
సోలార్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఇండియాకు మరో ఓటమి ఎదురయింది. అమెరికాకు అనుకూలంగా WTO ఇచ్చిన తీర్పుపై ఇండియా అప్పీలుకు వెళ్లగా అప్పిలేట్ బోర్డు కూడా అమెరికా వాదనకు మద్దతుగా వచ్చింది. దానితో అమెరికా సోలార్ విద్యుత్ కంపెనీలు ఇండియాలో ముడి సరుకులను వినియోగించి ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేయాలన్న ఇండియా వాదన మరో ఓటమి ఎదుర్కొంది.
జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ పధకం కింద కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాకాలు ప్రకటించింది. ఈ పధకం కింద దేశీయ సోలార్ పరిశ్రమలను ప్రోత్సహించడం మానుకుని ‘పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పేరుతొ దొడ్డి దారిన విదేశీ కంపెనీలకు స్వాగతం పలికింది. దానితో ‘ఒంటె గుడారం’ సామెత తరహాలో మొత్తం సోలార్ విద్యుత్ మార్కెట్ ప్రక్రియను తమ చేతుల్లో తీసుకునేందుకు విదేశీ కంపెనీలు ఉపక్రమించాయి.
అమెరికన్ కంపెనీలు పధకం లోని లొసుగులను ఉపయోగించుకుని సోలార్ విద్యుత్ మార్కెట్ ను చేజిక్కించుకునే కృషిలో నిమగ్నం కావడంతో ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న భారత కంపెనీలు మూసివేతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. మోజర్ బేర్, ఇండో సోలార్ తదితర కంపెనీలు తమకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్ధితుల గురించి కేంద్రానికి మొర పెట్టుకున్నాయి.
దానితో దేశీయ కంపెనీలకు కొంతయినా తోడ్పడాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం కొన్ని షరతులు ప్రవేశపెట్టింది. అమెరికా లేదా ఇతర విదేశీ కంపెనీలు సరఫరా చేసే సోలార్ ప్యానెళ్ల తయారీలో కనీసం 8 శాతం అయినా దేశీయంగా సేకరించిన ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి అయి ఉండాలని నిర్దేశించింది. అనగా భారత ప్రభుత్వం లక్శ్యంగా నిర్దేశించిన 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కేవలం 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతీయ సరుకుల ద్వారా తయారయిన సోలార్ విద్యుత్ పరికరాల ద్వారా ఉత్పత్తి కావాలని పేర్కొన్నది.
ఇది కూడా అమెరికా కంపెనీలకు ఇష్టం లేకపోయింది. ఒకసారి భారతీయ కంపెనీలకు అవకాశం ఇస్తే అవి తమ కంపెనీలకు పోటీగా తయారు అవుతాయని అమెరికా కంపెనీలకు బాగానే తెలుసు. అందుకే, భారత ప్రభుత్వం విధించిన షరతులు WTO ఒప్పందం నిర్దేశించిన వాణిజ్య సూత్రాలకు విరుద్ధం అంటూ WTO కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారించిన WTO విచారణ విభాగం అమెరికా వాదనకు మద్దతు ఇస్తూ తీర్పు ఇచ్చింది. భారత ప్రభుత్వం విధించిన షరతు “విదేశీ కంపెనీలకు కూడా స్వదేశీ కంపెనీల లాగానే చూడాలన్న” సూత్రానికి విరుద్ధంగా ఉన్నదని, కాబట్టి షరతును ఎత్తివేయాలని తీర్పు చెపింది.
WTO తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అప్పీలుకు వెళ్ళింది. అప్పిలేట్ బోర్డు కూడా అదే తీర్పు చెబుతూ పాత తీర్పును సమర్ధించింది. దానితో ఇపుడిపుడే వృద్ధిలోకి వస్తున్న భారతీయ సోలార్ విద్యుత్ కంపెనీలు అభివృద్ధి చెందడానికి దారులు మూసుకుపోయినట్లు అయింది. ఇక చచ్చినట్లు కొత్తగా ఉత్పత్తిలోకి ప్రవేశించిన భారతీయ కంపెనీలు, ఇప్పటికే అభివృద్ధి సాధించిన, పెట్టుబడి వనరులు దండిగా కలిగిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ కంపెనీలతో పోటీ పడవలసిన అగత్యం ఏర్పడింది.
పశ్చిమ కంపెనీలు తమ పెట్టుబడి వనరుల సాయంతో ఆరంభంలో తక్కువ ధరలకు సోలార్ పరికరాలను అందుబాటులోకి తెస్తాయి. దానితో భారతీయ కంపెనీలు అనివార్యంగా అంటాము తమకు లాభదాయకం కాని ధరలకు మార్కెట్ చేయాల్సి వస్తుంది. లాభాలు లేనప్పుడు పరిశ్రమ మూసుకోవడం తప్ప మరో దారి ఉండదు. ఆ విధంగా విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీల నుండి ఎదురయ్యే పోటీని మోసపూరితంగా తప్పిస్తాయి. పోటీ కంపెనీలు మూత పడ్డాక ఇక మార్కెట్ ప్రక్రియలను అమెరికా, విదేశీ కంపెనీలే శాసిస్తాయి. ఆ కంపెనీలు ఏ ధర చెబితే అదే ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవలసి వస్తుంది.
ఒక వేళ ప్రతికూల పరిస్ధితులలో కూడా దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవచ్చు. మెరుగైన ఉత్పత్తి ప్రక్రియలను కనుగొని, చౌక ధరలకు సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని తద్వారా విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగల స్ధితికి అభివృద్ధి కావచ్చు. అటువంటి పరిస్ధితి ఏర్పడితే బహుళజాతి కంపెనీలు మెర్జర్ & అక్విజిషన్ ఎత్తుగడ ద్వారా పోటీని లేకుండా చేసుకుంటాయి. అనగా పోటీ ఇవ్వగల కంపెనీలను తామే కొనుగోలు చేస్తాయి. తగిన ధర కంటే ఎక్కువే చెల్లించి ప్రత్యర్థి కంపెనీలను కైవసం చేసుకుంటాయి.
కొనుగోలుకు ఒప్పుకోకపొతే ఒప్పుకోక తప్పని పరిస్ధితిని కల్పిస్తాయి. భారత అధికారులను కొనుగోలు చేసి వారి చేతనే ఒత్తిడి తెస్తాయి. లేదా పారిశ్రామిక కుట్రలకు (industrial sabotage) చర్యలకు పాల్పడతాయి. మార్కెటీకరణ కష్టం అయేలా చేస్తాయి. ఈ గొడవంతా ఎందుకు లెమ్మని దేశీయ కంపెనీలు ఇష్టం లేకపోయినా తమ వ్యాపారాన్ని, సంస్ధను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేస్తాయి.
కనీసం 8 శాతం దేశీయ వనరుల నుండి ప్రొక్యూర్ మెంట్ జరిగినా కూడా దేశీయ కంపెనీలకు గ్యారంటీ కలిగిన మార్కెట్ సమకూరుతుంది. దేశీయ కంపెనీలు ఆ కనీస మార్కెట్ తోనే నిలదొక్కుకోగలుగుతాయి. ఆ మాత్రం మార్కెట్ మన కంపెనీలకు ఇవ్వడానికి అమెరికా ఒప్పుకోలేదంటే బహుళజాతి కంపెనీల వ్యూహాలు, ఎత్తుగడలు ఏ స్ధాయిలో పక్కాగా, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అమలు చేస్తాయో ఒక అవగాహనకు రావచ్చు.
అప్పిలేట్ బోర్డు తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పు ఇచ్చిన 15 నెలల లోపు దానిని అమలు చేయాల్సి ఉంటుంది. మరి ప్రత్యేక పరిస్ధితులు ఉన్నట్లయితే ఈ గడువు 18 నెలల వరకు ఉండవచ్చు. కాని పత్రికల కధనం ప్రకారం చూస్తే 15 నెలలకు కూడా అమెరికా కంపెనీలు ఒప్పుకోవని తెలుస్తున్నది. WTO రూలింగ్ ఆయుధం చేసుకుని అమెరికా కంపెనీలు మరింత కఠినంగా వ్యవహరిస్తామని భారత వాణిజ్య అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ కింద ఉత్పత్తి చేసే విద్యుత్ ను భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కనుక సోలార్ విద్యుత్ బ్యాటరీలు, ప్యానెల్ల ఉత్పత్తి ‘కాంపిటీటివ్ రిలేషన్ షిప్’ కిందకు వస్తుందని, కాబట్టి కనీస మొత్తంలో ముడి సరుకులను దేశీయంగా సేకరించాలన్న WTO షరతులను వర్తింపజేయాలని భారత్ వాదించగా WTO ప్యానెల్ ఈ వాదనకు అంగీకరించలేదు. పధకం ఏదైనప్పటికీ విద్యుత్ అనే సరుకు సదరు షరతుల కిందికి రాదనీ ప్యానెల్ తేల్చింది.
ఇండియా-అమెరికాల మధ్య తలెత్తిన వివాదాలలో మెజారిటీ అమెరికాకు అనుకూలంగానే పరిష్కారం కావడం ఈ సందర్భంగా గుర్తించవలసిన అంశం. ఒకటి రెండు కేసుల్లో ఇండియాకు అనుకూలంగా తీర్పు వఛ్చినప్పటికీ ఆ తీర్పులను అమలు చేయకుండా భారత అధికారులను, ప్రభుత్వంలో పలుకుబడిని వినియోగించడంలో అమెరికా కంపెనీలు సఫలం అవుతున్నాయి.
WTO ఒప్పందం ఉనికిలోకి వచ్చ్చిందే మూడో ప్రపంచ దేశాలలో పారిశ్రామిక అభివృద్ధిని నిరోధించే లక్ష్యంతో. కనుక WTO ఫిర్యాదుల వ్యవస్ధను ఉపయోగించుకుని అమెరికా, పశ్చిమ బహుళజాతి కంపెనీలపై పై చేయి సాధించవచ్చుఁ అనుకోవడమే ఒక భ్రాంతి.
షేవింగ్ బ్లేడ్లు కూడా బహుళజాతి కంపెనీలు తయారు చేసినవే కొంటున్నాం. మనం వాళ్ళ మీద అంత ఆధారపడినప్పుడు సోలార్ ప్యానెల్ల విషయంలో మాత్రం మనల్ని సొంత నిర్ణయాలు తీసుకోనిస్తారా?
సర్,ఒక సందేహం!
అమెరికా లేదా ఇతర విదేశీ కంపెనీలు సరఫరా చేసే సోలార్ ప్యానెళ్ల తయారీలో కనీసం 8 శాతం అయినా దేశీయంగా సేకరించిన ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి అయి ఉండాలని నిర్దేశించింది.
ముడి సరుకులంటే అంతిమంగా తయారయిన వస్తువా? లేక ఆ వస్తువుతయారీలో ఉపయోగించవలసిన పధార్ధాలా?
ముడి సరుకు అంటే raw material. సిమెంట్, ఇటుకలు ముడిసరుకులు అయితే, ఇల్లు finished good.
technology kanukkoni america vanti desalaku buddicheppali…mana prabutwam kuda total swadesi technology ayyela cheyali ane asustunna…
ప్రధాన విషయానికి పెద్దగా సంభందంలేని విషయం-
1)అమెరికా లేదా ఇతర విదేశీ కంపెనీలు సరఫరా చేసే సోలార్ ప్యానెళ్ల తయారీలో కనీసం 8 శాతం అయినా దేశీయంగా సేకరించిన ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి అయి ఉండాలని నిర్దేశించింది.
2)అనగా భారత ప్రభుత్వం లక్శ్యంగా నిర్దేశించిన 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కేవలం 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతీయ సరుకుల ద్వారా తయారయిన సోలార్ విద్యుత్ పరికరాల ద్వారా ఉత్పత్తి కావాలని పేర్కొన్నది.
మొదటి వాక్యం యొక్క అర్ధం రెండో వాక్యమేనా?