మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు.
ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను పుస్తకంగా రాస్తూ అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించిన తర్వాత, ఓ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బి.జె.పిపై మన్మోహన్ సైతం దాడి చేసిన సందర్భంలో ఈ సమావేశం జరగడంతో పత్రికలు పలు ఊహాగానాలు చేశాయి.
మాజీ ప్రధాని చుట్టూ 2జి ఉచ్చు బిగుస్తున్నందునే ఆయన ప్రస్తుత ప్రధానిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఈ సమావేశం ఉద్దేశ్యం ఏమిటి? ఎవరి చొరవతో ఈ సమావేశం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు పత్రికలు త్వరగా సమాధానం దొరకలేదు.
విచిత్రం ఏమిటంటే మాజీ ప్రధాని చొరవతో ఆయన అవసరం కోసం జరగలేదు. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడి ఆహ్వానం మేరకే జరిగింది తప్ప మాజీ ప్రధాని చొరవతో జరిగింది కాదు. కారణం ఏమిటో గానీ ప్రధాని మోడి మాజీ ప్రధానితో తన సమావేశం గొప్పగా జరిగిందని ట్వీట్ చేశారు గానీ, తానే మన్మోహన్ ను ఆహ్వానించానని మాత్రం చెప్పకుండా దాచిపెట్టారు.
జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి కాంగ్రెస్ నేతలే చొరవ తీసుకుని ‘ప్రధాని మోడి ఆహ్వానం మేరకే మన్మోహన్ ప్రధానిని కలిశారని, ఆర్ధిక మరియు విదేశీ విధానాల విషయంలో సలహాలు తీసుకునేందుకే ఆ రోజు మన్మోహన్ ని ఆహ్వానం వస్తే ఆయన వెళ్లారని ప్రకటించారు.
ఇండియా టుడే పత్రిక ప్రకారం ప్రధాని ట్వీట్ చేసిన ఫోటోను పైన చూడవచ్చు. ఆయన ట్వీట్ ను కింద చూడవచ్చు.
Very happy to meet Dr. Manmohan Singh ji & welcome him back to 7RCR. We had a great meeting.
“దీని అర్ధం డాక్టర్. మన్మోహన్ సింగ్ గారిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. 7 రేస్ కోర్స్ రోడ్ (ప్రధాని నివాసం) కు ఆయనకు పునఃస్వాగతం. మా సమావేశం గొప్పగా జరిగింది”…. అని.
ఈ ట్వీట్ లో తన చొరవతోనే, తన అవసరం కోసమే సమావేశం జరిగిన సంగతి ప్రధాని మోడి ఎందుకు చెప్పలేకపోయారు. ఆరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇచ్చేవరకు ఈ సంగతి ఎందుకు బయిటకు పొక్కలేదు?
ఈ వ్యవహారంలో ప్రజలు గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రధాని మోడి ఏ కాంగ్రెస్ ఆర్ధిక విధానాలనైతే తిట్టి పోసి, వాటివల్లనే దేశం దారుణంగా దిగజారిందని నిర్ధారించారో అధికారం చేపట్టాక అవే విధానాలను అనుసరించడమే కాక మాజీ ప్రభుత్వ నేతల సలహా సంప్రతింపులు కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఎవరు వంచకులు? ఎవరు వంచితులు?