పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫాసిస్టు విన్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలపై విరుచుకు పడడానికే వినియోగిస్తున్నది. ప్రజలకు కావలసింది శుష్క వాగ్దానాలు కావనీ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావని ప్రశ్నించినందుకు టి.బి తో బాధపడుతున్న ఒక సాధారణ రైతును అరెస్టు చేసి దొంగ కేసులు బనాయించింది. బుధవారం పశ్చిమ మిడ్నపూర్ లో బహిరంగ సభ పూర్తయ్యాక ఎప్పటిలాగే ప్రశ్నలు అడగాలని కోరిన మమత రైతులకోసం ఏమి చేస్తున్నారన్న ప్రశ్నను సహించలేకపోయింది.
రైతు నక్సలైటు అయి ఉంటాడని మమత ఆగ్రహించిన వెంటనే పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. కొద్ది సేపటికి అతన్ని వదిలిపెట్టినా, ఆ తర్వాత బహిరంగ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించాడంటూ తప్పుడు కేసు నమోదు చేసి ఇంటివద్దనుండి శిలాదిత్య చౌదరి అనే 40 యేళ్ల రైతును పోలీసులు పట్టుకుపోయారు. అతనికి బెయిలు నిరాకరించారు. ఆ తర్వాత తృణమూల్ కి చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులంతా ఒక సాధారణ రైతుపై ఆరోపణల పర్వం కొనసాగించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉల్లంఘించి బారెకేడ్లను తెంచుకున్నాడనీ, తాగి ఉన్నాడనీ, పోలీసు అధికారులను విధి నిర్వహించకుండా అడ్డుకున్నాడనీ కేసులు బనాయించారు.
మమత చర్యలను ఇతర పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ మార్కండేయ కట్జు మమత చర్యను తీవ్రంగా ఆక్షేపించాడు. ప్రజలిచ్చిన అధికారాన్ని వారి స్వేచ్ఛను హరించే వైపుగా దుర్వినియోగం చేస్తున్నదని వ్యాఖ్యానించాడు. రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని ఆరోపించాడు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్ లో మమతపై గీసిన కార్టూన్ ను ఈ మెయిల్ లో ఫార్వర్డ్ చేసినందుకు ఒక ప్రొఫెసర్ ను అరెస్టు చేసి కేసు పెట్టి వేధించడం పట్ల పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించింది. అరెస్టుకు గురయిన ప్రొఫెసర్ అంబరీష్ మహాపాత్ర, సుబ్రతో రాయ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తలా 50,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. వారిరువురిని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై పోలీసు డిపార్ట్ మెంటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాలక పార్టీని విమర్శించినంతమాత్రాన పౌరులను వారి ఇళ్లనుండి అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడం తగదనీ, ఇది కొనసాగితే నియంతృత్వ పాలన వైపుకే పయనిస్తామని కమిషన్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి మమత వింటున్నారా?

కార్టూన్ ని చూడగానే అర్థమయ్యేలా- అర్థవంతంగా, శక్తిమంతంగా వేశాడు, సురేంద్ర. అధికారంలోకి వచ్చాక మమత అసహనం, నియంతృత్వ ధోరణి పెచ్చుమీరిపోతున్నాయి!
మమత అధికారంలోకి రావడానికి సహకరించిన వారందరికీ ఇది చెంప పెట్టు.