ఆగ్రహంతో ఉన్న యెడ్యూరప్ప తన ల్యాప్ టాప్ ను లాక్కొని విసిరేసి పగలకొట్టాడని మీడియాలో వచ్చిన వార్తను వెంకయ్య నాయుడు ఖండించాడు. తానసలు లాప్ ట్యాప్ ని మోసే పనిని పెట్టుకోననీ ఇక మరొకరు లాక్కొని పగలగొట్టే పరిస్ధితే తలెత్తదనీ వెంకయ్య నాయుడు అన్నాడు.
తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలో సంతకం పెట్టడానికి నిరాకరించడంతో అగ్రహంతో వెంకయ్య నాయుడు చేతిలోని ల్యాప్ టాప్ లాక్కొని నేలకేసి విసిరి కొట్టినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టు డే పత్రికలు వెల్లడించాయి. ఈ వార్త నిజంకాదని బి.జె.పి మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు తెలిపాడు.
“యెడ్యూరప్ప సహనం కోల్పోయి నా ల్యాప్ టాప్ ను పగలకొట్టాడన్న వార్త పూర్తిగా తప్పు. ఆధారాలు లేని వార్త అది” అని వెంకయ్యనాయుడు అన్నాడు.” యెడ్యూరప్పను, ఆయన రాజీనామా చేయకముందు తానసలు కలవనే లేదని ఆయన తెలిపాడు. రాజీనామా చేసి లేఖను గడ్కారీకి పంపేవరకూ తానసులు యెడ్యూరప్పను కలవలేదని ఆయన తెలిపాడు. “రాజీనామా చేశాక మేమొక సామాజిక సభలో కలుసుకున్నాము. అక్కడ అటువంటి ఘటనే జరగలేదు. ఈ అంశాన్ని మీడీయా సంఘాల దృష్టికి తీసుకెళ్తాను అని వెంకయ్య నాయుడు తెలిపాడు.
జరిగిన విషయాన్ని మార్చి చెప్పడంలో మీడియా దిట్ట కావచ్చు. జరిగిన ఘటనకు అదనపు కధనాలను అల్లి ప్రచారం చేయడంలోనూ మీడియా పేరెన్నిక గన్నది కావచ్చు. కానీ అసలే జరగని సంఘటనను కూడా మీడియా రిపోర్టు చేస్తున్నదా? అది నిజమే అయితే మన భారత మీడియా కూడా అంతర్జాతీయ కార్పొరేట్ మీడియా స్ధాయికి అభివృద్ధి చెందిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. నిజం కానట్లయితే అది వెంకయ్య నాయుడు గారికీ, యెడ్యూరప్ప గారికీ సంబంధించిన విషయం. వారు ప్రజా జీవితంలో ఉన్నందున ప్రజలకు కూడా కొంతయినా సంబంధం ఉన్న విషయం.
