2011 రెండో అర్ధ భాగానికి గూగుల్ కంపెనీ ‘ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్’ వెలువరించింది. ఈ కాలంలో యూజర్ల కంటెంట్ ను తొలగించాల్సిందిగా ప్రభుత్వాల నుండి వచ్చిన ఆదేశాల సంఖ్యలో అమెరికా తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. అమెరికా, ఇండియా లు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలుగా వర్ధిల్లుతుండడం గమనార్హం. 2011 లో మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగంలో ఇండియా నుండి 49 శాతం ఎక్కువగా సెన్సార్ షిప్ ఆదేశాలు అందాయని గూగుల్ తెలిపింది. అమెరికా నుండి వచ్చిన ఆదేశాలు రెట్టింపు (103%) పెరిగాయని గూగుల్ నివేదిక తెలిపింది.
ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాల నుండి 1000 డిమాండ్లు అందగా ఇండియా నుండి 255 సార్లు సెన్సార్ షిప్ డిమాండ్లు అందాయని గూగుల్ నివేదిక తెలిపింది. భారత ప్రభుత్వం తొలగించమని కోరిన వాటిలో 133 యూ ట్యూబ్ వీడియోలు, 26 వెబ్ సెర్చ్ అంశాలు, 49 బ్లాగులు ఉన్నాయి. వెబ్ సెర్చ్ అంశాలంటే ఆ అంశాలపైన ఎవరు సెర్చ్ చేసినా ప్రభుత్వం కోరిన అంశాలు సెర్చ్ రిజల్ట్స్ లో కనపడకూడదన్నమాట. యూ ట్యూబ్ వీడియోల్లో 77 పరుగు భంగం ఆరోపణలున్నవి కాగా 10 జాతీయ భద్రతకు సంబంధించినవి.
మొత్తం మీద చూస్తే ప్రభుత్వాల నుండి ఎదురవుతున్న సెన్సార్ షిప్ డిమాండ్లు ప్రధానంగా రాజకీయాభిప్రాయాలపైనే ఉంటున్నాయని గూగుల్ తన నివేదికలో తెలిపింది. ఇంటర్నెట్ వినియోగదారులకు అందకుండా చేయడానికి వివిధ రాజకీయ అభిప్రాయాలను ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయని తెలిపింది. “యూజర్లు పోస్ట్ చేసిన పోలిటికల్ కంటెంట్ ను తొలగించాలని ప్రభుత్వాలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు మేము గమనించాము” అని గూగుల్ అధికారి ఒకరు చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కంటెంట్ గానీ, లింక్ లు గానీ తొలగించాలంటూ వచ్చిన వెయ్యి డిమాండ్లలో సగం వరకూ తాము అనుసరించామని కూడా గూగుల్ తెలిపింది.
యూజర్ల డేటా కోరుతూ ప్రభుత్వాలు చేస్తున్న రిక్వెస్టు లలో కూడా అమెరికా తర్వాత స్ధానం ఇండియాదే. అమెరికా మొత్తం 6,321 రిక్వెస్టులతో అగ్రస్ధానంలో ఉండగా, 2,207 రిక్వెస్టులతో ఇండియా రెండో స్ధానంలో ఉంది. అంటే యూజర్లతో సంబంధం లేకుండానే గూగుల్ లాంటి సంస్ధలు ప్రభుత్వాలకు యూజర్ల డేటా ను అందజేస్తున్నాయని స్పష్టమవుతోంది. ఈ దృష్ట్యా ఇంటర్నెట్ వినియోగదారులు తమ వివరాలను సోషల్ వెబ్ సైట్లలో పోస్ట్ చేయడం మానుకోవాలని గ్రహించవలసి ఉంది. అవసరమైన దాని కంటే ఎక్కువగా ఫోటోలు, వ్యక్తిగత జీవితంలోని వివిధ సంఘటనలు లాంటివి ఇంటర్నెట్ లో ఉంచకపోవడమే ఉత్తమం.
ప్రజాస్వామిక వ్యవస్ధలుగా గొప్పలు చెప్పుకునే దేశాల నుండే అధికంగా ఇంటర్నెట్ కంటెంట్ ను తొలగించాలని డిమాడ్లు రావడం పట్ల గూగుల్ ఆందోళన ప్రకటించింది. “భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. అయితే, ఆందోళన చెందవలసినది ఇదొక్కటే కాదు. ‘సెన్సార్ షిప్’ ను అమలు చేస్తాయని ఊహించలేని పశ్చిమ ప్రజాస్వామిక దేశాలు కూడా ఈ డిమాండ్లు చేస్తున్నాయి” అని గూగుల్ నివేదిక తెలిపింది. అయితే దాదాపు మూడేళ్ళ పాటు స్ట్రీట్ వ్యూ కార్ల ద్వారా ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో యూజర్ల డేటాను దొంగిలించిన గూగుల్ సంస్ధ ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వాలకు సుద్దులు చెప్పబూనుకోవడమే పెద్ద వింత.
గూగుల్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ ను ఇక్కడ చూడవచ్చు.
ఇండియా రిపోర్టు ఇక్కడ చూడవచ్చు.
అశ్లీల బ్లాగ్లలో ఒక బ్లాగ్ని మాత్రమే తొలిగించాలని భారత ప్రభుత్వం గూగుల్ని కోరింది. మన దేశంలో అశ్లీలతపైన కంటే రాజకీయ అభిప్రాయాలపైనే తీవ్రమైన సెన్సార్షిప్ ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది.
ఈ బ్లాగ్ని కూడా ప్రభుత్వం నిషేధిస్తుంది: http://gandhi.mlmedia.net.in
చూస్తూ ఉండండి.