భారత నౌకా బలగం, స్వల్ప కాల విరామం అనంతరం, ప్రమాదాల నిలయంగా కొనసాగుతూనే ఉంది. గత వారమే సహాయక నౌక ఒకటి విశాఖపట్నం తీరంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన ఒక నావికుడి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో నలుగురు ఆచూకీ దొరకని వారుగా ప్రకటించబడ్డారు. వైజాగ్ సమీపంలో ఒక వాణిజ్య నౌక ఢీ కొట్టడంతో ఐ.ఎన్.ఎస్ కోరా అనే క్షిపణి యుద్ధ నావ స్వల్ప నష్టానికి గురైన తర్వాత పక్షం రోజుల్లోనే ఇది రెండో ప్రమాద ఘటన. తాజా ఘటన తర్వాత భారత నౌకా దళం ఒకే ఒక్క టార్పెడో రికవరీ నౌకతో మిగిలిపోయింది. ముంబై నౌకాశ్రయంలో నిలిపి ఉన్న కిలో-క్లాస్ జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్ సింధురక్షక్ గతేడు ఆగస్టు 14 తేదీన లోపలి పేలుడు వలన మునిగిపోయిన తర్వాత 15 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఫిబ్రవరి 26 తేదీన మరో జలాంతర్గామి సింధురత్న పైన జరిగిన మరో ప్రమాదం వలన నౌకా బలగాల అధిపతి అడ్మిరల్ డి.కె.జోషి తన పదవిని మూల్యంగా చెల్లించారు; ఆయన ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
(డి.కె.జోషి) రాజీనామా నౌకా బలగాల అత్యున్నత స్ధాయిలో భారీ మొత్తంలో పదవీ సర్దుబాట్లకు దారి తీసింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ మొత్తం ప్రక్రియలను సమీక్షించాలని ఆదేశించారు. అన్ని దుర్ఘటనలకు గల కారణాలను కూలంకషంగా విశ్లేషించామని అనంతరం ఆయన ప్రకటించారు. కానీ (ప్రమాదాల) ధోరణి అరికట్టబడలేదు, నేర్చిన గుణపాఠాలు అసంపూర్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. సమస్య ఏ ఒక్క అంశానికో పరిమితమై లేదు, అది సర్వవ్యాపితంగా కనిపిస్తోంది. జలాంతర్గాములు, యుద్ధంలో ముందు వరసలో ఉండే యుద్ధ నౌకలు, సహాయక నౌకలు… అన్నీ సమానంగా ప్రమాదాలకు గురయ్యాయి. ఇది వ్యవస్ధాగత లోపాలను సూచిస్తోంది; నిర్వహణ లోపం కావచ్చు, విడి భాగాల సేకరణ కావచ్చు, లేదా ప్రామాణిక నిర్వహణా ప్రక్రియలకు (స్టాండర్ద్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) కట్టుబడకపోవడం వల్ల కావచ్చు. దానితో పాటు, రోజువారీ నిర్వహణలోనూ, ఆయుధాల సేకరణ నిర్ణయాలలోనూ (నౌకా) బలగాల అవసరాలకు తగిన విధంగా వ్యవహరించడంలో అశక్తతతో ఉన్నామని అడ్మిరల్ జోషి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. బ్యూరోక్రసీ అవసరానికి మించి జోక్యం చేసుకుంటోందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. బ్యూరోక్రసీ, మిలట్రీల మధ్య విశ్వాసానికీ సంబంధించిన సంక్షోభం నెలకొని ఉందనీ సూచిస్తోంది.
180 నౌకలను నిర్వహిస్తూ భారీ ఆధునిక (నౌకా) తిన్నెలను చేర్చుకుంటున్న నావికా బలగం నిర్వహణా, విడిభాగాల సమస్యలతో సతమతం అవుతుండడం విభ్రాంతి కారకం. సముద్ర జలశక్తిగానూ, ఈ ప్రాంతంలో నికర భద్రతా కల్పనాదారుగానూ అవతరించాలని కలలు గంటున్న ఒక బలగానికి సరితూగే అంశం కాదిది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత నావికా బలగం సర్వశ్రేష్ఠమైనదని విస్తృత ఆమోదానికి నోచుకున్న విషయం. తగిన మద్దతు కోసం, నాయకత్వం కోసం ఈ ప్రాంతం లోని అనేక దేశాల నావికా బలగాలు భారత నావికా బలగంవైపు చూస్తుంటాయి. న్యూ ఢిల్లీ నెరిపే దౌత్య సంబంధాల్లో ఇటీవలి కాలంలో నౌకాబల దౌత్యం ప్రధాన అంశంగా ముందుకు రావడం ఆశ్చర్యకరం ఏమీ కాదు. అనేక దేశాలకు మన నావికా బలగం శిక్షణ మరియు నిర్వహణా మద్దతును అందిస్తోంది.
సొంత గడ్డపై సందేహాస్పదమైన భద్రతా చరిత్ర నమోదు అయినట్లయితే అది మన దేశ విశ్వసనీయత మరియు సామర్ధ్యాలపై ఇతర దేశాల మదిలో తీవ్ర అనుమానాలు పొడసూపే అవకాశం మెండుగా ఉన్నది. కారణాలు ఏమయినప్పటికీ ఈ ఘటనలు ఆమోదనీయం కావు. ఇటువంటి ప్రమాదాలు జరగడం కొనసాగుతున్నట్లయితే సమీక్షిస్తామని, పునః దిశానిర్దేశం కావిస్తామని ఒట్టి హామీలు ఇవ్వడం వల్ల మన నౌకా బలగం వృత్తిగతమైన శక్తిగా పేరు నిలుపుకోవడంలో పెద్దగా ఫలితం దక్కదు. విలువైన ప్రాణాలు, ఖరీదైన తిన్నెలు (platforms), అన్నింటి కంటే ముఖ్యంగా మన నౌకాబలగం మరియు మన దేశం యొక్క విశ్వసనీయతలు ఇప్పుడు ఫణంగా ఒడ్డి ఉన్నాము. నిజాయితీగా అంతఃపరిశీలన చేసుకోవడానికి దిశా-సవరణ కావించడానికి ఇది సమయం!