ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు కన్హైయా కుమార్ ని పోలీసులు హాజరు పరచవలసి ఉంది. వాస్తవానికి నిన్ననే విచారణ జరగవలసి ఉండగా హిందూత్వ లాయర్ల వీరంగం వల్ల అది సాధ్యపడలేదు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు కోర్టు సజావుగా నడవడానికి సుప్రీం కోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు విలేఖరులు, ఇద్దరు కన్హైయా మద్దతుదారులు మాత్రమే హాజరు కావాలని చెప్పింది.
ఈ నేపధ్యంలో మధ్యాహ్నం నుండి పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన ఘటనల క్రమం -ది హిందు ప్రచురణ ప్రకారం- కింది విధంగా ఉన్నది.
2:20 PM: పాటియాలా కోర్టు వద్ద ఉన్న ఒక విలేఖరి, కోర్టు కాంప్లెక్స్ లోపల మళ్ళీ ఘర్షణ చెలరేగిందని, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా లాయర్లు ఇతరులపై దాడి చేసేందుకు, నినాదాలు ఇచ్చేందుకు వెనుదీయలేదని చెప్పారు.
2:31 PM: పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ లో ఘర్షణ ఇంకా కొనసాగుతున్నదీ లేనిదీ 10 నిమిషాల్లో చెప్పాలని ఢిల్లీ పోలీసుల లాయర్ కు సుప్రీం ధర్మాసనం కోరింది.
3:07 PM: పాటియాలా హౌస్ కోర్టులో పరిస్ధితిని స్వయంగా తెలుసుకునేందుకు సుప్రీం ధర్మాసనం ఒక లాయర్ల బృందాన్ని పంపింది.
3:11 PM: విలేఖరులపై కోర్టు లోపలి నుండి రాళ్ళు వచ్చి పడుతున్నాయని వార్తలు అందాయి.
3:14 PM: కోర్టు ఆవరణలో కన్హైయా కుమార్ పై దాడి జరిగిందని సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ సుప్రీం ధర్మశాననానికి తెలిపారు.
3:16 PM: “శాంతి భద్రతల పరిస్ధితిపై మేము ఆందోళన చెందుతున్నాము” -సుప్రీం కోర్టు
3:17 PM: పాటియాలా హౌస్ కోర్టులో రాళ్ళు విసిరి గాయపరుస్తున్నారని కేసు కౌన్సెళ్ళలో ఒకరు ధర్మాసనానికి చెప్పారు. –పిటిఐ
3:23 PM: 6గురు లాయర్లతో కూడిన బృందాన్ని -కపిల్ సిబాల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, ఏ డి ఎన్ రావు, అజిత్ సింహా, హరీన్ రావల్- ధర్మాసనం పాటియాలా హౌస్ కోర్టుకు పంపింది.
- Kanhaiya Kumar behind police shield
- Kanhaiya amid police force
- Patiala Court -Stones hurled
3:24 PM: కేసులో కోర్టు ముందు హజారవుతున్న లాయర్లు, విలేఖరులు, న్యాయమూర్తి అందరూ కోర్టు గదిలో చిక్కుకు పోయారు. లాయర్లు కోర్టు ఆవరణలో వేటాడుతుండడంతో వారు లోపలి నుండి తలుపు తాళం వేసుకున్నారు.
3:27 PM: ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీకి వెంటనే ఫోన్ చేయాలని పోలీసుల లాయర్ అజిత్ సిన్హాను సుప్రీం కోర్టు ఆదేశించింది. చిక్కుకు పోయిన లాయర్లు, విలేఖరులను క్షేమంగా బైటికి తేవాలని చెప్పాలని కోరింది.
3:34 PM: హోమ్ కార్యదర్శి రాజీవ్ మహర్షి: “చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి. పోలీస్ చీఫ్ బి ఎస్ బస్సీ నుండి నేను వివరణ కోరుతాను”
3:39 PM: లాయర్ల బృందంలో చేరడానికి కపిల్ సిబాల్ విముఖత వ్యక్తం చేశారు. “ఇదంతా రాజకీయం” అన్నారాయన. కోర్టు అధికారిగా పాటియాలా హౌస్ కోర్టు ఆవరణకు వెళ్లాలని ధర్మాసనం ఆయనను కోరింది.
3:58 PM: ట్విట్టర్ లో- కన్హైయా కుమార్ లాయర్ కపిల్ సిబాల్ పైన పాటియాలా హౌస్ కోర్టు వద్ద చెప్పు విసిరారు. -ది హిందు విలేఖరి శుభోమోయ్ సిక్దర్
3:58 PM: కన్హైయా కుమార్ కు మార్చి 2 వరకు రిమాండు విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
4:22 PM: లాయర్ల దాడికి గురయిన కన్హైయా ను పరీక్షించడానికి కోర్టు వైద్యుడిని పిలిపించింది.
4:33 PM: JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ కు శరీరం లోపలి భాగంలో గాయాలు అయ్యాయని పోలీసులు ప్రకటించారు.
4:37 PM: పాటియాలా హౌస్ కోర్టులో చిక్కుకు పోయిన కన్హైయా కుమార్, విలేఖరులు, లాయర్ల భద్రతకు బాధ్యత వహిస్తానని పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ సుప్రీ ధర్మాసనానికి తెలిపారు.
4:42 PM: విలేఖరులపై దాడి విషయమై ముగ్గురు లాయర్లు, బిజేపి ఎంఎల్ఏ ఓ పి శర్మ లకు సమన్లు జారీ చేశాము -బి ఎస్ బస్సీ
4:43 PM: సీనియర్ లాయర్ల బృందం, ఢిల్లీ హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ లు తమ నివేదికను రేపు (గురువారం ఫిబ్రవరి 18) పాటియాలా హౌస్ కోర్ట్ లో సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
4:46 PM: కన్హైయా కుమార్ చేతి వ్రాతతో రాసిన “నాకు రాజ్యాంగంపై నమ్మకం ఉన్నది” అన్న ప్రకటనను విడుదల చేస్తాం -దుష్యంత్ దవే (పోలీసుల లాయర్).
4:50 PM: పాటియాలా హౌస్ కోర్టు ఘటనలను సుప్రీం కోర్టు రేపు పరిశీలిస్తుంది.
4:52 PM: వివేకవంతమైన పోలీసింగ్ పద్ధతులను మేము పాటించాము -కమిషనర్ బస్సీ
5:19 PM: నేను భారతీయుడిని. నాకు రాజ్యాంగంపైనా దేశ న్యాయ వ్యవస్ధ పైనా పూర్తి నమ్మకం ఉన్నది. -కోర్టులో కన్హైయా కుమార్
5:20 PM: నాకు వ్యతిరేకంగా సాక్షం ఉంటే నన్ను జైలుకు పంపండి. లేకపోతే నాకు వ్యతిరేకంగా మీడియా జరుపుతున్న విచారణ ఆగిపోవాలి. –కన్హైయా
“నాకు వ్యతిరేకంగా మీడియా విచారణ జరపడం బాధాకరం. నేను దేశ ద్రోహిని అని చెప్పడానికి సాక్షం ఉంటే దయచేసి నన్ను జైలుకు పంపండి. కాను సాక్షం లేకపోతే మీడియా విచారణ అనేది ఉండకూడదు” అని కన్హైయా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లవ్లీన్ ముందు ఇచ్చిన ప్రకటనలో కన్హైయా కుమార్ పేర్కొన్నారు.