ఆఫ్రికాపై సామ్రాజవాద ఆధిపత్యం కోసం అమెరికా దీర్ఘకాలిక యుద్దం -జేమ్స్ పెట్రాస్


ఆఫ్రికా ఖండంలోని దేశాలలోని వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా 1950 ల నుండే మిలట్రీ జోక్యం ప్రారంభించిందనీ, దానిలో భాగంగానే ప్రస్తుతం లిబియాలోని గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన దిష్టిబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్సు, బ్రిటన్ లతో కలిసి దురాక్రమణ దాడులకు పూనుకుందని అమెరికాకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జేమ్స్&‌ పెట్రాస్ వివరించాడు. ఆయన మాటల్లొనే చెప్పాలంటే:

——————–

“కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్” ఆధ్వర్యంలో ‘లారెన్ ఫ్లోక్’ అధ్యయనం చేసి ఒక నివేదికను నవంబరు 16, 2010 తేదీన కాంగ్రెస్ కి సమర్పించాడు. దాని పేరు, “Africa Command: U.S. strategic interests and the role of the military in Africa (ఆఫ్రికా కమాండ్: అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు మరియు ఆఫ్రికాలో మిలట్రీ పాత్ర)” దాని ప్రకారం అమెరికాకి క్లయింట్లుగా ఉన్న నియంతృత్వ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చి నిలబెట్టాడానికీ, లేదా అమెరికాకి వ్యతిరేకంగా డజన్ల సంఖ్యలో ఉన్న ప్రభుత్వాలను కూలదోయడానికీ అమెరికా కొన్ని వందల నుండి అనేక వేల సంఖ్యలో యుద్ద సైనికులను, డజన్లకొద్దీ ఫైటర్ విమానాలు, యుద్ధనౌకలనూ దాదాపు వార్షిక ప్రాతిపదికన పంపించింది. ప్రస్తుత లిబియా జోక్యానికి ముందు కనీసం 46 సార్లు ఆఫ్రికాలో అమెరికా జోక్యం చేసుకున్నట్లుగా ఈ నివేదిక తెలుపుతోంది. అమెరికా ఒకసారి గానీ లేదా అంతకంటే ఎక్కువ సార్లు గానీ మిలట్రీ జోక్యం చేసుకున్న దేశాలు: కాంగో, జైరే, లిబియా, ఛాద్, సియర్రా లియోన్, సోమాలియా, రువాండా, లైబీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గాబన్, గినియా-బిస్సౌ, కీన్యా, టాంజానియా, సూడాన్, ఐవరీ కోస్టు, ఇధియోపియా, జిబౌటి, ఎరిత్రియా.

అమెరికా మిలట్రీ జోక్యం ద్వారా మేలు జరిగిన సంఘటన వీటిలో కేవలం ఒక్కసారే చోటు చేసుకుంది. 1956 లో ఇజ్రాయెల్-ఫ్రెంచి-బ్రిటిష్ సైన్యాలు సూయెజ్ కెనాల్ ను అక్రమంగా ఆక్రమించుకున్నపుడు అమెరికా జోక్యం చేసుకుని అవి తమ సైన్యాలను ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసింది. 1950 లమధ్య నుండి 1970 ల  చివరి వరకూ అనేక సార్లు పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా మిలట్రీ జోక్యం చేసుకున్నప్పటికీ కేవలం నాలుగు సంఘటనలలు మాత్రమే అధికారిక రికార్డుల్లో నమోదయ్యింది. 1980 1991 ల మధ్య రీగన్, బుష్ సీనియర్ ల కాలంలో వేగం పుంజుకుని ఈ సంఖ్య 8 కి చేరుకుంది. వీటిలో ఇతర ముసుగుల్లో పరోక్షంగా పెద్ద ఎత్తున జోక్యం చేసుకున్న ఘటనలు, ప్రత్యేక బలగాలను దింపిన ఘటనలు కలిసి లేవని గమనించాలి.

ఆ తర్వాత క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో అమెరికా మిలట్రీ సామ్రాజ్యవాదం కొత్త పుంతలు తొక్కింది. 1992 నుండి 2000 వరకూ 17 సార్లు మిలట్రీ చొరబాట్లు చోటు చేసుకున్నాయి. వీటిలో సోమాలియాపై జరిపిన దాడి, జాతి హత్యాకాండకు పాల్పడిన రువాండా పాలకులకు మద్దతుగా జోక్యం కూడా కలిసి ఉన్నాయి. లైబీరియా, గాబన్, కాంగో, సియర్రా లియోన్ దేశాల్లో దీర్ఘకాలం కొనసాగిన తమ అనుచర నియంతృత్వ ప్రభుత్వాలను కాపాడ్డానికి క్లింటన్ ప్రభుత్వం మిలట్రీ ని వినియోగించింది. తమకు వ్యతిరేకంగా ఉన్న సూడాన్ పై బాంబులు కురిపించాడు. కీన్యా, ఇధియోపియాల్లోని కీలుబొమ్మ ప్రభుత్వాలని కాపాడ్డం కోసం సోమాలియాపై దాడులు చేయడానికి సైన్యాన్ని పంపించాడు. జూనియర్ బుష్ నేతృత్వంలో 15 సార్లు ఆఫ్రికాలో మిలట్రీ జోక్యం చేసుకుంది అమెరికా. ఇప్పుడు ఒబామా నేతృత్వంలో లిబియాలో సైనిక జోక్యం చేసుకోవడం అమెరికా సామ్రాజ్యవాద విధానాల కొనసాగింపుగానే జరిగింది.

——————

మరింత సమాచారానికి జేమ్స్ పెట్రాస్ వెబ్ సైట్ చూడవచ్చు.

వ్యాఖ్యానించండి