ప్రభుత్వం శాటిలైట్ ఫోన్లను వినియోగించడానికి లేదా భద్రమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ని వేరే అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తున్నదని చౌహాన్ తెలిపాడు. ఛీఫ్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరితోనూ ఫోన్లు కలవలేదని ఆయన తెలిపాడు. “ఈ విధంగా 15 నిమిషాల పాటు ఫోన్లు పని చేయని పరిస్ధితి మళ్ళీ తలెత్త కూడదు. అందుకోసం సెక్యూర్ నెట్వర్క్ ని అభివృద్ధి చేసేవిషయమై నేను నేషనల్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడుతున్నాను” అని చౌహాన్ చెప్పాడు. రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి ఉన్న ‘వెరీ హై ఫ్రీక్వెన్సీ’ (వి.హెచ్.ఎఫ్) నెట్ వర్క్ ని మళ్ళీ పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన చెప్పాడు. ఈ వ్యవస్ధను గతంలో స్ధాపించినప్పటికీ ఇప్పుడు వినియోగంలో లేదని తెలుస్తోంది.
పోలీసు వ్యవస్ధను ఆధునీకరించే పరికరాలను సంపాదించే విషయాన్ని కూడా చౌహాన్ ప్రస్తావించాడు. ప్రముఖమైన కూడళ్ళలో “క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల”ను (సి.సి.టి.వి) నెలకొల్పవలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించాడు. పోలీసులకు అధునిక పరికరాలను సంపాదించడం ఎందుకు కష్టంగా మారుతున్నదో పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపాడు. “రామ్ ప్రధాన్ కమిటీ రిపోర్టు” సిఫారసు చేసిన అన్ని అంశాలు నెరవేరలేదు. ప్రత్యేకించి సి.సి కెమెరాలను కొనలేదు. వాటిని సముపార్జించడం సమస్యగా ఉందని చెబుతున్నారు. పోలీసు వ్యవస్ధ ఆధునికీకరణ అవసరమైనంత వేగంగా జరగలేదు. ఈ విషయం పరిశీలించాల్సి ఉంది” అని చౌహాన్ తెలిపాడు.
ఇప్పుడు మూడు చోట్ల బాంబులు పేలి విధ్వంసం జరిగి ఇరవైమందికి పైగా చనిపోయిన తర్వాతనే మహారాష్ట్ర సి.ఎం పోలీసు వ్యవస్ధ ఆధునికీకరణ గురించి మాట్లాడుతున్నాడు తప్ప అంతకు ముందు ఆయనైనా దానిపై దృష్టి ఎందుకు సారించలేదో చెప్పాల్సి ఉంది. ముంబైలో మళ్ళీ పేలుళ్ళు జరిగాక ప్రధాని వచ్చి “మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామ”ని హామీ ఇచ్చి పోయాడు. మూడేళ్ళ క్రితం తాజ్ హోటల్ పైనా ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ టెర్రరిస్టు దాడులు జరిగినప్పుడు కూడా ఇవే మాటలు వల్లించారు. ఇపుడు మళ్ళీ జరిగితే అవేమాటలు చెబుతున్నారు. మరొక సారి జరిగినా అవే మాటలు తప్ప నిర్ధిష్ట చర్యలు తీసుకోనే ఆలోచన ప్రభుత్వాధిపతులకు ఎప్పటికి వస్తుందో మరి?
టెర్రరిస్టు చర్యలు, దాడులు, పాలక వర్గాల విధానాల ఫలితమే అని గుర్తిస్తే తప్ప టెర్రరిస్టు దాడులకు పరిష్కారం దొరకదు.
