రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది అనడిగితే మౌనమే సమాధానం! ‘బిల్లుల ఆమోదానికి సహకరించం’ అని ప్రతిపక్షాలు మొండికేస్తే అప్పుడు కాస్త నోరు పెగుల్చుకుని ‘స్వదేశీ, విదేశీ రెండు కారణాలు పని చేస్తున్నాయి’ అని చెప్పి ఊరుకున్నారు. గట్టిగా అడిగితే మరిన్ని సంస్కరణలు తెస్తే మళ్ళీ మొదలు పెట్టొచ్చు అంటూ ‘పెనం మీంచి పొయ్యిలోకే దూకుతాం’ అని చెబుతారు, ప్రధాని మన్మోహన్.
రూపాయి విలువను ఇంకా తెగ్గోసే చమురు ధరలను పెంచవద్దు బాబోయ్ అని మొత్తుకుంటే సిరియా దాడి పైన వేలెత్తి చూపుతున్నారు ప్రధాని. రెండు రెట్లు పన్నులు బాదుతున్న సంగతి దాచి పెట్టి చమురు కంపెనీలకు నష్టాలొస్తున్నాయి, వాటిని మీరే మొయ్యాలి అని సందేశం ఇస్తారు.
బొగ్గు అక్రమ కేటాయింపుల ఫైళ్ళు ఏమైయాయని అడిగితే ‘నేను ఫైళ్లకు కాపలాదారునా?’ అని ప్రశ్నిస్తారు.
వెరసి అన్నివైపుల నుండి దాడులు పెరిగి ‘నేను మాయమైపోతే బాగుడ్ను’ అని ప్రధాని మన్మోహన్ దీనంగా వేడుకుంటున్నట్లుగా కార్టూనిస్టు సూచిస్తున్నారు.
కానీ పార్లమెంటులో వరుస పెట్టి బిల్లులు ఎలా పాశవుతున్నాయి? ఆహార భద్రతా బిల్లు, భూ సేకరణ బిల్లు, పి.ఎఫ్.ఆర్.డి.ఏ బిల్లు… ఇలా అన్నీ ఎలా ఆమోదం పొందుతున్నాయి?
