చైనా అద్భుతం: పాడే ఇసుక తిన్నెల్లో విరిసిన ఎడారి కమలం -ఫోటోలు


అది చైనాలోని గ్జియాంగ్ షావాన్ ఎడారి. చైనా రాజధానికి పశ్చిమంగా 350 కి.మీ దూరంలో ఉండే ఈ ఎడారి ప్రాంతం మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉండే ఎత్తైన ఇసుక తిన్నెలకు ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న లక్షణమే దానిని ప్రఖ్యాత టూరిస్టు ఆకర్షణ కేంద్రంగా మార్చివేసింది.

ఆ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇక్కడ ఇసుక తిన్నెలు పాడతాయి. అవును పాడతాయి. ఎలా పాడతాయో, ఎందుకు పాడతాయో ఇంకా తెలియదు గానీ పాడడం మాత్రం నిజం. ఇసుక తిన్నెలు ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడి ఉండడం వలన వాటి గుండా ప్రయాణించే గాలి ప్రత్యేక రీతిలో ప్రతిధ్వనించి ‘బూమ్’ అంటూ గర్జిస్తున్నట్లుగా పాడుతున్న అనుభూతిని కలిగిస్తాయి. ఇసుక తిన్నెల నిర్మాణం దానికి కారణం అని ప్రస్తుతానికి ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే అది పూర్తి వివరణ కాదు. పూర్తి వివరణ ఇవ్వడానికి అదేమిటో పూర్తిగా వారికే అర్ధం కాలేదు మరి!

ఈ పాడే ఇసుక తిన్నెల మధ్య చైనా ప్రభుత్వం ఒక అద్భుత కళా ఖండాన్ని నిర్మించింది. విస్తారమైన ఇసుక తిన్నెల మధ్య కమలం ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఒక విశ్రాంతి బస లేదా రిసార్ట్. దీని పేరు ‘డిసర్ట్ లోటస్ హోటల్.’ ‘హోటల్ ఎడారి కమలం’ అని చెప్పుకోవచ్చేమో.

ఈ హోటల్ మొత్తం రిసార్ట్ లో ఒక భాగం. ఇక్కడ మంగోలియన్ సాంస్కృతిక పద్ధతుల్లో చైనీయ కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. ఎడారి ఓడల (ఒంటె) సవారి, సీ సర్ఫింగ్ తరహాలో డిజర్ట్ సర్ఫింగ్… ఇలాంటి అనేక సౌకర్యాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతానికి చైనీయ టూరిస్టుల వరకే పరిమితం అయినా రానున్న రోజుల్లో అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు.

‘గెట్టి ఇమేజెస్’ ఫోటోగ్రాఫర్ జులై నెలలో ఈ ఎడారి కమలం సందర్శించారు. ఆయన తీసిన ఫోటోలను ‘ది అట్లాంటిక్’ పత్రిక ప్రచురించింది.

వ్యాఖ్యానించండి