ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -1


ఐ.బి.ఎన్ లైఫ్

[సుప్రసిద్ధ నాటక రచయిత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై గడ్డపై ఒక సాహితీ వేదికలో నిర్వాహకులపైనే కత్తి దూశాడు. ట్రినిడాడియన్-బ్రిటిష్ పౌరుడు, నోబెల్ సాహితీ బహుమతి స్వీకర్త విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కు ‘టాటా లిటరేచర్ లైవ్! ఫెస్టివల్’, లైఫ్ అఛీవ్మెంట్ అవార్డ్ ప్రకటించడంపై మండిపడ్డాడు. ‘నాటకరంగంలో తన ప్రయాణం’ పై ప్రసంగించడానికి నిర్వాహకులు గిరీష్ ను ఆహ్వానించగా ఆయన నైపాల్ రాతలపై, భావాలపై దాడి చేయడానికి అవకాశాన్ని వినియోగించాడు.బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్ధించిన వ్యక్తికి అవార్డు ఏ ప్రాతిపదికన ఇస్తారని ఆయన నిర్వాహకులను ప్రశ్నించాడు.

హిందూ మతోన్మాద విజృభణను భారతీయ సంస్కృతి పునరుద్ధానంగా అభివర్ణించిన వి.ఎస్.నైపాల్ ట్రినిడాడ్ లో పుట్టి బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నాడు. 2001లో నోబెల్ సాహితీ పురస్కారాన్ని అందుకున్నాక ఆయన భారతీయ మూలాలు ఇండియాలో ఆయన పాపులర్ కావడానికి దారితీసాయి.

భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రను ‘గాయపడిన నాగరికత’ గా అభివర్ణిస్తూ పుస్తకం రాసిన నైపాల్, బ్రిటిష్ వలస దోపిడీ ద్వారా భారతీయులు నాగరికత నేర్చుకున్నారని చెప్పడానికి వెనకాడని వ్యక్తి. హిందూ ఫ్యూడల్ రాజుల ధనరాశుల కోసం జరిగిన ఫ్యూడల్ మహమ్మదీయ దండయాత్రలు భారతీయ నాగరికతను అణచివేసినట్లయితే, సర్వరంగాల్లోనూ భారత ప్రజల మూలుగలు పిప్పిచేసిన వలస దోపిడీలో భారతీయ నాగరికత ఎలా పరిఢవిల్లిందో అంతుబట్టని విషయం.

పశ్చిమ దేశాల ప్రపంచ దండయాత్రలను, శతాబ్దాల అమానవీయ వలస దోపిడిని జాతుల స్వతంత్ర అభివృద్ధికి నిరోధంగా కాక నాగరికతా వరదాయనిగా చెప్పుకోవడం పశ్చిమ దేశాలకు చారిత్రక అవసరం. వారి సామ్రాజ్యవాద అవసరాన్ని భుజాన వేసుకుని ప్రచారం చేసిన నైపాల్ యొక్క తెల్ల భావదాస్యం నోబెల్ బహుమతికి అర్హత పొందడంలో ఆశ్చర్యంలేదు. కానీ బాబ్రీ మసీదు విధ్వంసకాండను సృజనాత్మక ఆవేశంగా ఆమోదించిన నైపాల్ కి జీవన సాఫల్య అవార్డు కట్టబెట్టడమే ఆశ్చర్యకరం.

టాటా లిట్ ఫెస్ట్ వేదికపై గిరీష్ కర్నాడ్ ప్రసంగం పాఠాన్ని ఔట్ లుక్ పత్రిక తన వెబ్ సైట్ లో ప్రచురించింది. విషయ ప్రాధాన్యత దృష్ట్యా దాని యధాతధ అనువాదం ఇక్కడ ఇస్తున్నాను -విశేఖర్]

                     ***                                            ***                                              ****

ఈ సంవత్సరం ముంబై లిటరేచర్ ఫెస్టివల్ వద్ద లాండ్ మార్క్ మరియు లిటరేచర్ అలైవ్ వారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సర్ విద్యా నైపాల్ కి సంయుక్తంగా ప్రకటించారు.

నైపాల్ భారతీయుడు కాదు. తాను భారతీయుడుగా ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ వద్ద అక్టోబర్ 31 తేదీన జరిగిన అవార్డు ఉత్సవంలో ఆ సంగతి ప్రస్తావించడంలో బిడియపూర్వకంగా విఫలం అయ్యారు. ఏ సందర్భంలోనూ ఆ ప్రశ్న తలెత్తలేదు.

2002 లో ఐ.సి.సి.ఆర్ నిర్వహించిన నీమ్రాణా ఫెస్టివల్ ను “నోబెల్ బహుమతి పొందిన ఒక వ్యక్తి… భారతీయుడేనన్న ఆశతో, వ్యక్తిపూజా దృక్పధంతో ఇండియా జరుపుకున్న ఉత్సవం” గా నవలా రచయిత శశి దేశ్పాండే అభివర్ణించాడు. ఆ మాటలు ప్రస్తుత ఉత్సవానికి సరిగ్గా వర్తిస్తాయి.

ఆయన రాసిన నవలల్లో రెండు మాత్రమే భారత దేశం ఇతివృత్తంగా ఉన్నవి. లోతైన నవలలవి. అవి కాకుండా ఇండియాపై ఆయన మూడు పుస్తకాలు రాశారు. వాటిని అద్భుతంగా రాశారాయన. మనతరంలోని గొప్ప ఆంగ్ల రచయితల్లో ఆయన నిస్సందేహంగా ఒకరు.

ఆధునికత్వంలోకి భారతదేశం సాగించిన ప్రయాణపు అన్వేషణకు కొనసాగింపుగా అవి ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఆయన మొదటి పుస్తకం -ఎ వూండెడ్ సివిలైజేషన్ (గాయపడిన నాగరికత)- తోనే ఎవరికైనా తోచేది భారతీయ ముస్లింలపై అవి వ్యక్తం చేసిన వెర్రి వ్యతిరేకత.

టైటిల్ లో ఉన్న గాయం బాబర్ దండయాత్ర వల్ల కలిగిందని చెప్పేది. అప్పటినుండీ ముట్టడిదారులకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏ ఒక్క అవకాశాన్నీ నైపాల్ వదల్లేదు. ఐదు శతాబ్దాలపాటు ఇండియాని నాశనం చేశారని నిందించాడు. ఇతర భయానక అంశాలతోపాటు దరిద్రాన్ని దేశంలోకి తెచ్చారన్నాడు. సుప్రసిద్ధమైన ప్రాచీన హిందూ సంస్కృతిని నాశనం చేశారన్నాడు.

ఈ పుస్తకాల గురించి ఎవరికైనా ఒక అంశం వెంటనే తడుతుంది; దేనిలోనూ భారతీయ సంగీతం గురించిన ప్రస్తావనే లేకపోవడం.

మన రోజువారీ ఉనికిని సంగీతం నిర్వచిస్తుందని అందరికీ తెలుసు… మీరు దానిని వీధుల్లో చూడగలరు, రెస్టారెంట్లు మొదలైనవాటిలోనూ చూడగలరు. భారతదేశం గురించిన ఒక అన్వేషణలో దాని గురించిన వ్యాఖ్యానం ఉంటుందని మీరు ఆశిస్తారు. భారాదేశంపై మూడు పుస్తకాలు నైపాల్ రాసినప్పటికీ, అవి కూడా మూడు పెద్ద పుస్తకాలు, ఏ ఒక్కదానిలో కూడా సంగీతం గురించిన ప్రస్తావనే ఉండదు. భారతీయ సంగీతానికి స్పందించకుండానే ఆయన భారతదేశం మొత్తం చుట్టేశాడు.

ఇపుడు నాకేమనిపిస్తుందంటే, దీనర్ధం ఆయన చెవిటివాడని. ఈ పరిస్ధితిపై అది నా పరిశీలన, కానీ ఆయన చెవిటివాడుగా ఎందుకు ఉండకూడదో కారణమేమీ లేదు. అది మనందరికీ ఉన్న రాజ్యాంగ హక్కు. కానీ ఏంజరుగుతుందంటే మీరు సంగీతాన్ని అర్ధం చేసుకోనట్లయితే, మీరు సంగీతానికి స్పందించనట్లయితే, మీరు భారతీయ చరిత్రకు స్పందించలేరు. ఎందుకంటే భారతీయ సంస్కృతి యొక్క నిజమైన అభివృద్ధి సంగీతం ద్వారానే సాధ్యం అయింది.

నైపాల్ యొక్క భారతీయ సంస్కృతీ విశ్లేషణలో ఇదొక సమస్య. ఆయనవద్ద సంగీతం లేదు కనుక మన చరిత్రకు ముస్లింలు ఏమిచ్చారన్న విషయంపై ఆయనకి అంచనా ఏదీ లేదు.

భారత చరిత్రలో ముస్లింలు ఏమి చేశారన్న విషయమై ఆయనకి ఉన్న భావాలను బట్టి కనీసం సంగీతం (చరిత్రలో) ఏమి చేసిందో కూడా ఆయనకేమీ తెలియదని స్పష్టంగా తెలుస్తోంది.

మరోవిధంగా చెప్పాలంటే, ఇపుడు, సంగీతం లేకపోయిన తర్వాత – సంగీతానికి చెవి ఒగ్గలేకపోయాక ఆయన పుస్తకంలో మరొక చాప్టర్ కి నిజంగా స్ధానం లేకుండా పోయింది.

ప్రతి భారతీయ గృహం యొక్క హృదయంలోనూ సజీవంగా ఉన్న ఇంతటి అసామాన్యమైన వారసత్వాన్ని భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అందించాయి. ఆ ఉద్యమాల ద్వారా హిందూ మరియు ముస్లిం సృజనాత్మకతలు పరస్పరం చిక్కుముడిగా అల్లుకుపోయిన వాస్తవం పట్ల ఆయనకి గల జడాత్మకతను ఇది వివరిస్తుంది.

నైపాల్ యొక్క భారతీయ ఇస్లాం విద్వేషం దాచిపెట్టేదేమిటంటే, భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆయనగారి చరిత్ర నమూనా, విలియం జోన్స్ లాంటి 18 మరియు 19 శతాబ్దాల బ్రిటిష్ మ్యూజికాలజిస్టుల నుండి అరువుతెచ్చుకున్నది. ఈ స్కాలర్లకు ఈజిప్త్షియన్, గ్రీకు, రోమన్ లాంటి అనేక ఇతర ప్రాచీన నాగరికతలతో సాన్నిహిత్య పరిచయం ఉంది. కానీ ఈ నాగరికతలు తమ సంగీత సాంప్రదాయాలను మొత్తంగానే కోల్పోగా భారతీయ సంగీత సాంప్రదాయం సజీవంగా వర్ధిల్లిన వాస్తవం వారిని అయోమయానికి గురి చేసింది.

ఇక ఒకప్పటి ఈ స్వచ్ఛమైన, అద్వితీయమైన సంగీతం, సుదీర్ఘ చారిత్రక క్రమంలో ఏదో ఒక సమయాన ఉనికి కోల్పోయి ఉండాలని, కలుషితం అయి ఉంటుందనీ, నలగగొట్టబడి ఉంటుందనీ  వారు నిర్ణయించేశారు. దానికి విలన్ ముస్లిం దండయాత్రీకులేనని వారు కనిపెట్టారు. కనుక, వారి ప్రకారం, అనగనగా ఒక ఆదిమ భారతీయ సంగీత సంస్కృతి ఉండేది; దానిని ముస్లింలు అందవికారం కావించారు.

విదేశీయులు వస్తారు, వారు భారతీయ సంస్కృతిని చూస్తారు, వారు ఆదిమ హిందూ సంస్కృతిని చూస్తారు, అది కలుషితం అయిందనీ ముస్లింల వల్ల కలుషితం అయిందనీ గమనిస్తారు. అంటే మీరొక విషయం గ్రహించవచ్చు. నైపాల్ పుస్తకం చదివినవారెవరైనా వెంటనే ఈ మాతృక (matrix) ను గుర్తిస్తారు. తనంతటతానే గుర్తించానని ఆయన చెప్పిన విషయం వాస్తవానికి చాలాకాలం క్రితమే భారతదేశ సంబంధిత (Indological) అధ్యయనంలో ఉన్నదే.

తన భారతీయ సంస్కృతీ విశ్లేషణలో నైపాల్, ఈ వాదనను అరువుతెచ్చుకుని తన ఒరిజినల్ దృష్టికోణం గా మనముందు ఉంచుతాడు. అలా ఒక్కసారే జరగలేదు.

విజయనగర శిధిలాలు సంకేతంగా నిలిచే చావుపట్లా, వినాశనం పట్లా ఆర్.కె.నారాయణన్ ఉదాసీనతతో వ్యవహరించాడని నైపాల్ నిందిస్తాడు. ఆయన దృష్టిలో అది (విజయనగర సామ్రాజ్యం) హిందూ సంస్కృతికి కోట; దానిని బందిపోటు ముస్లింలు నాశనం చేశారు. కానీ మళ్ళీ చూస్తే, విజయనగర చరిత్రకు సంబంధించిన ఆయన వివరణ 1900లో ముద్రితమైన రాబర్ట్ సెవెల్ పుస్తకం ‘మరిచిపోయిన సామ్రాజ్యం’ (A Forgotten Empire)లో ఆయనకి రెడీ మేడ్ గా దొరికిందే.

వలసాధీశులు ప్రసాదించిన (చారిత్రక) వనరులపట్ల ఎల్లప్పుడూ దిగ్భ్రమతో ఉండే నైపాల్, ఈ దృశ్యాన్ని అరమరికలులేని వాస్తవంగా చక్కగా స్వీకరించి దాన్ని మొత్తంగానే తన సొంత ఆవిష్కారంగా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాడు. (చారిత్రక) స్ధలాలను గత వంద సంవత్సరాలుగా పరిశోధించిన చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు వాస్తవ స్ధితిగతులు మరింత సంక్లిష్టమైనవనీ రుజువు చేశారు. ఈ విరుద్ధ సంఘర్షణలో మతం పాత్ర లేనేలేదని వారు రుజువు చేశారు. కానీ అవేవీ ఆయనకి అవసరం లేదు.

… … … ఇంకా ఉంది

One thought on “ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -1

వ్యాఖ్యానించండి