మోడి దెబ్బతో: “నేను ఓటర్ల విశ్వాసం కోల్పోయాను. రాజీనామా చేసేస్తున్నాను”
లాలూ తోడు రాగా: “నాకు మళ్ళీ ఓటర్ల విశ్వాసం వచ్చేసింది”
*********
లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయిన ఆనాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ “తాను ఓటరు విశ్వాసం కోల్పోయినందుకు రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించి గద్దె దిగిపోయారు.
ఇప్పుడేమో తనకు 130 మంది ఎం.ఎల్.ఏ ల విశ్వాసం ఉన్నది గనుక తనకు మళ్ళీ సి.ఎం కుర్చీ ఇచ్చేయ్యాలని పాట్నా నుండి ఢిల్లీ దాకా అరిచి గోల చేస్తున్నారు.
ప్రజల విశ్వాసం కోల్పోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన తర్వాత లెక్క ప్రకారం మళ్ళీ ఆ ప్రజల విశ్వాసం పొందాకనే సి.ఎం కుర్చీలో కూర్చోవాలి. మళ్ళీ ప్రజల విశ్వాసం పొందేదీ ఎన్నికలు జరిగితేనే. ఈ లోపే నా కుర్చీ నాకు కావాలని నితీష్ డిమాండ్ చేయడం అనైతికం కాదా?
నైతిక బాధ్యత అంటూ గద్దె దిగితే ప్రజల్లో పలుకుబడి పెంచుకోవచ్చని నితీష్ ఆశించారు. పలుకుబడి పెరగడం సంగతేమో గానీ తాత్మాలిక ప్రాతిపదికన కుర్చీలో కూర్చోబెట్టిన మంఝి ఏకు మేకై ఎదురు తిరిగేసరికి అసలుకే ఎసరు వస్తోందన్న భయం పట్టుకుంది.
జనతా పరివార్ పేరుతో లాలూ ప్రసాద్ ని సైతం కూడగట్టుకున్న నితీష్, తాను సంపాదించిన మద్దతు బలం (లాలూ ఎమ్మేల్యేలు) మంఝి వల్ల ఒట్టిపోయే పరిస్ధితి ఎదురు కావడంతో ‘నైతిక బాధ్యత’ ను మర్చిపోయారు.
నితీష్ ప్రకటించిన ‘నైతిక బాధ్యత’ పదవీ రాజకీయాల ముందు ఎలా వెలాతెలా పోయిందో ఈ కార్టూన్ ద్వారా కార్టూనిస్టు పరిహసించారు.