గుజరాత్ కోర్టులో ‘మోడి’కి మొట్టికాయ


గుజరాత్ లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మరొక ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ పూనుకుని, స్వతంత్రంగా చేసిన లోకాయిక్త నియామకం చెల్లదనీ, అది రాజ్యంగ వ్యతిరేకం  అని వాదిస్తూ గజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్టు, మెజారిటీ తీర్పు ద్వారా కొట్టి వేసింది.

గుజరాత్ గవర్నర్ ‘కమ్లా బెనీవాల్’ ఆగష్టు 25, 2011 తేదీన రిటైర్డ్ జస్టిస్ ఆర్.ఎ.మెహతా ను గుజరాత్ ‘లోకాయుక్త’ గా నియమించింది. రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ల అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన లోక్ పాల్ చట్టం డిమాండ్ చేస్తూ అన్నా బృందం సాగించిన ఉద్యమానికి బి.జె.పి పూర్తి మద్దతును అందించిన నేపధ్యంలో తాజా కోర్టు తీర్పు ఆసక్తికరంగా మారింది. అప్పటికి ఎనిమిది సంవత్సరాలుగా గుజరాత్ రాష్ట్రానికి లోకాయుక్త నియామకం జరగలేదు.

ఓ వైపు అన్నా హాజారే ఉద్యమానికి కార్యకర్తలను సరఫరా చేసిన ఆర్.ఎస్.ఎస్, అనుబంధ సంస్ధలు తమ ప్రియతమ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తన రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలుగా లోకా యుక్తను నియమించనప్పటికి నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. లోకాయుక్త నియామకం జరపకపోయినప్పటికీ అన్నా హాజారే, నరేంద్ర మోడి పాలనను అవినీతి రహిత పాలనగా కొనియాడడం ఏ కోవలోకి వస్తుంది?

ఎనిమిది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న లోకాయుక్త పదవికి రాష్ట్ర గవర్నరు స్వయంగా పూనుకుని రిటైర్డ్ జడ్జి ని లోకాయుక్త గా నియమించినపుడైనా గుజరాత్ ప్రభుత్వం సహకరించి ఉండవలసింది. నరేంద్ర మోడి నాయకుడుగా ఉన్న బి.జె.పి, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి క్రియాశీలక మద్దతు ఇచ్చిన నేపధ్యంలోనైనా గుజారాత్ లోకాయుక్త నియామకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉండవలసింది. లేదా లోకా యుక్త గా నియమితుడైన రిటైర్డ్ జడ్జి పట్ల ఏమయినా ఫిర్యాదులు ఉన్నట్లయితే అవైనా ముందుకు తీసుకు రావలసింది.

కేవలం కాంగ్రెస్ నియమించిన గవర్నర్ పూనుకుని నియమించినందున లోకా యుక్త నియామకంపైన గుజరాత్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళినట్లు కనిపిస్తోంది. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్మరిస్తూ’ గవర్నరు లోకా యుక్త నియామకం చేశారనీ, అది రాజ్యాంగ విరుద్ధమనీ మోడి ప్రభుత్వం వాదించింది. ఈ వాదనను మెజారిటి జడ్జిలు తిరస్కరించారు. గవర్నర్ చేత లోకాయుక్త నియామకం ‘రాజ్యాంగబద్ధమే’ అని ఇద్దరు జడ్జిలు తీర్పు చెప్పగా, ఒకరు ‘రాజ్యాంగ విరుద్ధం’ అని తీర్పు చెప్పడం గమనార్హం. సాక్ష్యాత్తూ రాష్ట్ర హైకోర్టు జడ్జిల మధ్యనే ‘భారత రాజ్యాంగ నిబంధనలను’ అన్వయించడంలో పూర్తి భిన్న వైఖరులను ప్రదర్శించడం మరొక అభాస.

లోకాయుక్త నియామకం జరిగిన తర్వాత రోజే ఆ నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుని ఆశ్రయించింది. జస్టిస్ కురేషి గవర్నర్ చర్యను సమర్ధించగా, జస్టిస్ గొకాని గవర్నర్ చర్యను రాజ్యాంగవిరుద్ధంగా కొట్టివేశారు. తీర్పు విభజన జరగడంతో మూడవ జడ్జి వి.ఎం.సహాయ్ ముందుకు కేసు చేరుకుంది. “విభేధాలు తలెత్తిన పాయింట్లకు సంబంధించి జస్టిస్ సోనియా గోకాని తో నేను ఏకీభవించడం లేదు. నా సోదర జడ్జి అకిల్ కురేషి అభిప్రాయాలతొ నేను ఏకీభవిస్తున్నాను” అని జస్టిస్ సహాయ్ తీర్పు చెప్పాడు. “కనుక ప్రభుత్వ పిటిషన్ కొట్టివేయడమైనది” అని కోర్టు తీర్పు పేర్కొంది.

One thought on “గుజరాత్ కోర్టులో ‘మోడి’కి మొట్టికాయ

  1. This case clearly shows the double standards of BJP and hypocrisy of hindutva brigade in supporting Anna Hazare. Anna should be careful in choosing his companions or else his integrity will be at stake.

వ్యాఖ్యానించండి