ఒరాకిల్ సి.ఇ.ఓ సఫ్రా కాట్జ్ 2022లో $138.2 మిలియన్ వేతనం పొందింది. (1 మిలియన్ డాలర్ = రు 8.3 కోట్లు).
ఉన్నత స్థాయిల్లో పని చేసే కొందరు భారతీయ మేధావులు కొందరు పశ్చిమ దేశాల సి.ఇ.ఓ లకు సమానంగా పొందే ఉదాహరణలు లేకపోలేదు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి పశ్చిమ దేశాలకు వెళుతున్న భారతీయ ఇంజనీర్లు, డాక్టర్లు, మేనేజర్లు అంతా భారతీయుల శ్రమతో నిర్మించిన యూనివర్సిటీలలో, ల్యాబ్ లలో, భారీ ఇంజనీరింగ్ పరికరాలతో విద్యా బుద్ధులు నేర్చుకున్నారు తప్ప వారి చదువుకు పశ్చిమ దేశాలు ఎమీ ఇవ్వలేదు. అమెరికాలో MS చేసిన వారు కొందరు ఉండవచ్చు గాక! కాని ఆ MS కి పునాది ఇండియన్ల శ్రామికులు, ఉపాధ్యాయులు అందజేశారు. వారి సేవలు భారత దేశానికి అందవలసి ఉండగా విదేశాలకు చౌకగా తమ సేవలను అమ్ముకుంటూ శ్వేతజాతి దురహంకారాన్ని సైతం సహిస్తున్నారు.
ఇండియాలో సౌకర్యాలు, అవకాశాలు లేవు అని వీరి వాదన చేయవచ్చు. సరే, మీకు చదువు ఉంది కాబట్టి విదేశాలకు అవకాశాల కోసం వెళ్తున్నారు. కానీ మీ చదువు కోసం యూనివర్సిటీలు, కాలేజీలు, ల్యాబ్ లు, మిషనరీలు నిర్మించి తయారు చేసి మీ ఉన్నతి కోసం శ్రమను కొద్ది వేతనాల కోసం ధారపోసిన భారతీయ శ్రామికుల గురించి వీళ్ళు ఆలోచించ వలసిన అవసరం లేదా అని వీరు ప్రశ్నించుకోవాలి. వీళ్ళను ఎలాగూ అమెరికా, ఐరోపాలకు రానివ్వరు.
అయినా సరే ఆఫ్రికా, ఆసియాల నుండి మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో అవకాశాల కోసం లక్షల మంది పేదలు ఐరోపా తీరాలకు, అమెరికా-మెక్సికో సరిహద్దులకు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. వారిలో అనేక మంది గుట్టలు గుట్టలుగా సముద్రాలలో మునిగిపోతున్నారు. ఎలాగో సరిహద్దు దాటినవారు అనేక అనచివేతలకు, దూషణ తిరస్కారాలకు గురవుతూ ‘దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు’ పని చేస్తున్నారు. వారి శ్రమతో విద్యా బుద్ధులు నేర్చి విదేశీ పెట్టుబడికి శ్రమను అమ్ముకుంటున్న బుద్ధి జీవులు ఈ వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంది.
ఎఫ్.బి.ఐ నికర పెట్టుబడి తగ్గిపోవడం దగ్గర మొదలు పెట్టి, ఈ పెట్టుబడులు ఏయే రంగాలకు వెళ్తున్నాయో పరిశీలించి, ఆ రంగాలకే ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నించుకుని, అధిక లాభాల కోసమే అని గ్రహించి, దాని వల్ల దేశానికి జరుగుతున్న నష్టం గురించి చర్చించుకుని, చివరికి ఇండియన్ బ్రెయిన్ డ్రెయిన్ (మేధో వలస) వద్దకు చేరి, ఈ భారతీయ మేధావులు తమ మాతృదేశంలో తమ వృద్ధికి సహకరించిన శ్రామికుల పట్ల గల బాధ్యతను మర్చిపోయారు అని చూశాం.
అనగా ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ ఇత్యాది విదేశీ పెట్టుబడులకూ భారత దేశంలోని వంద కోట్లకు పైగా గల కార్మిక, మధ్య తరగతి శ్రమ జీవుల ఆకలి బాధలకు, అత్యంత తక్కువ సంపాదనలకు, వారి విద్యా లేమికి, మధ్య సంబంధాన్ని చూశాం. ఈ క్రమానికి భారత పాలకులే WTO ఒప్పందాల ద్వారా, వరల్డ్ బ్యాంక్, ఐ.ఎం.ఎఫ్ షరతులకు అంగీకరించి అప్పులు తీసుకోవడం ద్వారా, విదేశీ దోపిడీకి అనుగుణంగా సకల నియంత్రణ వ్యవస్థలను ప్రభుత్వాలు ఎత్తివేయడం ద్వారా సంపూర్ణంగా, ఎలాంటి శషభిషలు లేకుండా సహకరిస్తున్నారని అర్ధం అవుతున్నది. ఇందులో ఎన్.డి.ఏ, యు.పి.ఏ ప్రభుత్వాల మధ్య ఎలాంటి తేడా లేదు. అసలు ఈ విదేశీ దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వమే వివిధ చట్టాలు చేసి, ఒప్పందాలపై సంతకాలు చేసి, గేట్లు బార్లా తెరిచింది. ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ విధానాలను తిడుతూనే మరింత వేగంగా అదే కాంగ్రెస్ విధానాలను అమలు చేస్తూ భారత అశేష ప్రజానీకాన్ని నిలువునా మోసగిస్తున్నారు.
ఈ నిరంతరాయ దోపిడీకి చరమ గీతం పాడవలసిన పాత్రను త్యజించి మెరుగైన అవకాశాల కోసం అనే పేరుతో విదేశీ కంపెనీలకు ఊడిగం చేసేందుకు సిద్ధపడ్డామన్న సంగతిని విదేశాల్లోని భారతీయులు గ్రహించాలి. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎటువంటి స్వార్ధం లేకుండా, అవకాశాల కోసం అర్రులు చాచకుండా భారత జనుల దాస్య శృంఖలాలను తెంచడానికి ప్రాణాలను తృణప్రాయంగా బ్రిటిష్ కరకు తుపాకుల ముందు, ఉరి కొయ్యలపైనా, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో, అండమాన్ జైళ్ళల్లో అర్పించిన అమర వీరులు త్యాగాలు చేసి ఉండకపోతే ఈ నాటి కంప్యూటర్ మేధో బుద్ధి జీవులకు ఇలా అమెరికా, ఐరోపా దేశాలకు డాలర్ల కోసం చేసిన ప్రయాణాలలో చోటు దక్కి ఉండేదా అని వీరు ప్రస్నించుకోవాలి.