జాతీయ ప్రజాస్వామిక కూటమి (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) విచ్ఛిన్నం దారిలో పయనిస్తున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. బి.జె.పితో సంబంధాలు అంత బాగా లేవని ఎన్.డి.ఎ కన్వీనర్ శరద్ యాదవ్ శుక్రవారం స్పష్టం చేసేశారు. ఇప్పటిడైతే ఎన్.డి.ఎ ఉనికిలోనే ఉంది అని చెబుతూనే ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో అంగీకరించిన కనీస కార్యక్రమానికి, అవగాహనకి భిన్నంగా పరిస్ధితులు పోతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.
నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడాన్ని ఆయన ఉద్దేశించారని స్పష్టమే. ఎన్.డి.ఎ స్ధాపన సమయంలో బి.జె.పి కోర్ డిమాండ్లు (ఉమ్మడి కోడ్, రామ మందిరం, ఆర్టికల్ 370) పక్కన బెట్టి సెక్యులర్ విలువలను ప్రమోట్ చేస్తూ ఒక అంగీకారానికి వచ్చామని కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి విరుద్ధంగా ఉన్నాయని శరద్ యాదవ్ ప్రకటించారు. నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిని చేయడం అంటే బి.జె.పి అతివాద డిమాండ్లను ముందుకు తేవడమే అన్నది శరద్ యాదవ్ అభిప్రాయంలా కనిపిస్తోంది.
ఇక నితీశ్ కుమార్ అయితే మోడి వ్యతిరేకతను ఎప్పుడూ దాచుకుంది లేదు. పరిస్ధితి కష్టంగానే ఉంది అని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. ఎన్.డి.ఎ విచ్ఛిన్నం అయితే పరిస్ధితిని ఎదుర్కోవడానికి బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బి.జె.పి మద్దతు ఉపసంహరించుకున్నా, తన ప్రభుత్వం నిలబడడానికి వీలుగా ఇండిపిండెంట్ల మద్దతు ఆయన సమకూర్చుకుంటున్నారు. బీహార్ లో బి.జె.పి, జె.డి(యు) ల మధ్య అప్పుడే ఘర్షణ వాతావరణం మొదలయింది. బి.జె.పి పార్టీ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినందుకు బి.జె.పి రాష్ట్ర శాఖ తీవ్ర విమర్శలు గుప్పించింది.
అయితే మమత, నితీశ్, నివీన్ లు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కు వామపక్షాల మద్దతు రాకపోవడం గుర్తించదగిన పరిణామం. మమత బెనర్జీతో వామ పక్షాల విభేదాలు నిజమే అయినా యేచూరి, బర్దన్ లు చెప్పిన కారణాలు అహేతుకం అయితే కాదు. భారత దేశంలో ఉన్నది ఫెడరల్ రాజ్యాంగం కాదు. యూనియన్ రాజ్యాంగం మాత్రమే. కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ అనేది కాగితాల వరకే పరిమితం అవుతుంది.
కాంగ్రెస్, బి.జె.పి విధానాలు ఒకటే కనుక ఆ విధానాలకు ప్రత్యామ్నాయం రూపొందించి వాటి ఆధారంగా కూటమి ఏర్పడి ప్రజల వద్దకు వెళ్లాలనేది యేచూరి వాదన. అలా కాకుండా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసే కూటమికి ఆమోదనీయత, ఆచరణీయత ఉండవని ఇరు వామపక్ష పార్లమెంటరీ పార్టీలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బి.జె.పి ప్లస్ ఇతర పార్టీలతోనూ, బి.జె.పి కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తోనూ కూటములు కట్టిన చరిత్ర వామపక్ష పార్టీలకు ఉన్నది. అప్పుడు ఇలాంటి వాదన ఆ పార్టీల నుండి రాలేదు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్ధితుల్లో వచ్చిన మార్పు కూడా ఏమీ లేదు. అప్పుడూ, ఇప్పుడూ అవే నూతన ఆర్ధిక విధానాలు కొనసాగుతున్నాయి. ప్రజల కడగండ్లు పెరిగాయి తప్ప తరిగింది లేదు. అలాంటప్పుడు తమ ఎన్నికల విధానానికి మార్పులు చేసుకునే అవసరం ఆ పార్టీలకు ఎందుకు వచ్చింది?
దేశంలో పరిస్ధితులు మారడం అంటే వివిధ రాజకీయ పార్టీల బలాబలాలలో మార్పులు రావడమా లేక ప్రజల్లోని మౌలిక వర్గాల పొందికలో మార్పులు రావడమా? వ్యవస్ధను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నపుడు రాజకీయ పార్టీల బలాబలాలు వ్యవస్ధలోని మౌలిక మార్పులకు సంకేతం కాజాలవు. కానీ పార్లమెంటరీ రాజకీయాల్లో కూరుకుపోయాక రాజకీయ పార్టీల బలాబలాల మార్పులే పార్టీ పంధా, ఎత్తుగడలను ప్రభావితం చేస్తాయి. అప్పుడప్పుడూ నూతన ఆర్ధిక విధానాలు అంటూ మౌలిక సమస్యలను చర్చించినా అవి కేవలం చర్చ వరకే పరిమితం అవుతాయి. ప్రజల్ని మౌలికంగా వ్యవస్ధకు వ్యతిరేకంగా కదిలించే కార్యక్రమం పక్కకు పోతుంది. సి.పి.ఐ, సి.పి.ఎం, లిబరేషన్ తదితర పార్టీల రాజకీయాలు కూడా ఈ పరిధిలోనే ఉండడం ఆశ్చర్యం ఏమీ కాదు.

Past ten years lot of things changed . Having alience with JD party would not help BJP anymore, at the same time they have to compramise their ideology. Its good for BJP. Except english media nobody bothers jd breaking alience with bjp.