సెన్సార్ బోర్డు గా పిలవబడుతున్న సిబిఎఫ్సి కి సినిమా లను సెన్సార్ చేసే అధికారం గానీ, కత్తెర వేసే అధికారం గానీ లేదని, రాజ్యాంగంలో అలాంటి ఏర్పాటు ఏమీ లేదని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది.
సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అన్న పదమే లేదని కనుక రాజ్యాంగం రీత్యా ఫలానా మాత్రమే ఉండాలని, ఫలానా ఉండకూడదు అని నిర్దేశించే అధికారం సిబిఎఫ్సి కి లేదని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.
ఉద్తా పంజాబ్ సినిమాకు మోడీ గారి చెంచా గారు పహ్లాజ్ నిహలానీ ప్రతిపాదించిన 89 కత్తిరింపులకు వ్వ్యతిరేకంగాసినిమా నిర్మాతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. జూన్ 13 తేదీన తీర్పు ప్రకటిస్తామని చెప్పిన కోర్టు చెప్పిన విధంగా అంతిమ తీర్పు ప్రకటించింది.
ఒక కత్తిరింపు, నిరాకరణ (dislaimer) లో ఒక చిన్న సవరణతో సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇవ్వాలని హై కోర్టు తన తీర్పులో ఆదేశించిందని ది హిందు తెలిపింది. అయితే ‘నిరాకరణ’ను కోర్టు పూర్తిగా అనుమతించిందని నిర్మాత లాయర్ ని ఉంటాంకిస్తూ ఎన్డిటివి వెబ్ సైట్ తెలిపింది.
అసలు ఈ సినిమాపై ఇంత రగడ అనవసరం అని మొదటి హియరింగ్ లో స్పష్టం చేసిన హై కోర్టు “రాష్ట్రంలో అనేక మంది లిటిగెంట్లు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్తా పంజాబ్ సినిమాను అసలు హై కోర్టు దృష్టికి తీసుకురావలసిన కారణమే లేదు” అని ఈ రోజు వ్యాఖ్యానించింది.
“సినిమా స్క్రిప్టు లో దేశ సార్వభౌమత్వం ను భంగం కలిగించే అంశాలు ఏమీ మాకు కనిపించ లలేదు. తమ సినిమాల సెట్టింగ్ ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు పూర్తిగా సినిమా వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అందులో ఇమిడి ఉండే సృజనాత్మక స్వేస్వేచ్ఛకు అదే కీలకం కనుక” అని కోర్టు వ్యాఖ్యానించింది.
“సినిమాను పెద్దలు చూడటానికి నిర్మించారు. సృజనాత్మక స్వేచ్ఛకు దుర్వినియోగం కలగకుండా సినిమా తయారీ దారులను ఎవరూ శాసించ లేరు” అని హై కోర్టు డివిజన్ బెంచి స్పష్టం చేసింది. “సృజనాత్మక ప్రకటనా స్వేచ్ఛ సర్వ స్వతంత్రమైనది (absolute). దానిని ఎవరూ ఆటంకపరచటానికి వీలు లేదు” అని బెంచి ప్రకటించింది.
“ఒక స్ధలంలో వ్యాపించిన డ్రగ్ భూతాన్ని వివరించిన సినిమా ఉద్తా పంజాబ్. బోర్డు పేరులో కూడా సెన్సార్ అన్న పదం లేదు. రాజ్యాంగం ప్రకారం, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రమే బోర్డు తన అధికారాలను వినియోగించాలి” అని కోర్టు తెలిపింది.
“2017లో అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. కేవలం పంజాబ్ ఎన్నికలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీశారని మేము భావించడం లేదు” అని హై కోర్టు బెంచి వ్యాఖ్యానించింది. సినిమాలో ‘ఎన్నికలు’ అన్న పదాన్ని (డైలాగ్ లో) కూడా కత్తిరించాలని నిహలానీ బృందం ఆదేశించటాన్ని ఉద్దేశిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
89 కత్తిరింపులకు దారి తీసే 13 అభ్యంతరాలతో సినిమాకు ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లు ప్రకటించిన సిబిఎఫ్సి ఇపుడు హై కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి ఉంది. తాము చెప్పిన ఒక కత్తిరింపుతో సినిమాకు మళ్ళీ కొత్తగా ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని సిబిఎఫ్సి ని కోర్టు ఆదేశించింది. రెండు రోజుల లోపల ఇది జరగాలని నిర్దేశించింది.
హై కోర్టు తీర్పు దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పటానికి ప్రతీక అని సినిమా నిర్మాత అనురాగ్ కశ్యప్ లాయర్ సంబర పడ్డాడు. “మేము ఒక దృశ్యాన్ని (యూరిన్ పోస్తున్న దృశ్యం) మాత్రమే కత్తిరించాల్సి ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రతీక” అని లాయర్ సంతోషంగా ప్రకటించాడు.
ఒక దేశం యొక్క నడతను వ్యక్తీకరించే ప్రజాస్వామ్యం, ఒక సినిమా కత్తెరకు ముడి పెట్టి వ్యాఖ్యానించడంగా దిగిపోయింది!?
“నాకు శాంతిగా ఉన్నది… నా నిర్మాతల సాహసానికి శాల్యూట్ చేస్తున్నాను” అని సినిమా డైరెక్టర్ అభిషేక్ చౌబే అన్నారని ఎన్డిటివి తెలిపింది. ముందుగా అనుకున్న తేదీకే సినిమాను విడుదల చేస్తామని చౌబే తెలిపాడు.
ఇంతకు ముందు సెన్సారు బోర్డు కత్తిరించింది కొన్ని సీన్లు అనే వారు కదా. ఇప్పటి ప్రకారం చూస్తే అలా కత్తిరించటం తప్పెనా?
కత్తిరింపులు అసలే వీలు లేదని కాదు మంజరి గారు. ఒక వేళ తప్పనిసరి అయితే ఆ కత్తిరింపులు సినిమాటోగ్రఫీ చట్టానికి, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఉండాలని, CBFC ఛైర్మన్ చిత్తానికి తోచిన రీతిలో చేయకూడదని కోర్టు చెప్పింది.
ఉదాహరణకు ఉద్తా పంజాబ్ లో పంజాబ్ రాష్ట్రాన్ని చెడ్డ చేసి చూపారని చెబుతూ డైలాగ్స్ లో పంజాబ్ అన్న పదాన్ని తొలగించాలని నిహలానీ ఆదేశించారు. “పంజాబ్ గౌరవాన్ని కాపాడే బాధ్యత మీకు ఎవరు అప్పగించారు” అన్నది కోర్టు ప్రశ్న. నిహలానీ ఇలాంటి బాధ్యతలను తానే నెత్తిన వేసుకుని ఆ ప్రకారం కత్తిరింపులు డిమాండ్ చేశారు. దానిని కోర్టు తప్పు పట్టింది.
అయితే మీరు అన్నట్లు ఈ గొడవ, కోర్టు తీర్పు లకు ముందూ, తర్వాతా సెన్సారింగ్ లో బాగా మార్పులు, తేడాలు రావడం ఖాయం. CBFC వాళ్ళు గతంలో లాగా పెత్తనం చేయటానికి జంకుతారు.