అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలను అభివర్ణిస్తున్న ఈ కార్టూన్, మన ముందు పరిచిన తమాషాను చెప్పుకుని తీరాలి.
ఎడమ-పైన నుండి గడియారం ముల్లు తిరుగు దిశలో…
1. అస్సాం:
-
బిజేపి అధ్యక్షుడు అమిత్ షాకు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి తల బొప్పి కట్టింది.
-
బీహార్ ఎన్నికల్లో లాలూ, నితీష్ లు ఉమ్మడిగా కొట్టిన దెబ్బకు ఆ బొప్పి మరింత వాచిపోయింది.
-
అస్సాం ఎన్నికల్లో వాచిపోయిన బొప్పి కాస్త ఒంటి కొమ్ము గా మెలి తిరిగి ఠీవిగా నిలబడింది. చెవులు సైతం తమ వంతుగా నిక్కబొడిచాయి.
ఢిల్లీ, బీహార్ ల నుండి పాఠాలు నేర్చుకున్నామని అస్సాం ఫలితాల అనంతరం బిజేపి నేతలు వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం.
2. పశ్చిమ బెంగాల్:
ఎన్నికల ముందు ‘చారిత్రక అవసరం’గా ప్రకటించిన ‘కాంగ్రెస్ తో పొత్తు’ ఎన్నికల అనంతరం సిపిఎంకు మరో ‘చారిత్రక తప్పిదం’ గా మారిపోయింది. పాపం మూడో స్ధానంలోకి జారిపోతున్న సిపిఎం ని కాంగ్రెస్ పార్టీయే చేయి అందించి లాగి నిలబెట్టవలసి వస్తోంది. ఇద్దరూ కలిస్తే తప్ప ‘రెండో స్ధానం’ అని చెప్పుకోదగ్గ అంకె కాలేని సీట్లు దక్కాయి మరి.
3. తమిళనాడు:
దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ, ఒకటీ రెండు తప్ప డిఎంకే కూటమికే పట్టం కట్టాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీచాయని చెబుతూ అవి ఏఐఏడిఎంకేని రెండో స్ధానంలోకి నెట్టివేశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ‘అమ్మ’ తో విలేఖరులు ప్రస్తావించినప్పుడు ఆమె “ఫలితాలు వస్తాయిగా, చూడండి” అని కొట్టిపారేశారు. అదే జరిగింది. ఆ విధంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులను కాలితో గెంటినట్లయింది.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. డిఎంకే కూటమికీ, ఏఐఏడిఎంకే కూటమికీ మధ్య ఓట్ల తేడా కేవలం కేవలం 1.08 శాతం మాత్రమే. డిఎంకే కూటమికి 39.7% ఓట్లు రాగా ఏఐఏడిఎంకే కూటమి (కూటమి పార్టీలు కూడా రెండు ఆకుల గుర్తు పైనే పోటీ చేశారు) కి 40.78% ఓట్లు వచ్చాయి.
కేవలం డిఎంకే పోటీ చేసిన 176 స్ధానాల వరకు చూస్తే డిఎంకేకు 41.05% ఓట్లు రావడం విశేషం. ఇది ఏఐఏడిఎంకే పోటీ చేసిన స్ధానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం (40.78%) కంటే ఎక్కువ. అనగా డిఎంకే మిత్ర పార్టీలు ఆ పార్టీ అవకాశాలను తీవ్రంగా దెబ్బ కొట్టాయి. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతూ డిఎంకే ని కూడా ముంచింది.
4. కేరళ
కేరళ ఫలితాలు తమకు ఆశ్చర్యం కలిగించాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అవినీతి సీసాలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్ చేయి బైటికి లాక్కోలేక తన్నుకులాడిన ఫలితమే కేరళ ఎన్నికల ఫలితాలు! సోలార్ స్కాం కుంభకోణం పాత్రధారులు కుంభకోణంలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందికి కూడా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. మద్యపాన నిషేధం ద్వారా గొయ్యి పూడ్చుకోవడానికి ప్రయత్నించీ విఫలం అయ్యారు.