
Raihan 2nd Left, Miraya far right
ప్రియాంక గాంధీ వాద్ర ఈ రోజు (డిసెంబర్ 21, 2021) ఒక నమ్మశక్యం కానీ విషయాన్ని వెల్లడి చేశారు. ఆమె పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందట!
ఇది నిజంగా నిజమేనా?!
ఇది నిజమే అయితే బహుశా అంతకంటే దరిద్రమైన ఆరోపణ మోడి ప్రభుత్వం ఇక ఎదుర్కోబోదేమో!
ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రైహన్ వాద్రా, వయసు 20 సం.లు. అమ్మాయి పేరు మిరాయ వాద్రా, వయసు 18 యేళ్ళు.
ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ తయారు చేసిన పెగాసస్ స్పై వేర్ ద్వారా ఫోన్ హ్యాకింగ్ కి గురైన వారిలో ప్రియాంక గాంధీ కూడా ఒకరు.
ఎన్ఎస్ఓ కంపెనీ తన పెగాసస్ స్పై వేర్ సాఫ్ట్ వేర్ ను కేవలం ప్రభుత్వాలకు గానీ లేదా ప్రభుత్వం ఆధీనం లోని గూఢచార, పోలీసు సంస్ధలకు గానీ మాత్రమే అమ్ముతానని వ్యక్తిగత కస్టమర్లకు పెగాసస్ సాఫ్ట్ వేర్ ఇవ్వం అనీ అనేకసార్లు ప్రకటించింది.
కనుక భారత దేశంలో మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వమే పెగాసస్ ద్వారా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తలు, ఎన్జిఓ నేతలు, ప్రజా సంఘాల నేతలు… ఇలా అనేక మంది ఫోన్లను హ్యాకింగ్ చేసిందని భావిస్తున్నారు.
పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాకింగ్ కి గురైన కొంతమంది జర్నలిస్టులు, లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తూ సుప్రీం కోర్టు కూడా ఇదే అభిప్రాయంతో పిటిషన్ ని విచారిస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే పెగాసస్ ని వినియోగిస్తున్నారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం పదే పదే నిరాకరించింది.
ఇప్పుడు ప్రియాంక గాంధీ తన పిల్లల సోషల్ మీడియా ఖాతాలను కూడా మోడి ప్రభుత్వం హ్యాకింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ నిజం అయితే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నీతి, నైతిక సూత్రాలనూ గంగలో కలిపేసిందని భావించవచ్చు.
యూపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తమ పార్టీ నేతల ఫోన్ సంభాషణలపై యోగి ప్రభుత్వం నిఘా పెట్టిందని, తమ సంభాషణలను వింటున్నదని రెండు రోజుల క్రితం ఆరోపించాడు. ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రియాంక గాంధీ అభిప్రాయం అడిగినప్పుడు ఆమె ఈ సంగతి చెప్పారు.
“ఫోన్ ట్యాపింగ్ అలా ఉంచండి. వాళ్ళు నా పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను కూడా హ్యాక్ చేశారు. ప్రభుత్వానికి మరేం పని లేదా?” అని ఆమె ప్రశ్నించారు.
ప్రతి ఎన్నికలకు ముందు మోడి ప్రభుత్వం ప్రత్యర్ధి పార్టీల నేతల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ వారి చేతా, ఎన్ఫోర్స్^మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చేతా దాడులు చేయించడం ఒక ఆనవాయితీగా మారింది. తమిళనాడు ఎన్నికల ముందు ఏఐఏడిఎంకే నేతల పైన దాడులు జరిగాయి. బెంగాల్ ఎన్నికల ముందు టిఎంసి నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇక కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులకు లెక్కే లేదు.
ఇప్పుడు యూపి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎస్పి నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఎస్పి జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ కి చెందిన ఇళ్లపైనా మరో ముగ్గురు ఎస్పి నేతల ఇళ్లపైనా గత శనివారం దాడులు చేశారు.
ఆ తర్వాత రోజు అఖిలేశ్ యాదవ్ యోగి ప్రభుత్వం పైన ఆరోపణలు చేశాడు. అంటే ఎస్పి నేతల ఫోన్ సంభాషణలను విని వాటిలో సమాచారాన్ని బట్టి ఆదాయ పన్ను శాఖ దాడులు జరిగాయని అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు సూచిస్తున్నాయి.
ప్రియాంక గాంధీ పిల్లలు పబ్లిక్ గా కనపడడం చాలా తక్కువ. అమేధి ఎన్నికల లాంటి సందర్భాల్లో తప్ప వారు ఫోటోలకు దొరకడం అరుదు. అలాంటి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్ని హ్యాక్ చేయడం కంటే మించిన దౌర్భాగ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా?
కానీ ప్రియాంక గాంధీ పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాల్లో ఏమి దొరుకుతుంది? వాటిని హ్యాక్ చెయ్యడం వల్ల ఏమిటి ప్రయోజనం? అవి హ్యాక్ అయినట్లు ఆ పిల్లలకు ఎలా తెలిసింది?
అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరు చెప్పి కాంగ్రెస్ కంటే పచ్చి అవినీతి పార్టీ అయిన బిజెపిని గెలిపించిన అన్నా హజారే ఋణం తీర్చుకుందాం, ఎమ్మెల్యే అయ్యే వయసు కూడా లేని పిల్లల అకౌంట్లని హ్యాక్ చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక.