భారత దేశ ప్రజలు తమ వద్దకు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ పార్టీనీ నమ్మని పరిస్ధితికి చేరుకున్నారని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఏదో ఒక పార్టీకి పట్టం కట్టినట్లు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఒకే సమయంలో దేశవ్యాపితంగా ఒకే పార్టీని నమ్మే పరిస్ధితి ఇక రాకపోవచ్చన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించడానికే పరిమితమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అంటే పార్టీలు ప్రకటిస్తున్న విధానాలు, మేనిఫెస్టోల ప్రాతిపదికన కాకుండా అధికారంలో ఉన్న పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే ప్రత్యర్ధి పార్టీల గెలుపుకు కారణంగా ఉంది.