ఫుకుషిమా: రేడియేషన్ రీడింగ్ తగ్గించి చూపిన కంపెనీలు


ఫుకుషిమా ప్రమాదం అనంతరం కర్మాగారంలో రేడియేషన్ విడుదల స్ధాయిని తగ్గించి చూపేందుకు కంపెనీ ప్రయత్నించిందని బి.బి.సి వెల్లడించింది. కర్మాగారంలో పని చేస్తున్న వర్కర్లకు అమర్చిన డొసి మీటర్లు వాస్తవ రేడియేషన్ స్ధాయిని చూపించకుండా ఉండేందుకు మీటర్లను లెడ్ కవచాలతో కప్పి ఉంచాలని కంపెనీ అధికారులు వర్కర్లకు ఆదేశాలిచ్చిన సంగతిని పత్రికలు వెల్లడి చేశాయి. వర్కర్లు నివాసం ఉండే డార్మీటరీలో కంపెనీ అధికారి ఒకరు ఆదేశాలిస్తుండగా వర్కర్లు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఫుకుషిమా ప్రమాద తీవ్రతను తగ్గించి చూపడానికి ప్రభుత్వాలు, కంపెనీలు శతధా ప్రయత్నించాయని వచ్చిన ఆరోపణలు నిజమేనని తాజా వెల్లడి రుజువు చేస్తోంది. 

తమ అధికారుల్లో ఒకరు వర్కర్లకు ఆదేశాలిచ్చినమాట నిజమేనని టెప్కో (ఫుకుషిమా అణు కర్మాగారం నిర్వహిస్తున్న కంపెనీ) సబ్ కాంట్రాక్టర్ కంపెనీ ‘బిల్డప్’ అంగీకరించినట్లు బి.బి.సి తెలిపింది. వాస్తవ రేడియేషన్ రీడింగ్ ను అనుమతించినట్లయితే వర్కర్లు ఫుకుషిమాలో పని చేయగల కాలం తగ్గిపోతుంది. ఒక సంవత్సరకాలంలో రేడియేషన్ కు గురికావడానికి చట్టం అనుమతించే పరిమితి దాటితే వర్కర్లు అణు కర్మాగారంలో పని చేయడానికి అనర్హులు అవుతారు. మళ్ళీ కొత్త వర్కర్లను నియమించుకునే అవసరాన్ని తప్పించడానికి వర్కర్ల ఆరోగ్యాన్ని, ప్రాణాలను బలి పెట్టడానికి కంపెనీ సిద్ధపడింది. వర్కర్ల ప్రాణాలు బలి పెట్టడం ఒక సంగతి కాగా, వాస్తవ రీడింగ్ ను తగ్గించి చూపడం ద్వారా ఫుకుషిమా రేడియేషన్ లీకేజి తీవ్రత తగ్గించడం అసలు విషయం. వర్కర్ల పని కాలం పెంచడం కోసం మాత్రమే రీడింగ్ ను తగ్గించి చూపే అక్రమానికి పాల్పడ్డట్లు కంపెనీ, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అసలు కుట్ర ప్రమాద తీవ్రత తగ్గించి చూపడానికే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రేడియేషన్ లీకేజి ఆగలేదు

బి.బి.సి వార్తా సంస్ధ ప్రకారం గత సంవత్సరం నవంబరు నుండి ఈ సంవత్సరం మార్చి వరకు బిల్డప్ కంపెనీ కార్మికులు వివిధ నిర్మాణాలను పునరుద్ధరించడానికి ఫుకుషిమా కర్మాగారంలో పని చేశారు. అణు కర్మాగారంలో పని చేసే ప్రతి కార్మికుడు గురి అయ్యే రేడియేషన్ ని కొలవడానికి స్మార్ట్ ఫోన్ సైజులో ఉండే డొసి మీటర్ ని అమర్చుతారు. ఫుకుషిమా కర్మాగారంలో అధిక రేడియేషన్ లీకేజి జరుగుతున్న ప్రాంతంలో పని చేస్తున్నపుడు డొసి మీటర్లు రేడియేషన్ కొలవకుండా లెడ్ తో తయారు చేసిన కవచాన్ని తొడగాలని బిల్డప్ కంపెనీ అధికారి వర్కార్లకు ఆదేశాలిచ్చాడని పత్రికలు వెల్లడి చేశాయి. బి.బి.సి ఇలా తెలిపింది.

In December, a Build-Up executive told them to cover their dosimeters with lead casings when working in areas with high radiation.

Otherwise, he warned, they would quickly reach the legal limit of 50 millisieverts’ exposure in a year, and they would have to stop working.

Build-Up president Takashi Wada told Japanese media nine of the workers complied.

జపాన్ పత్రిక ‘అసాహి షింబున్’ ని ఉటంకిస్తూ బి.బి.సి ఈ వివరాలు తెలిపింది. దీని ప్రకారం మార్చి 11, 2011 న ఫుకుషిమా అణు ప్రమాదం జరిగిన తర్వాత తొమ్మిది నెలల అనంతరం డిసెంబరు లో కూడా రేడియేషన్ లీకేజి కొనసాగినట్లు స్పష్టం అవుతోంది. ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఫుకుషిమా లో రేడియేషన్ లీకేజి ని కట్టడి చేసారంటూ ప్రజా వ్యతిరేక, కంపెనీల అనుకూల ఎకాలజిస్టులు చేస్తున్న వాదనలు నిజం కాదని అర్ధం చేసుకోవచ్చు. మార్చిలో విడుదలయిన రేడియేషన్ డిసెంబరు వరకూ ఫుకుషిమా కర్మాగారం లోపలి గాలిలోనే కొనసాగదు. కనుక కర్మాగారంలోపల చట్టం అనుమతించే పరిమితికి మించే రేడియేషన్ లీకేజి కొనసాగుతోందన్నమాట.

“దాన్ని లెడ్ తో కప్పి ఉంచకపోతే రేడియేషన్ ఎక్స్ పోజర్ గరిష్ట పరిమితిని చేరుకుంటుంది. అప్పుడిక మనం పని చేయలేము” అని కంపెనీ అధికారి చెప్పినట్లు అసాహి షింబున్ తెలిపింది. రేడియేషన్ ఎక్స్ పోజర్ పరిమితి మించితే కార్మికుడికి ప్రమాదం కనుక పరిమితి దాటిన విషయం తెలియడానికి డొసి మీటర్ ని వాడతారు. అలాంటిది పరిమితే తెలియకుండా ఉండడానికి ప్రయత్నించడం అంటే మనుషుల ప్రాణాల కంటే, దేశం కంటే, వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని కంపెనీలు భావిస్తున్నాయని స్పష్టం అవుతోంది.

కంపెనీ అబద్ధాలు

అయితే టెప్కో తన అబద్ధాలను నిస్సిగ్గుగా కొనసాగిస్తోంది. బిల్డప్ కంపెనీ డొసి మీటర్ల కోసం లెడ్ కేసు లను తయారు చేసినట్లు తనకు తెలుసనీ కానీ వాటిని ఎన్నడూ ఉపయోగించలేదని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. నిజానికి లెడ్ కేసులు తయారు చేసినట్లు తెలుసని చెప్పడం అంటే జరగబోయేది కూడా కంపెనీకి తెలుసన్నది స్పష్టమే. బిల్డప్ కంపెనీ అధికారులే లెడ్ కేసు వినియోగించినట్లు చెప్పినా, అధికారి ఆదేశాలు రికార్డు చేశామని వర్కర్లు కూడా చెప్పినా తమ అక్రమాలు కప్పి పుచ్చుకోవడానికి టెప్కో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు, నియంత్రణ వ్యవస్ధల సహకారం లేకుండా ఈ అక్రమాలు కొనసాగడం సాధ్యం కాదు.

జపాన్ పార్లమెంటరీ కమిటీ నివేదిక కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ పరిశ్రమని నియంత్రించవలసిన నియంత్రణ వ్యవస్ధ, టెప్కో కంపెనీ పరస్పరం కుమ్మక్కయిన ఫలితమే ఫుకుషిమా అణు ప్రమాదం అనీ, ఈ ప్రమాదం మానవ నిర్మిత వినాశనమేనని కమిటీ తేల్చి చెప్పింది. అది నిజమేనని ఇప్పుడు మరోసారి రుజువయ్యింది.

వ్యాఖ్యానించండి