
ఇండియా కోసం ఫ్రాన్స్ నిర్మిస్తున్న జలాంతర్గామి పేరు స్కార్పిన్ సబ్మెరైన్. లీకేజిని మొదటిసారిగా ద ఆస్ట్రేలియన్ పత్రిక రిపోర్ట్ చేసింది. స్కార్పిన్ జలాంతర్గాములను చిలీ, మలేషియా దేశాలకు కూడా ఫ్రాన్స్ నిర్మిస్తోంది. పూర్తిగా ఇండియా తరహావే కానప్పటికీ ప్రధాన నిర్మాణం వాటితో పోలి ఉంటుంది. కనుక మలేషియా, చిలీ దేశాల భద్రత కూడా ఈ లీకేజి వల్ల ప్రమాదంలో పడుతుంది.
కొన్ని మార్పులతో బ్రెజిల్ కు కూడా స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నిర్మించి ఇచ్చింది. వాటిని 2018 నుండి ఆ దేశం కమిషన్ చేయనుంది. అనగా భద్రతా కార్యకలాపాల నిమిత్తం సముద్రం లోకి ప్రవేశ పెట్టనుంది. ఈ లీకేజితో బ్రెజిల్ కూడా అప్రమత్తం అయింది.
6 స్కార్పిన్ జలాంతర్గాములను ఇండియా ఆర్డర్ ఇచ్చింది. వాటి మొత్తం ఖరీదు 3 బిలియన్ డాలర్లు . లేదా రమారమి రు. 20,000 కోట్లు. ‘Restricted Scorpene India’ టైటిల్ కలిగి అయినా ఫైల్ లీక్ అయిందని స్క్రోల్ వెబ్ సైట్ తెలిపింది. ఇందులో భారత సబ్ మెరైన్ లకు సంబంధించిన సంపూర్ణ వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.
సాధారణ వివరాలు అయినట్లయితే అంతగా పట్టించుకోనవసరం లేదు. ఆఫ్ కోర్స్! సాధారణ వివరాలు అయితే పత్రికలకు వార్త కూడా అయి ఉండేది కాదు. జలాంతర్గామి లోని వివిధ సెన్సార్లు, ఆ సెన్సార్లు ఎయె చోట్ల ఉండేది, నావిగేషన్ వ్యవస్ధలు లీక్ అయిన ఫైల్ లో ఉన్నాయని తెలుస్తున్నది.
లీకేజి ఇండియా వైపు నుండే జరిగిందని DCNS కంపెనీ ఫ్రెంచి వార్తా సంస్ధ AFP కి తెలిపింది. జలాంతర్గామి తమ వద్ద ఉన్నంత వరకు, తమ వద్ద తయారీలో ఉన్నంతవరకు లీకేజి జరగలేదని, దానికి సంబంధించిన పత్రాలు ఇండియాకు అందిన తర్వాతనే లీకేజి జరిగిందని కంపెనీ చెబుతొంది.
లీకేజి జరిగిందని చెబుతున్నప్పటికీ లీకేజి ఎంత మేరకు జరిగింది, లీకేజి స్వభావం ఏమిటి అన్న వివరాలు అందుబాటులో లేవు. ఫ్రాన్స్ జాతీయ భద్రతా సంస్ధ లీకేజి పైన విచారణ చేస్తుందని DCNS ప్రకటించింది. “లీక్ అయిన పత్రాల నిర్దిష్ట స్వభావం ఏమిటన్నది ఈ విచారణలో తేలుతుంది. మా కస్టమర్లకు ఏ మాత్రం నష్టం జరుగుతుందో తెలుస్తుంది. లీకేజికి బాధ్యులు ఎవరో కూడా తేలుతుంది” అని కంపెనీ ప్రతినిధి చెప్పారని AFP తెలిపింది.
ఇండియాకు సరఫరా చేసిన, చేస్తున్న జలాంతర్గాములు రూప కల్పన భారత కంపెనీయే నిర్మిస్తున్నదని కంపెనీ చెప్పడం గమనార్హం. “ఇండియా విషయంలో DCNS డిజైన్ ను స్ధానిక కంపెనీయే నిర్మిస్తోంది. సాంకేతిక డేటా కు DCNS కేవలం అందజేతదారు (ప్రొవైడర్) మాత్రమే. నియంత్రణ కంపెనీ చేతిలో లేదు” అని DCNS ప్రతినిధి చెప్పారని AFP తెలిపింది. లీకేజి ఇండియా నుండే జరిగిందని కంపెనీ ఎలా చెబుతున్నదో వివరణగా దీనిని గ్రహించవచ్చు.
హ్యాక్ చేయడం ద్వారా లీకేజి జరిగిందని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. అనగా ఇండియా వైపు నుండే లీక్ అయిందని రక్షణ మంత్రి అంగీకరిస్తున్నట్లే. లీక్ అయిన డేటాను విశ్లేషించ వలసినదిగా వాయు దళాల అధిపతిని ఆదేశించానని ఆయన చెప్పారు.
మొదటి విడతగా 3 జలాంతర్గాములు ఇండియాకు అందినట్లు తెలుస్తున్నది. గత మే నెల నుండి వాటిపైన ట్రయల్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. వాటిలో మొదటి సబ్ మెరైన్ కు కల్వరి అని పేరు పెట్టారని, అది వచ్చే నవంబర్ లో సముద్ర ప్రవేశం చేస్తుందని పత్రికలు తెలిపాయి.
లీకేజి ఆస్ట్రేలియాలో కూడా ఆందోళనకు కారణం అయింది. అందుకు కారణం DCNS కంపెనీ ఆస్ట్రేలియా దేశానికి కూడా జలాంతర్గాముల ఫ్లీట్ ను నిర్మించి ఇవ్వడానికి గత ఏప్రిల్ లో ఒప్పందం చేసుకుంది. ఏకంగా 12 జలాంతర్గాములను నిర్మించడానికి కుదిరిన ఈ ఒప్పందం కోసం జర్మనీ, జపాన్ కంపెనీలు పోటీ చేసి ఓడిపోయాయి.
లీకేజిని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, యధా ప్రకారంగా, విమర్శించింది. “ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇవ్వాలి. దోషులను సాధ్యమైనంత త్వరగా, కఠినంగా శిక్షించాలి. బ్యూరోక్రాట్లు తమను తాము రక్షించుకునేందుకు విచారణను పక్కదారి పట్టించకుండా చూడాలి” అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి కోరారు.
ఎకనమిక్ వార్!
ఆస్ట్రేలియాలో జలాంతర్గాముల ఒప్పందాలు లీక్ కావడం ఇదే మొదటి సారి కాదు. గత ఏప్రిల్ నెలలో, పైన చెప్పినట్లుగా, ఆస్ట్రేలియా అవసరాల కోసం దాఖలయిన టెండర్లు లీక్ అయ్యాయి. ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ న్యూస్ (ఏబీసీ న్యూస్) సంస్ధ టెండర్ల ప్రక్రియ పూర్తి కాక మునుపే ఎయె దేశాల టెండర్లు పోటీ నుండి రద్దు చేయబడ్డాయి వెల్లడి చేసింది. 38 బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కావడంతో ఈ లీకేజి పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది.
ఈ నేపథ్యంలో DCNS కంపెనీ ప్రతినిధి ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడి చేశారు. “ఎకనామిక్ వార్” లో భాగంగానే వరస పెట్టి లీకేజీలు జరుగుతున్నాయని ఆ ప్రతినిధి తెలిపారు.
“మా ఖాతాదారుల్లో ఇండియా ఉంది. ఆస్ట్రేలియా కూడా మా ఖాతాదారే. ఇంకా అనేక దేశాలు మా వినియోగదారులుగా మారుతున్నారు. అలాంటి దేశాలు DCNS గురించి ఈ లీకేజి వల్ల అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతారు. ఇవన్నీ ఎకనామిక్ వార్ లో ప్రయోగించే పరికరాలు” అని DCNS ప్రతినిధి చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. రాయిటర్స్ వార్తను NDTV కోట్ చేసింది.
సబ్ మెరైన్ లను అంతిమ రహస్య యుద్ధ పరికరంగా యుద్ధ పరిభాషలో భావిస్తారు. అటువంటి పరికరంకు సంబంధించిన రహస్యాలు లీక్ కావడం అంటే ఏ దేశానికైనా పీడకలతో సమానం. సబ్ మెరైన్ నుండి ఎంత మొత్తంలో శబ్దం వెలువడుతుందో కూడా ముఖ్యమైన సమాచారమే. శబ్దం బట్టి ఆ వచ్చేది ఏ దేశానికి సంబంధించిన సబ్ మెరైనో శత్రు దేశాలు కనిపెడతాయి. అందువల్ల ఈ లీకేజి భారత దేశానికి చాలా చెడ్డ వార్త!
ఈ లీకేజి భారత దేశానికి(ప్రజలకుకాదు) చాలా చెడ్డ వార్త!
స్థానిక కంపనీల మధ్యగల స్పర్ధలు ఈ లీకేజీకి కారణమన్నమాట!