ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే కన్నీళ్లు కారుస్తుంటారు. ధరల తగ్గింపుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటారు.
అక్రమంగా దాచిపెట్టుకోవడం ద్వారా ఉల్లి ధరల్ని పెంచినట్లే యువరాజా వారి విలువను కూడా కృత్రిమంగా, అంటే కనీసం ఎన్నికలు ముగిసేవరకయినా, పెంచే మార్గం ఉందా? కాంగ్రెస్ నాయకులు ఈ మార్గం కోసం తల బద్దలు కొట్టుకుంటున్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది. యువరాజావారి బుర్రలో ఉన్న సరుకంతా ఎక్కడో ఊహాలోకల్లో సంచరించే బాపతు. ఈ మధ్య ఆయన ఇస్తున్న ప్రసంగాలు ఆ సంగతిని స్పష్టం చేస్తున్నాయి.
మొన్నటికి మొన్న (ఆగస్టు మొదటివారంలో) “దరిద్రం ఒక మానసిక స్ధితి. దానర్ధం ఆహారం, డబ్బు లాంటి భౌతిక పదార్ధాలు అందుబాటులో లేవని కాదు. ఆత్మ విశ్వాసం ఉన్నట్లయితే ఎవరైనా దరిద్రాన్ని ఇట్టే అధిగమించవచ్చు” అని ఆయన సెలవిచ్చారు. కాబట్టి ఆత్మ విశ్వాసం ప్రోది చేసుకుంటే పేదరికం లేదా దరిద్రం లేదా నిరుద్యోగం ఇట్టే మాయమైపోతాయన్నమాట! రాహుల్ దృష్టిలో ఆత్మవిశ్వాసం ఒక మంత్రదండం! అయితే ఆ మంత్రదండం ఒకరు ఇచ్చేది కాదు. దాన్ని ఎవరికి వారే సంపాదించుకోవాలి. బహుశా ఒకరి మంత్రదండం మరొకరికి పని చేయదని కూడా ఆయన ఉద్దేశ్యం కావచ్చు.
ఆయన ఇంకా ఏమంటాడంటే “మన వ్యవస్ధలోని బలహీనతల్ని నేను అర్ధం చేసుకోగల్ను. జనానికి సహాయం చేయడానికి నేను శతవిధాలా ప్రయత్నం చేస్తాను. కానీ బలహీనుల గొంతు తమ లోలోపలి నుండి రానిదే ఎవరూ ఏమీ చేయలేరు.”
యువరాజా వారు నిద్రపోతున్నారేమో గానీ, బలహీనుల గొంతు తెరిచి అడగడమే కాదు, గావు కేకలు పెడుతున్నారు. తమ భూముల్ని లాక్కుంటున్నారనీ, తమను తమ స్వస్ధలాల నుండి తరిమేస్తున్నారనీ, పోలీసులు, పారామిలట్రీ బలగాలతో అణిచివేస్తున్నారనీ, అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో తోస్తున్నారనీ దిగంతాల్ని తాకేలా అరిచి గీపెడుతున్నారు. అరిచినా ఫలితం లేకా అనేకమంది ఆయుధాలు కూడా పట్టుకున్నారు. రాహుల్ దృష్టిలో ఇవి బలహీనుల లోలోపలి నుండి వచ్చిన గొంతులు కావా?
ఒడిషా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర అనేక రాష్ట్రాల్లో గిరిజన ప్రజానీకాన్ని అడవుల నుండి తరిమేసి వారి కాళ్ళ కింద ఉన్న ఖనిజ వనరుల్ని విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకి అప్పజెప్పడానికి యువరాజావారి పార్టీవారే చట్టాల మీద చట్టాలు చేస్తున్నారు. ఈ విధానాల పైన పోరాటం చేస్తున్న గిరిజనులని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేస్తున్నారు. ఒడిశాలో పోస్కో, తమిళనాడులో కూడంకుళం తదితర కంపెనీల అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా జనం గొంతెత్తి అరిచారు.
సమస్య ఏమిటంటే యువరాజా వారికి బలహీనుల గొంతుల్ని వినే ఓపిక ఉండదు. వినాలన్న ధ్యాస కూడా ఆయనకు లేదు. ఆయన వద్ద సమస్యను దాచి పెట్టుకుని దాన్ని జనంపైకి నెట్టేసి తాలు సిద్ధాంతాలు వల్లిస్తే ఆయన విలువ పెరగదు గాక పెరగదు. పైగా పాతాళానికి జారిపోతుంది.

నేను కాస్త డిప్రెషన్ లో ఉన్నా / sad గా ఉన్నా నేను రాహుల్ గాంధీ ఫోటో చూస్తాను , ఆయన్ని చూస్తె చాలు నా STATE OF MIND మారిపోతుంది , హాయిగా నవ్వుకొని మనసంతా relief అవ్తుంది. రాహుల్ గాంధీ కనీసం bank clerical exam పాస్ అయితే నేను కచ్చితంగా ఆయనకే వోట్ వేస్తా pm అవ్వడానికి. january 12 kakundaa rahul birthday ని national youth day గా ప్రకటిస్తే నా లాంటి యువకులందరూ అతన్ని చూసి మా STATE OF MIND మార్చుకొని అయన బావమరది లాగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం.
kothi ki aemi thelusu karpooram vaasana