రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా


Vladimir Putin & Alexis Psipras

Vladimir Putin & Alexis Psipras

అమెరికా నేతృత్వం లోని మిలటరీ గూండా కూటమి నాటో (North Atantic Treaty Organisation) కు తమ దేశంలో మిసైల్ స్ధావరం కల్పించడంపై రష్యా నోరు విప్పింది. అనవసరంగా నాటో యుద్ధోన్మాదంలో బలి పశువు కావొద్దని హితవు పలికింది. అమెరికన్ యాంటీ మిసైల్ వ్యవస్ధను తమ దేశంలో నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడం తగదని, తమ రక్షణ కోసం అమెరికా మిసైల్ వ్యవస్ధపై చేసే దాడి రుమేనియాపై దాడిగా మారుతుందని హెచ్చరించింది.

యూరోపియన్ యూనియన్ తో సంబంధాలు మెరురుపరుచుకునే కృషిలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గ్రీసు పర్యటనలో ఉన్నారు. యూరోపియన్ యూనియన్ కూటమి రష్యాకు దగ్గర కాకుండా ఉండేందుకు సకల ప్రయత్నాలు చేస్తుండగా, వ్యాపార-ఆర్ధిక-ద్రవ్య ప్రయోజనాల రీత్యా ఆ ప్రయత్నాలను అధిగమించేందుకు ఈ‌యూ దేశాలు శతధా కృషి చేస్తున్నాయి. ఈ జంఝాటాన్ని అనుకూలంగా వినియోగించుకునేందుకు రష్యా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఉక్రెయిన్ లో ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాన్ని అమెరికా, ఈ‌యూలు కుట్రలు చేసి బలవంతంగా కూలదోసిన దిరిమిలా రష్యా, పశ్చిమ శిబిరాల మధ్య తీవ్ర వైరుధ్యాలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని హింసాత్మక ఆందోళనల ద్వారా కూల్చివేస్తున్న రోజుల్లో రష్యా, అమెరికాకు పై యెత్తు వేసి నల్ల సముద్ర ద్వీపం క్రిమియాలో రిఫరెండం నిర్వహించింది. రిఫరెండంలో 97.6%  ప్రజలు రష్యాలో కలవాలని కోరడంతో అప్పటి నుండి క్రిమియా రష్యాలో కలిసిపోయింది. అదే సమయంలో తూర్పు ఉక్రెయిన్ రాష్ట్రాలైన లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రజలు తమనూ రష్యాలో కలుపుకోవాలని శత పోరినా అందుకు పుతిన్ అంగీకరించలేదు. వాస్తవం ఇది కాగా క్రిమియాను రష్యా దురాక్రమించిందని అమెరికా చెవి కోసిన మేకలా ప్రచారం చేస్తూ ఉంటుంది.  

“క్రిమియా దురాక్రమణకు ప్రతి చర్య” అని చెబుతూ అమెరికా రష్యాపై పలు ఆంక్షలు ప్రకటించింది. ఈ‌యూపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆంక్షలలో భాగస్వామ్యం వహించేలా చేసింది. సిరియా, ఉక్రెయిన్ లలో తన మాట వినని రష్యాపై అమెరికా సామ్రాజ్యవాదులు పగ బట్టారు. దరిమిలా రష్యా సరిహద్దు లోని తూర్పు యూరప్ దేశాలలో ఉద్రిక్తతలకు అమెరికా ఆజ్యం పోసింది. ఒకప్పటి సోవియట్ రష్యా ఉపగ్రహ దేశాలయిన తూర్పు యూరప్ రాజ్యాలను ఒక్కొక్కొటిగా నాటోలో చేర్చుకుంటూ మిలట్రీ ఉద్రిక్తతలను పెంచుతోంది.

రష్యా వ్యతిరేక చర్యలలో భాగంగా తూర్పు యూరప్ దేశాలలో ఒకటయిన రుమేనియాలో యాంటీ-మిసైల్ రక్షణ వ్యవస్ధను అమెరికా స్ధాపించింది. శత్రు దేశాలు ప్రయోగించే అణు-మిసైళ్ళు/అణు బాంబు రహిత మిసైళ్ళు లక్ష్యాన్ని ఛేదించక మునుపే మధ్యలో గాలిలోనే అడ్డుకుని కూల్చివేసే వ్యవస్ధను యాంటీ-మిసైల్ రక్షణ వ్యవస్ధ (Anti-Missile Defense System) అంటారు. ఏ‌బి‌ఎం (యాంటీ బాలిస్టిక్ మిసైల్స్) అని కూడా పిలుస్తారు. ఐ‌సి‌బి‌ఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ – ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు) క్షిపణులను ఛేదించేవి కాబట్టి యాంటీ-బాలిస్టిక్ గా పేర్కొంటారు.

మిసైల్ రక్షణ వ్యవస్ధ అంటే మిసైళ్ళ నుండి రక్షణ పొందే వ్యవస్ధ అని అర్ధం. ఇవి కేవలం ఒక మిలట్రీ వాహనంతోనో, ఒక మిసైల్ ప్రయోగ వ్యవస్ధతోనో కూడుకుని ఉండేది కాదు. ఒక విస్తారమైన ప్రాంతంలో ఒక్కో భాగాన్ని ఒక్కో చోట స్ధాపిస్తారు. అవన్నీ ఏకకాలంలో సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూ పని చేస్తాయి. ఒక భాగం అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతూ ఉండే మిలట్రీ ఉపగ్రహంలో స్ధాపించబడి ఉంటుంది. ఇవన్నీ సంయుక్తంగా పని చేస్తూ శత్రు క్షిపణి స్ధావరాలను గమనిస్తూ ఉంటాయి.

ఇటువంటి మిసైల్ రక్షణ వ్యవస్ధను ఐరోపా రక్షణ పేరుతో అమెరికా వివిధ ఐరోపా దేశాలలో నెలకొల్పింది. రుమేనియాలో మిసైల్ డిఫెన్స్ బేస్ నూ స్ధాపించింది. పోలాండ్ లో మరొక బేస్ నిర్మిస్తోంది. మరో రెండేళ్లలో పూర్తవుతుందని అమెరికా-పోలండ్ లు ఇప్పటికే ప్రకటించాయి. తూర్పు యూరప్ దేశాలలో మిసైల్ స్ధావరాలు నెలకొల్పడం రష్యా భద్రతకు నిస్సందేహంగా హానికరం. సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైల్ రక్షణ వ్యవస్ధలు, రక్షణ కోసమే కాకుండా దాడికి కూడా ఉపయోగపడతాయి.

ఈ నేపధ్యంలో రష్యా అనేకసార్లు అమెరికాను హెచ్చరించింది. తమ భద్రతకు ముప్పు వచ్చే వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే ఎలాంటి హెచ్చరిక లేకుండా వాటిని నాశనం చేస్తామని గతంలో హెచ్చరించింది. అమెరికా తన ప్రయోజనాలకు ఐరోపా దేశాలను బలిపశువులు చేస్తోందని, అమెరికా వలలో పడవద్దని యూరప్ దేశాలను ముఖ్యంగా తూర్పు యూరప్ దేశాలను కోరింది. కానీ ఆర్ధికంగా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలపై ఆధారపడిన తూర్పు యూరప్ దేశాలు అమెరికా పెత్తనానికి లొంగటం తప్ప మరో దారి లేదు. లొంగని దేశాలను లొంగదీసుకోవటానికి అమెరికా ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో ఇటీవలి ఉదాహరణలు -లిబియా, సిరియా, ఉక్రెయిన్- చూస్తే సరిపోతుంది.

రష్యా హెచ్చరికలను పెడ చెవిన పెడుతూ అమెరికా తన పని కానిచ్చేసింది. ఇంకా కొనసాగిస్తోంది. తన మిసైల్ వ్యవస్ధకు లక్ష్యం రష్యా కాదని చెబుతూ వచ్చింది. కొన్నాళ్లు ఉత్తర కొరియా నుండి వచ్చే మిసైళ్ళ నుండి రక్షణ కోసం అని చెప్పింది. కొన్నాళ్లు ఇరాన్ నుండి వచ్చే అణు మిసైళ్ళ నుండి రక్షణ కోసం అని చెప్పింది. ఇప్పుడు తడవకు ఒక కారణం చెబుతోంది. కానీ అమెరికా మిలట్రీ అధికారులు, యుద్ధోన్మాద సెనేటర్లు ‘రష్యా మా శత్రువు’ అని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తుంటారు. కనుక అమెరికా చెప్పే సాకులను నమ్మేవారు ఎవరూ లేరు.

“రుమేనియా ప్రాంతంలో క్రాస్-హెయిర్స్ (అటు ఇటూ కాల్పులు జరుగుతుండగా మధ్యలోకి రావడం -పోటేళ్ళ మధ్య మేక?) లో ఉండటం అంటే ఏమిటో నిన్న ఎవరికన్నా తెలియకపోతే వారికి బహుశా ఈ రోజు తెలుస్తుంది. మా భద్రత కోసం కొన్ని చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి వస్తుంది. రేపు పోలండ్ లో కూడా అదే పరిస్ధితి ఎదురు కావచ్చు” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీసు సందర్శనలో ప్రకటించాడు.

రుమేనియాలో అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధ స్ధావరం నెలకొల్పిన దేవెసెలు పట్టణాన్ని పుతిన్ ఉద్దేశిస్తున్నాడన్నది స్పష్టమే. ఈ మే నెల నుండి పని చేయడం ప్రారంభించిన మిసైల్ స్ధావరం కోసం అమెరికా 800 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టిందని రష్యా టుడే పత్రిక తెలిపింది.

“ప్రస్తుతం స్ధాపించబడిన ఇంటర్ సెప్టార్ మిసైళ్ళు 500 కి.మీ దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. ఇది త్వరలో 1000 కి.మీ కు పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకా శృతి మించి 2400 కి.మీ దూరంలో లక్ష్యాలను ఛేదించగల దాడి మిసైళ్ళను కూడా ప్రవేశపెడతారు. ఇప్పటికిప్పుడు వాటి స్ధానంలో 2400 కి.మీ లక్ష్యం గల మిసైళ్లను నెలకొల్పగల వసతి అక్కడ ఉన్నది. కేవలం సాఫ్ట్ వేర్ ను మార్చడం ద్వారా ఆ పని చేయవచ్చు. ఆ సంగతి రుమేనియన్లకు తెలియకుండా కూడా జరగవచ్చు” అని పుతిన్ వివరించాడు.

“ప్రతి చర్య తీసుకునే సామర్ధ్యం మాకు ఉన్నది. మధ్య స్ధాయి సముద్ర-ఆధారిత మిసైళ్ళు ఏ పాటి సామర్ధ్యం కలిగినవో (సిరియాలో) ప్రపంచం మొత్తం కళ్ళారా చూసింది. కానీ మేము ఒప్పందాలను ఉల్లంఘించే వాళ్లము కాము. మా భూ ఆధారిత ‘ఇస్కందర్ మిసైళ్ళు కూడా అద్భుతమైన సామర్ధ్యం కలవని రుజువు చేసుకున్నాయి” అని పుతిన్ హెచ్చరించాడు.

గతంలో అమెరికా-రష్యాల మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాల మేరకు కాలం చెల్లిన అణ్వాయుధాలను పరస్పరం నాశనం చేసుకున్నారు. STAR-I, II ఒప్పందాల మేరకు పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. అణ్వాయుధాలను ఇక పెంచవద్దని అంగీకరించారు. కాని జార్జి బుష్ (జూనియర్) కాలంలో ఈ ఒప్పందాల నుండి అమెరికా ఏక పక్షంగా ఉపసంహరించుకుంది. ఇక అప్పటి నుండి అమెరికాతో సహా, పశ్చిమ దేశాలు మిలట్రీపై ఖర్చులు పెంచాయి. సరికొత్త అణ్వాయుధ ప్రయోగాలు చేస్తున్నాయి.

“రష్యాకు ప్రమాదం కాదంటూ స్పష్టత లేని ప్రకటనలతో నాటో మమ్మల్ని జోకొడుతోంది… ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ మొత్తం ప్రాజెక్టు ఆరంభించామని చెప్పారు. ఇప్పుడు ఆ (ఇరాన్) కార్యక్రమం ఎక్కడుంది? అది అసలు ఉనికిలోనే లేదు” అని పుతిన్ గుర్తు చేశాడు.

2015లో P5+1 (5 వీటో దేశాలు + జర్మనీ) దేశాలు ఇరాన్ తో చేసుకున్న అణు ఒప్పందాన్ని పుతిన్ గుర్తు చేస్తున్నాడు. ఈ ఒప్పందం దరిమిలా ఇరాన్ పై విధించిన ఆంక్షల్లో కొన్నింటిని అమెరికా, ఐరోపాలు ఎత్తివేశాయి. దీని అర్ధం ఇరాన్ అణు కార్యక్రమం లేదని పశ్చిమ దేశాలు అంగీకరించినట్లు. ఇరాన్ అణు కార్యక్రమమే లేనప్పుడు దానికి వ్యతిరేకంగా మిసైల్ రక్షణ వ్యవస్ధ నెలకొల్ప వలసిన అవసరం ఏమిటని పుతిన్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు అమెరికా నేతలు ఎప్పుడూ సమాధానం ఇవ్వరు. వారు చెప్పవలసింది చెపుతారు, అంతే. దాన్ని ప్రపంచం విని తలూపాలి.

పుతిన్ ఈ మాటలు చెబుతున్నప్పుడు గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ పక్కనే ఉండటం విశేషం. “రష్యాతో చర్చలు చేయకుండా, రష్యా సహకారం లేకుండా ఐరోపా భద్రత సాధ్యం కాదు. ఆంక్షలు, మిలట్రీకరణ, ప్రచ్చన్న యుద్ధ వాగాడంబరం ల విష వలయంలో ఇరుక్కుని ఉండగా అంతర్జాతీయ చట్టాలను అమలు చేయడంలో ముందుకు పోలేము” అని సిప్రాస్, స్పుత్నిక్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు.

పుతిన్ పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చలు జరిగాయని పత్రికలు తెలిపాయి. ఉమ్మడిగా పలు ఇంధన, రవాణా ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, ఈ‌యూలు విధించిన ఆంక్షలను కూడా ఇరు నేతలు చర్చించారని కొన్ని పత్రికలు తెలిపాయి. ఆంక్షల వల్ల రష్యా-గ్రీసు సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడిందని, ఈ పరిస్ధితిని సవరించేందుకు కృషి చేయవలసి ఉన్నదని గ్రీసు ప్రధాని ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.

జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అగ్ర దేశాలు కూడా ఆంక్షలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అమెరికా ఒత్తిడికి లొంగి విధించిన ఆంక్షలు ఈ‌యూ దేశాలకు కూడా భారంగా పరిణమించాయని వారి ప్రకటనలు ధ్రువపరిచాయి. ఈ నేపధ్యంలో త్వరలో ఆంక్షలపై జరగనున్న సమీక్షలో రష్యాకు అనుకూలంగా నిర్ణయం జరగవచ్చని కొందరు ఊహిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియడానికి వేచి చూడవలసిందే. చివరి నిమిషంలో అమెరికా బెదిరింపులకు తల ఒగ్గడం ఐరోపా దేశాలకు కొత్త కాదు.

3 thoughts on “రుమేనియా నాటో బేస్: బలిపశువు అవుతారు -రష్యా

  1. Hi Sir,

    Thanks for posting very good articles.

    Here i have one doubt, As we know all that Russia is like Best friend country for us.

    Russia helped us get through the Pakistan wars when USA was helping Pakistan. During the war for the liberation of Bangladesh, The Americans had deployed its nuclear armed 7th fleet in the Indian Ocean threatening india just because we were trying to help free the people of Bangladesh.
    Had Russia not stepped in with its own navy, India could have lost the war.

    We used to import all the Weapons from Russia but now it is totally changed.

    I heard that We are importing most of weapons from America, which is not good for us, America is like(feeling angry) you know that….this is too bad.i think because of those reasons only Russia is selling weapons to Pakistan..Can you please write a artle why this strategic is changed between Russia & India.. Thanks.

    I Love your Articles
    🙂

  2. Hi Maruthi garu,

    It is not correct to say “only Russia is selling weapons to Pakistan.”

    India is still buying weapons from Russia. It is buying from EU countries also.

    Generally speaking, every weapon making country will be interested to sell it’s weapons to any country. Because, it’s business.

    But this is not true in the case of some strategic weapons. Such weapons will be sold to only friendly countries. In that sense Pakistan is still in the U.S. pockets. It is still buying weapons from the U.S. There may be some plays overtly between the U.S. and Pakistan, but they are strategic friends, still.

    The difference occurred only in case of India, not Pak. Indian rulers (not people) are increasingly becoming dependent on the U.S., due to their own interests. (Interests of Indian masses will never be their concern.) This is a strategic shift in case of India.

    There was also a sort of strategic shift in case of Pakistan towards China mainly for economic reasons. But this shift is not complete. It can be called a lesser shift.

    India’s shift also not complete, but it should be called a greater shift. Which means there is some space for India to turnaround but it is highly unlikely.

    The character of ruling classes of both India and Pakistan are the same. They do not possess independent character. They don’t dare to stand upright against the interests of western imperialists viz the U.S., and the E.U. They may change their masters but can never remain without masters.

    By saying ruling classes, I mean.. all most all political parties viz Congress, BJP, TDP, SP, BSP, TMC and so on, except communist parties. (CPI & CPM did not come to power at center with their own strength. So their allegiance is not tested. In states, their rule has been no different from other parties.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s