యురేనియం ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -1


భారత్ నూ, పాకిస్ధాన్ నూ సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను పాకిస్ధాన్ కోరింది. ఇండియాకు యురేనియం ఖనిజాన్ని అమ్మడానికి ఆస్ట్రేలియా పాలక లేబర్ పార్టీ ఆదివారం ఆమోదం తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పాకిస్ధాన్, తమను కూడా ఇండియాతో సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను కోరింది. యురేనియం కొనుగోలు చేయడానికి తమను కూడా అనుమతించాలని కోరింది.

అణు రియాక్టర్లలో యురేనియం ను ఇంధనంగా వాడతారన్నది తెలిసిందే. ప్రపంచంలోకెల్లా యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో అధికంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్.ఎస్.జి) లో సభ్యదేశం. 1974 లో భారత దేశం అణు పరీక్ష జరిపాక దానికి సమాధానంగా ఈ గ్రూపు ఏర్పడింది. ప్రారంభంలో ఏడు దేశాలు ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నాయి. వివిధ దేశాలు విడిపోయి మరిన్ని దేశాలు ఏర్పడడం వలనా, ఇంకా ఇతర కారణాల వలనా అది ప్రస్తుతం నలభై ఆరుకు చేరింది.

అణు పదార్ధాలను గానీ, అణు సాంకేతిక పరిజ్ఞానం గానీ ఇతర దేశాలకు అమ్మడానికి ఈ గ్రూపు దేశాలు కొన్ని నిబంధనలు విధించుకున్నాయి.  అణు పధార్ధాలు గానీ, సాంకేతిక పరిజ్ఞానం గానీ సరఫరా చేయాలంటే ఆఈ కావలసిన దేశాలు ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం’ (న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ) పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి ఈ దేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి ఏమన్నా పాటుపడుతున్నాయా అంటే అదేమీ లేదు. కేవలం పెత్తనం చేయడానికే ఈ గ్రూపు ఏర్పడింది.

తాము తప్ప మరొక దేశం స్వంతగా అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం ఈ పెత్తందారీ గ్రూపుకి నేతృత్వం వహిస్తున్న అమెరియా, యూరప్ లకు ఇష్టం ఉండదు. వీరు గుట్టలు గుట్టలు అణ్వస్త్రాలు పేర్చుకున్నా ప్రపంచానికి రాని ప్రమాదం ఇరాన్, ఉత్తర కొరియా, ఇండియా, పాకిస్ధాన్ లాంటి దేశాలు స్వంతంగా తమ రక్షణ కోసం అణ్వస్త్రాలు తయారు చేసుకుంటే వస్తుందని తెగ బాధపడిపోతుంటాయి. ఆ పేరుతో ప్రపంచ దేశాలపైన అణు గూండాగిరీ చేస్తుంటాయి. ఆ గూండాగిరీలో భాగంగానే ఇండియాకి ఈ దేశాలు ఇప్పటివరకూ అణు పదార్ధాలు గానీ, అణు సాంకేతిక పరిజ్ఞానం గానీ అమ్మలేదు.

ఆర్ధీక సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికాకు తమ దగ్గర పేరుకుపోయిన అణు రియాక్టర్లను అమ్ముకోవడానికి మార్కెట్లు కావలసి వచ్చింది. తాము వాడకుండా పడేసిన రియాక్టర్లను అమ్ముకోవడానికి ఇండియా తేరగా కనపడింది. ఇంకేం, 2008 లో ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం లో భాగంగా పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నామని భారత ప్రభుత్వం తన ప్రజలకు చెప్పింది. ఈ ఒప్పందంతో అణు ఏకాకితనం నుండి ఇండియాను అమెరికా బైటికి లాగిందని పశ్చిమ దేశాలు, వారి పత్రికలు ఇప్పటికీ ఊదగగొడుతుంటాయి. ఒప్పందం ద్వారా ఇండియా మార్కెట్ ను దొరకబుచ్చుకున్నామన్న సంగతి అవి చెప్పవు. భారత ప్రభుత్వం కూడా తన ప్రజలకు ఆ విషయం చెప్పకుండా అణు విద్యుత్ కోసం ‘పౌర అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామనే చెబుతోంది.

అమెరికాలో ‘త్రీ మైల్ ఐలాండ్’ లో అణు విద్యుత్ కర్మాగారం పేలుడు సంభవించాక ఇంతవరకూ మరో అణు విద్యుత్ కర్మాగారాన్ని అమెరికా నిర్మించలేదు. అది నిర్మించకుండా ఇండియా లాంటి దేశాలకు అంటగడుతోంది. అంటగడుతూ తానెంతో ఔదార్యంతో రియాక్టర్లు అమ్ముతున్నట్లుగా ఫోజు పెడుతోంది. కాని ఇప్పటివరకూ అమెరికా ఇండియాతో ఒప్పందానికి దిగలేదు.

-(ఇంకా ఉంది)

వ్యాఖ్యానించండి