
J P Rajkhowa -Arunachal Governor
[Turning back the clock శీర్షికన ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం]
మరోసారి, కేంద్రం లోని స్నేహ పూర్వక ప్రభుత్వం మద్దతు కలిగిన కాంగ్రెస్ అంఅంతర్గత తిరుగుబాటు గ్రూపు వలన అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిరిగి అధికారం చేచేపట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 15,2015 నాటి యధాతధ పరిపరిస్థితిని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని అర్థం నబామ్ టుకి ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపడతారు; కొద్ది కాలం రాష్ట్రపతి పాలన అనంతరం బిజెపి సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా బల పరీక్షలో తన బలం కూడా నిరూపించుకున్న అసమ్మతి నేత కలికో పల్ పదవి నుంచి తప్పుకోవాలి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ ను పునరుద్ధరించడానికి దారి తీసిన ఉత్తరాఖండ్ దుస్సాహసం తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ తీర్పు మరొక చెంపపెట్టు.రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఒక నెల రోజులు ముందుకు జరిపి అజెండాలో మొదటి అంశంగా స్పీకర్ ను తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరటం ద్వారా గవర్నర్ జె పి రాజ్ ఖోవా గత డిసెంబరులో పక్షపాత పూర్వకంగా జోక్యం చేసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో, సంఘటనలు తగని రీతిలో మలుపు తిరిగాయి. ఇది ముఖ్యమంత్రి మరియు స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభను మూసివేయటానికి, అసమ్మతి సభ్యులు సమానాంతర సమావేశం నిర్వహించటానికీ దారి తీసింది. ఆ సమావేశంలో స్పీకర్ ను తొలగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఆమోదించారు. అనంతరం రాష్ట్రపతి పాలన విధింపు, పల్ నేతృత్వంలో ప్రభుత్వ స్ధాపన పరిణామాలు, కాంగ్రెస్ పాలన లోని రాష్ట్ర ప్రభుత్వాల పట్ల బిజెపి నేతృత్వంలోని కేం ప్రభుత్వం వైఖరి యొక్క ఔచిత్యం పై ప్రశ్నలు తలెత్తాయి.
చట్టం పరంగా, అరుణాచల్ ప్రదేశ్ తీర్పు ప్రధాన ప్రాముఖ్యత గవర్నర్ పాత్ర విషయమై అది ఇచ్చిన స్పష్టతలో ఉన్నది. రాజకీయ పార్టీ అంతర్గత వివాదాలను పరిష్కరించే అధికారం గానీ, శాసన సభ అంతరాత్మ/అంత చేతన కాపాడవలసిన బాధ్యత గానీ గగవర్నర్ కు లేదు. మంత్రివర్గం సలహా సహాయాలు లేకుండా ఒక అసెంబ్లీ సమావేశాన్ని ముందుకు జరపగల విచక్షణాధికారం ఆయనకు లేదు; అలాగే అసెంబ్లీ సమావేశాల తేదీనీ ఆయన నిర్ధారించలేరు. తనను తొలగించాలన్న తీర్మానం ఆమోదం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలపై అఅనర్హత వేటు వేసే విషయంలో ఆ స్పీకర్ పాల్పడగల అనౌచిత్యాన్ని నివారించేందుకు ప్రయత్నించానన్న గవర్నర్ వాదన విషయంలో గవర్నర్ జోక్యంకు సంబంధించి మూడు అంశాలను స్పష్టం చేసింది: స్పీకర్ ను తొలగించే వివిషయంలో గవర్నర్ కు ఎలాంటి పాత్ర లేదు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ కు ఉన్న అధికారాలలో జోక్యం చేసుకొనే అధికారం ఆయనకు లేదు. విడిపోయిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు సంబంధించి, 47 మంది సభ్యుల కాంగ్రెస్ శాసన సభ పార్టీలో చట్టబద్ధ గుర్తింపు పొందేందుకు అవసరమైన 2/3 వంతు బలం కానందున, చర్య తీసుకునేందుకు ఆయనకు ఏ ఆధారమూ లేదు. తన హయాంలో అనర్హత వేటు వేసిన 14 మంది ఎమ్మెల్యేలను ఇటీవలి తీర్పు ద్వారా గౌహతి హైకోర్టు పునరుద్ధరించినందున టుకి మెజారిటీ నిరూపించుకోవటానికి తంటాలు పడవలసి రావచ్చు. ఆయన బతికి బట్టకడతారో లేదో గానీ, రాష్ట్రాల అసెంబ్లీలలో, (కృత్రిమ) తయారీ మెజారిటీలతో రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఎలా వ్యవహరించాలి అన్న అంశం గురించి వినవలసి రావటం ఇదే చివరిసారి మాత్రం కాబోదు.
*********
అవును చివరిసారి కాబోదు. బిజేపి నేతలు, కేంద్ర మంత్రుల స్పందనలను చూస్తే ఈ సంగతి మాత్రం స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు తీర్పు “విచిత్రంగా” ఉందని బిజేపి పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తీర్పుపై సమీక్ష కోరతామని పదవీ చ్యుత ముఖ్య మంత్రి కలికో పల్ ప్రకటించాడు. “ప్రభుత్వాలు అంకెల మీద నడుస్తాయి. మా ప్రభుత్వానికి సరిపోయినంత మంది ఎంఎల్ఏలు ఉన్నారు. మా ప్రభుత్వానికి ఏమీ కాదు” అని కూడా పల్ ప్రకటించాడు.
కలికో పల్ ఉద్దేశ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలు ఓట్ల ద్వారా ‘ప్రజాస్వామ్య’ పద్ధతిలో ఎన్నుకునేది కాదు. ఓట్ల జాతర ముగిశాక ఎక్కువ మంది ఎంఎల్ఏ లను కూడగట్టగలిగిన -ఆ కూడగట్టడానికి ఎలాంటి సూత్రాలు సిద్ధాంతాలు అవసరం లేదు సుమా- వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోవచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.
రాజకీయ సూత్రాలు, సిద్ధాంతాల ప్రాతిపదికన ఒక పార్టీ సభ్యత్వం పొందటం, ఆ పార్టీ తరపున టికెట్ సంపాదించడం, టికెట్ పొందినట్లు గుర్తుగా పార్టీ ఇచ్చిన పత్రాలు ఎన్నికల కమిషన్/రిటర్నింగ్ ఆఫీసర్ కు చూపి నామినేషన్ వేయటం, పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేసి తమ పార్టీ ఏం చేస్తుందో తెలిపే మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచటం, ఎన్నికయ్యాక పార్టీ ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజాసేవలో నిమగ్నం కావటం… ఇదంతా ఒట్టి ట్రాష్!
అదేదో సినిమాలో చెప్పినట్లు ఒకసారి ఎన్నికలు అంటూ ముగిశాక ఇక పార్టీల తేడాలు అనేది ఏమీ ఉండవన్న సూత్రాన్ని బాగా ఒంట బట్టించుకున్న కలికో పల్ ఆ మర్మాన్ని దాచి పెట్టుకోవాలన్న మర్యాదను కూడా విస్మరించాడు. ఎలాంటి తడబాటు లేకుండా ప్రభుత్వం అంటే అంకెలే అని రాజకీయ నేతలు, అందునా ముఖ్యమంత్రి, చెప్పగల పరిస్ధితికి భారత ప్రజాస్వామ్య వ్యవస్ధ చేరుకుంది. ఇదీ మనం సాధించిన అభివృద్ధి!
“ఈ తీర్పు వల్ల జరిగేది ఏమిటంటే, మెజారిటీ ఉన్న పక్షం ప్రతిపక్షంలో కూర్చోవాలి; మైనారిటీ పక్షం అధికారంలో ఉంటుంది” అని బిజేపి నేతలు టి.వి కెమెరాల ముందు వాపోయారు. సుప్రీం కోర్టు తీర్పు గవర్నర్ పాల్పడిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను తప్పు పట్టిన సంగతి వారికి అనవసరం. గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేక చర్యను కోర్టు రద్దు చేసినందున, ఆ చర్య దరిమిలా జరిగిన పరిణామాలన్నీ రద్దవుతాయన్న న్యాయ సూత్రం వారికి అనవసరం. వారి యావ అంతా “మాకు నెంబర్లు ఉన్నాయి, అయినా మానుండి అధికారం లాగేసుకున్నారు” అన్నదే.
పోనీ అలా తీసుకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిజేపి కి ఇచ్చింది కేవలం 11 సీట్లే. కాంగ్రెస్ కి 47 సీట్లు కట్ట బెట్టారు. కాంగ్రెస్ నుండి 21 మందిని చీల్చి మద్దతిచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజేపికి ఆ నెంబర్లు ఎక్కడివి? “అదంతా కాంగ్రెస్ కుమ్ములాటలు” అని బుకాయించినంత మాత్రాన బిజేపి పాపాలు కడిగిపోతాయా?
పార్టీ ఫిరాయించిన 21 మంది ఎంఎల్ఏ లలో 14 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేశాడు. ఫిరాయింపుదారుల్లో ఒకరైన డెప్యూటీ స్పీకర్ వారి అనర్హతను రద్దు చేశాడు. స్పీకర్ చర్యలను రద్దు చేసే అధికారం తమకు తామే ఉప స్పీకర్ కు కట్టబెట్టి, అసెంబ్లీలో కాకుండా హోటల్ లో సమావేశం జరిపి, స్పీకర్ ను తొలగించి, ముఖ్యమంత్రినీ తొలగించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని గవర్నర్ గుర్తించాడు. కేవలం అధికారం కోసం, ఇన్ని పాపాలకు ఒడి గట్టిన బిజేపి పాపం అంతా కాంగ్రెస్ దే అని ఆరోపించినంత మాత్రాన రాజ్యాంగం తిరగబడి పోతుందా? బిజేపి నెంబర్ల అధికారం నిలబడటం కోసం రాజ్యాంగ సూత్రాలను అర్జెంటుగా తిరగ రాయాలని ఆ పార్టీ కోరుతున్నదా?
రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందో, ఏది పోగొట్టుకుంటుందో మనకి అనవసరం. కానీ అధికారం కోసం తాము గొప్పగా చెప్పుకునే రాజ్యాంగ పుస్తకాన్ని నిలువునా చీరిపారేసేందుకు కూడా తాము సిద్ధమేనని బిజేపి చాటుకోవటం మాత్రం ప్రజలు గుర్తించాల్సిన విషయం. ఇన్నాళ్లూ మందబలంతో కాంగ్రెస్ పార్టీ సాగించిన అకృత్యాలను ఈ రోజు బిజేపి సాగిస్తోంది. రెండింటికీ తేడా లేనే లేదు. అధికారం కోసం వారు చెప్పుకునే కబుర్లలోనే తేడా. అధికారం దక్కాక రెండూ ఒకటే. ఆ రెండూ ప్రజలను రాచి రంపాన పెట్టేవే.
అసెంబ్లీలు, పార్లమెంటులు, వాటాల పంపకం సజావుగా తగవు లేకుండా చేసుకునేందుకు ఉద్దేశించినవి మాత్రమే. ఎన్నికలు అన్నవి వారి మధ్య తగాదా పంపకం తీర్చడానికి ఉద్దేశించిన తంతు మాత్రమే. తగాదా మరీ తీవ్రం అయినప్పుడు సుప్రీం కోర్టు జొరబడి సిద్ధాంతాలు చెప్పి “చూసారా, ప్రజాస్వామ్యం ఎంత శక్తివంతమైనదో” అని ఆ నాయకుల చేతనే అనిపిస్తుంది. సుప్రీం కోర్టు వ్యవహారం, ప్రజల్లో తొలగిపోతున్న భ్రమలను తిరిగి ప్రోది చేసేందుకు మాత్రమే పని చేస్తుంది తప్ప ప్రజాస్వామ్యం అని చెబుతున్నదానిని వాస్తవంగా పునరుద్ధరించటం అంటూ ఏమీ జరగదు. అసలు ఉద్ధరణే లేనప్పుడు పునరుద్ధరణ ఎలా ఉంటుంది?
అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం మన నేతి బీర ప్రజాస్వామ్యం బండారాన్ని మరోసారి బట్ట బయలు చేసింది.