ఓ వైపు ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను ఇండియా తగ్గించుకుంటుండగా ఇతర ఆసియా దేశాలు మాత్రం పెంచుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను దక్షిణ కొరియా 42 శాతం పెంచినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆంక్షలను చైనాతో పాటు అమెరికా మిత్ర దేశం దక్షిణ కొరియా కూడా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోంది.
కొరియా ప్రభుత్వ సంస్ధ ‘కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్’ మంగళవారం వెల్లడించిన గణాంకాలను ప్రెస్ టి.వి ఉటంకించింది. ఏప్రిల్ నెలలో సౌత్ కొరియా మొత్తం 7.5 మిలియన్ బారెళ్ళ క్రూడాయిల్ దిగుమతి చేసుకుందని సదరు గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకి 250,000 బారెళ్ళు అన్నమాట. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో రోజుకి 200,000 బ్యారేళ్లు మాత్రమే సౌత్ కొరియా, ఇరాన్ నుండి దిగుమతి చేసుకుందని రాయిటర్స్ తెలిపింది.
జనవరి-ఏప్రిల్ కాలంలో చూసినా ఇరాన్ నుండి సౌత్ కొరియా చేసుకున్నా క్రూడ్ దిగుమతులు ఎక్కువే. ఈ నాలుగు నెలల్లో 25.25 మిలియన్ బ్యారెళ్లు కొరియా దిగుమతి చేసుకుంది. కొరియా ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఎస్.కె.ఎనర్జీ, హ్యుండై ఆయిల్ బ్యాంక్ లు ఇరాన్ ఆయిల్ దిగుమతులు పెంచుకోవాలని ఒప్పందం కూడా చేసుకున్నట్లు కొరియా ప్రభుత్వం, కంపెనీలను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది.
ఇరాన్ క్రూడాయిల్ వ్యాపారం పైన అమెరికా జనవరి 1 న ఆంక్షలు విధించగా, యూరోపియన్ యూనియన్ జనవరి 23 న ఆంక్షలు ప్రకటించింది. ఈ ఆంక్షలకు ఐక్యరాజ్య సమితి అనుమతి లేదు. ఇరాన్ పైన కక్షతో విధించిన ఆంక్షలివి. సమితి ఆంక్షలతో పాటు సొంతగా విధించిన ఆంక్షలను సైతం అమలు చేయాలని అమెరికా, ఇ.యు లు ఇండియా, చైనా లాంటి దేశాలపైనా ఒత్తిడి తెస్తున్నాయి. ఆంక్షలు జులై 1 నుండి అమలులోకి రానున్నాయి.
ఇరాన్ పై తాను విదించిన ఆంక్షలను అమలు చేయించడానికి అమెరికా ఇండియా, చైనా, సౌత్ కొరియా, జపాన్ లపై కేంద్రీకరించింది. యూరప్ దేశాలకు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చిన అమెరికా తన మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియా, ఇండియా లకు మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఇండియా, చైనా లపై ఒత్తిడి తేవడానికి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇటీవల చైనా, ఇండియా లు పర్యటించి వెళ్లింది కూడా.
అమెరికా ఆంక్షలకు లోంగేది లేదనీ, పశ్చిమాసియాలో ఇండియాకు పదుల కొద్దీ బిలియన్ల వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనీ, అరవై లక్షల మంది భారతీయులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారనీ కనుక ఆంక్షలు అమలు చేయబోమనీ ఇండియా హిల్లరీకి చెప్పినట్లు విదేశీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తెలిపాడు. తీరా వాస్తవంలో చూస్తే ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను ఇండియా గణనీయంగా తగ్గించుకుంది. దాదాపు 13 శాతం ఇరాన్ ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించుకుందని కొన్ని పత్రికలు తెలిపాయి. ఈ తగ్గుదల కంపెనీలు తీసుకున్న వ్యాపార నిర్ణయం తప్ప విధాన నిర్ణయం కాదని కృష్ణ చెబుతున్నాడు.
అయితే ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించే వైపుగా కృషి చేయాలని భారత ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం లోపాయకారీ ఆదేశాలిచ్చిందని కొన్ని పత్రికలు వార్తా కధనాలు ప్రచురించాయి. తమ ఒత్తిడి మేరకు భారత్, ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులు తగ్గించుకుందనీ, ఇంకా తగ్గించుకోవాలనీ హిల్లరీ క్లింటన్ భారత పర్యటనలో చెప్పిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.
జులై 1 నుండి ఆంక్షలు అమలు చేయాలని అమెరికా, ఇ.యు లు ప్రపంచ దేశాలను డిమాండ్ చేస్తుండగా ఇండియా ఇప్పటి నుండే ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులు తగ్గించుకుంటోంది. మరో పక్క సౌత్ కొరియా, చైనా లు తమ అవసరాలను తగ్గించుకోకుండా ఇరాన్ దిగుమతులను పెంచుకుంటూ పోతున్నాయి.
దక్షిణ కొరియా అమెరికా సామ్రాజ్యవాదుల అర్థవలస దేశం (semi-colony). ఆ దేశం అమెరికా ఆదేశాలని ధిక్కరించడం గొప్పే.
Cruid oil digumathi thaggincharu iran nunchi phalithma ga India lo Fuel rate increase ayyindhi America baganevundhi Penchina congress govt Nayakulu Bagane vunnaru ( More than 10 Genrations money earned each politician) Chivariki samanya Manavudu ibbandhi padutunnadu.