విదేశాలలో ఉన్న కొన్ని కార్యాలయాల కంప్యూటర్లలోకి వైరస్ ప్రవేశపెట్టారని తెలుస్తోంది. అయితే సదరు కంప్యూటర్ల నుండి విలువైన సమాచారాన్ని గానీ, రహస్య సమాచారాన్ని గానీ దొంగిలించలేదని కేబినెట్ ఛీఫ్ సెక్రటరీ ఒసాము ఫ్యుజిమురా ఒక పత్రికల సమవేశంలో తెలియజేశాడు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నేరస్ధులను గుర్తించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లుగా ఒసాము తెలిపాడు.
జపాన్ పార్లమెంటు ‘డైట్’ లో దిగువ సభకు చెందిన సర్వర్ భద్రతా ఉల్లంఘన జరిగిందని పోలీసులకు రిపోర్టు చేసారు. చట్ట సభకు చెందిన ముగ్గురు సభ్యుల కంప్యూటర్ల ద్వారా సర్వర్ భద్రతకు ముప్పు ఏర్పడిందనీ, వారి కంప్యూటర్లు వైరస్ బారిన పడ్డాయనీ తెలుస్తోంది. కాని సర్వర్లనుండి సున్నితమైన సమాచారం ఏదీ లీకయినట్లుగా నిర్ధారణ జరగలేదని కూడా చెబుతున్నారు.
జపాన్ లో అతి పెద్ద రక్షణ కాంట్రాక్టు సంస్ధకు చెందిన కంప్యూటర్లు సైబర్ దాడులకు గురయ్యాయని నెల క్రితం స్ధానిక పత్రికలు వార్తలు ప్రచురించాయి. దాడులు ఎదుర్కొన్న సంస్ధల్లో మిత్సుభిషి హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఉందని అవి రాశాయి. మిత్సుబిషి సంస్ధ జపాన్ లో అతి పెద్ద డిఫెన్స్ కాంట్రాక్టింగ్ సంస్ధగా పేరు పొందింది. ఆ సంస్ధ కంప్యూటర్ల నుండి మిలట్రీ విమానాలు, అణు విద్యుత్ కర్మాగారాలు తదితరాలకు సంబంధించిన వివరాలను హ్యాకర్లు దొంగిలించి ఉండవచ్చని క్యోడో తెలిపింది.
సైబర్ దాడులు అనగానే చైనా నుండి వస్తున్న దాడులే నన్న అభిప్రాయాన్ని అమెరికా, యూరప్ లు ఇప్పటికే బాగా ప్రచారం చేసి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ సైబర్ దాడులు జరిగినా అది చైనా నుండే అని అవి ప్రచారం చేస్తూ వచ్చాయి. నిజానికి చైనాతో పాటు సైబర్ దాడులు చెయ్యవలసిన అవసరం, చెయ్యగల సత్తా అమెరికా, యూరప్ లకు కూడా ఉన్నప్పటికీ అవి చైనాపై ఆరోపణలు చేయడం ద్వారా ఆరోపణలు తమపైకి రాకుండా తప్పించుకోగలుగుతున్నాయి. ఈ సారి చైనాను దోషిగా ఎవరూ ఇంకా పేర్కొనకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
