మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య


ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై కేసు నమోదు చేసిందని వ్యాఖ్యానించింది. ‘తనపై కేసు పెట్టడం రాజకీయ పగ సాధించడంలో భాగమని’ మాయావతి చేసిన వాదనకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది.

మాయావతిపై కేసు తెరవడంలో సి.బి.ఐ అనుసరించిన పద్ధతికి సాధికారత లేదని సుప్రీం కోర్టు డివిజన్ బెంచి వ్యాఖ్యానించింది. తాజ్ కారిడార్ కుంభకోణంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సి.బి.ఐ సరిగ్గా అర్ధం చేసుకోకుండా యు.పి మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసిందని తేల్చింది. కుంభకోణంలో నిందితులైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా దర్యాప్తు ప్రారంభించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిందే తప్ప అక్రమంగా ఆస్తులు ఆర్జించిందంటూ మాయావతి పై ప్రత్యేకంగా వేరొక ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని ఎలాంటి ఆదేశామూ ఇవ్వలేదని కోర్టు స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 2008 లో సి.బి.ఐ దాఖలు చేసిన ‘స్టేటస్ రిపోర్టు’ లో కూడా మాయావతి 1995-2003 కాలంలో అక్రమ ఆస్తులు సంపాదించిందనడానికి రుజువులు కనుగొన్నట్లు చెప్పలేకపోయిందని కోర్టు తెలిపింది. “తాజ్ కారిడార్ కుంభ కోణంలో పిటిషనర్ (మాయావతి) అక్రమ ఆస్తులకు సంబంధించి ఎలాంటి మెటీరీయల్ రిపోర్టు లేదు” అని కోర్టు పేర్కొంది. సి.బి.ఐ స్టేటస్ రిపోర్టు ను ఉద్దేశిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యానం చేసింది.

2002 నాటి తన ఆదేశం నిర్ధిస్టంగా తాజ్ కారిడార్ కుంభకోణానికి సంబంధించినదే తప్ప సి.బి.ఐ చేసినట్లుగా మాయావతి పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అందులో లేదని కోర్టు తెలిపింది. అవినీతి నిరోధక చట్టం కింద మాయావతికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా (exclusively) ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని ఎలాంటి ఆదేశామూ లేదని స్పష్టం చేసింది. మాయావతి పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేయడం ద్వారా సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించిందని కూడా సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండా ఒక ముఖ్యమంత్రిపై అక్రమాస్తుల కేసు నమోదు చేయడం తన అధికార పరిధిని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది.

“సి.బి.ఐ కేవలం ఒక ఎఫ్.ఐ.ఆర్ (తాజ్ కారిడార్ కుంభకోణం) మాత్రమే దాఖలు చేయాల్సింది. రెండో ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు నుండి ఎటువంటి ఆదేశమూ లేదు” అని సుప్రీం బెంచి తెలిపింది. తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని మాయావతి మే 2008 లో పెట్టుకున్న పిటిషన్ ను విచారిస్తూ కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. మే 1 తేదీన రిజర్వు చేసిన తీర్పును కోర్టు శుక్రవారం ప్రకటించింది. తనపై రాజకీయంగా పగ సాధించడానికే అక్రమాస్తులున్నాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారని మాయావతి తన పిటిషన్ లో వాదించింది.

తన ఆదాయం నీతివంతమైనదేనని ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పును సి.బి.ఐ పరిగణించలేదని మాయావతి కోర్టుకు తెలిపింది. ట్రిబ్యూనల్ తీర్పును ఢిల్లీ హై కోర్టు కూడా సమర్ధించినట్లు ఆమె సుప్రీం కోర్టుకు సమర్పించింది. మాయావతి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రబల సాక్షాలు ఉన్నట్లు సి.బి.ఐ వాదించినప్పటికీ దాని స్టేటస్ రిపోర్టు లో సాక్ష్యాలెవీ పొందుపరచలేదని సుప్రీం కోర్టు చెప్పడం గమనార్హం. 2003 లో మాయావతి ప్రకటిత ఆస్తులు 1 కోటి రూపాయలు కాగా 2007 నాటి కల్లా 50 కోట్లకు అది పెరిగిందని సి.బి.ఐ వాదించింది.

మాయావతి అవినీతిపై దేశంలో పత్రికలు విస్తృత ప్రచారం చేశాయి. ప్రప్రధమ దళిత ముఖ్యమంత్రిగా మన్ననలు అందుకున్న మాయావతి పై వచ్చిన అవినీతి ఆరోపణలన్నీ అగ్రవర్గాల కుట్రలేనని దళిత రాజకీయవేత్తలు వాదిస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి నెలకొల్పిన విగ్రహాలపైన కూడా జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో విస్తృత వ్యతిరేక ప్రచారం సాగింది. మహా నేత అంటూ ఆంధ్ర ప్రదేశ్ లో సాగిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాల స్ధాపనను మాత్రం ఈ పత్రికలు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు.

అనేక పట్టణాల్లో నడిరోడ్డుపైన ట్రాఫిక్ ప్రవాహానికి తీవ్ర అంతరాయాలు కలిగిస్తూ స్ధాపించిన వై.ఎస్.ఆర్ విగ్రహాలు ఈ పత్రికలకు ఎప్పుడూ సమస్య కాలేదు. కానీ మాయావతి పదవిలో ఉన్నన్నాళ్లూ ఆమె నెలకొల్పిన విగ్రహాలు మాత్రం జాతీయ సమస్యగా పత్రికలు ప్రచారం చేశాయి. విచక్షణారహితంగా విగ్రహాలు స్ధాపించడం ఎవరు చేసినా సమర్ధనీయం కానప్పటికీ ఒక అగ్రకుల ముఖ్యమంత్రి విగ్రహాలు సమస్య కాకపోవడం, మరొక దళిత మహిళా ముఖ్యమంత్రి విగ్రహాలు జాతీయ సమస్య గా మారడమే అభ్యంతరకరం.

ఇపుడు మాయావతి పై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ధనిక వర్గాల రాజకీయాల్లో సైతం కుల వివక్ష కొనసాగుతోందనడానికి బలం చేకూరుతోంది. సాక్ష్యాలు లేనంత మాత్రాన అవినీతికి పాల్పడలేదని చెప్పలేమన్నది నిజమే కావచ్చు. మాయావతి పై దాఖలైన అవినీతి కేసు అలాంటిది కూడా కాదు. అసలు సుప్రీం కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ స్వతంత్రించి ఆమెపై ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిందని స్పష్టం అవుతోంది. సి.బి.ఐ చేసిన చొరవ ‘అతి’ అనీ, తన అధికార పరిధిని అతిక్రమించడమేననీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రత్యేకంగా గమనార్హం. అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా సి.బి.ఐ వ్యవహరిస్తోందని దాదాపు అన్నీ పార్టీలూ ఆరోపిస్తున్న నేపధ్యంలో మాయావతి పై కేసు నమోదు చేయడంలో అప్పటి ఎన్.డి.ఏ ప్రభుత్వం చొరవే అధికంగా ఉందన్న అనుమానాలు తాజాగా తలెత్తాయి. అసలు సుప్రీం కోర్టు ఆదేశాలతో పాటు, ఆధారాలు కూడా లేని కేసు ఒక దళిత మహిళా ముఖ్యమంత్రిపై తొమ్మిదేళ్ల పాటు కొనసాగడం భారత దేశంలోని కుల రాజకీయాల్లోని మరొక కోణం కూడా కావచ్చు.

39 thoughts on “మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

  1. ఇప్పుడు Suprime court లో judgement ఇచ్చింది అగ్రకులం వాడా కాదా?
    జరిగింది Sonia Gandhi మాయావతి యుద్ధం మధ్యలో అగ్రకులాలు ఎందుకు వచ్చాయి, Sonia Gandhi is a christian అగ్రకులం వ్యక్తి కాదు.

  2. ఫణీంద్ర గారూ, సోనియా, మాయావతి లు కత్తిపట్టి యుద్ధం చేస్తున్నట్లు నేను అనుకోవడం లేదు.

    రాజకీయ నాయకులు, పార్టీలు ఆయా ధనిక వర్గాలకు ప్రతినిధులు. మాయావతి ప్రాతినిధ్యం వహించే ధనిక వర్గాలను గెలవడానికి ఆమె సామాజిక నేపధ్యాన్ని ఉపయోగించుకోవడం ఇక్కడ విషయం.

    ఎన్నికల్లో ఆమె లాంటివారి సామాజిక నేపధ్యాన్ని వాడుకునే ధనికవర్గాలకి పదవీ పంపకం విషయానికి వస్తే మాత్రం ఆ నేపధ్యమే పనికిరానిదిగా మారుతోంది. ఆ సంగతే ఇక్కడ చెబుతున్నాను. మీరు వ్యక్తం చేస్తున్న సోనియా లేదా క్రిస్టియన్ ద్వేషానికి ఈ విశ్లేషణలో జాగా లేదు.

  3. విశెఖర్ గారూ. మీరు రాసిన మొత్తం సారాంశాన్ని గ్రహిస్తె మీరు మాయావతికి సపొర్ట్ గా వున్నారనిపిస్తుంది. ఆమె పెట్టుబడిదారీ వర్గానికి ప్రతినిధిగా ముఖ్యమంత్రి అయినారు.దళితులు అగ్రవర్నాలు కార్మిక వర్గంలొ వున్నంతవరకే ఆ పొలిక సరిపొతుంది. ఆ వర్గానికి ప్రతినిధి అయిన తర్వాత ఆ వర్నాలు పనికిరావు. యవరైనా చనిపొయిన తర్వాత విగ్రహాలు పెట్టుకొవడం రివాజు కాని మాయావతి తను బతికున్నప్పుడే తన విగ్రహాలు పెట్టించుకుంది కాని దీని పైన విమర్శ లేకుండా వెనకేసుక వచ్చారు. రాజశెఖర రెడ్డి విగ్రహాలు పెట్టినా మరొకరి విగ్రహాలు పెట్టినా ప్రజా జీవనానికి ఆటంఖమే.

    మాయావతి పైన పెట్టిన కేసుల్ని వర్గ భలాభలాల సమస్యగా చుడాలి గాని అది దళితులైనందుకొ మరొకందుకొ కాదు. దీన్ని కులాల సమస్యగా సుస్తె పక్కదారి పట్టె ప్రమాదం వుంది. కులాల వర్తింపు ఎప్పుడు వర్తిస్తుందంటే కార్మిక వర్గం లొ వున్నప్పుడు మాత్రమే ఆర్దిక ఇబ్బందులకు బదులు కులాల సమస్య కుడా అధనంగా ఎదుర్కొవలసి వుంటుంది.

    పైవివన్నీ మీకు తెలిసినవే ఆమెను కులపరంగా ఎందుకు చుడవలసి వచ్చింది??

  4. రామ్మోహన్ గారూ సామాజిక వివక్షలు ఏ వర్గంలో ఉన్నా ఖండించవలసిందే. కార్మికవర్గంలో కుల వివక్షను మాత్రమే వ్యతిరేకించాలనీ, ధనికవర్గాల్లో కుల వివక్షను పట్టించుకోనవసరం లేదనీ మీరు చెబుతున్నారు. అది సరి కాదని నా అభిప్రాయం. మీరు చెప్పిన విషయం ఇతర అంశాలకు కూడా వర్తింపజేస్తే ప్రమాదకర అర్ధాలు వస్తాయి. ఉదాహరణకి స్త్రీలపై వివక్ష. ధనికవర్గాలలోని స్త్రీలపై పురుష దురహంకారం ఉన్నా పట్టించుకోనవసరం లేదని అనగలమా?

    మాయావతి విగ్రహాలపై కూడా పైన విమర్శ ఉంది కదా. ‘బతికున్నపుడే’ అన్న పదం లేదనా మీ అభ్యంతరం? అదే అయితే ఈ సందర్భంలో అది పెద్ద విషయంగా చూడనవసరం లేదు. విగ్రహాలు సమస్యే అయితే అది అందరికీ ఒకేలా ఉండాలని పైన చెప్పాను.

    “మాయావతి పైన పెట్టిన కేసుల్ని వర్గ భలాభలాల సమస్యగా చుడాలి గాని అది దళితులైనందుకొ మరొకందుకొ కాదు.”

    ఈ ఆర్టికల్ లో విషయం ఇదే. మాయావతి పై పెట్టిన కేసుల్లో వర్గంతో పాటు కులం కూడా ఉందన్నదే నేను చెప్పదలిచింది. ఆర్ధిక బలా బలాల వైరుధ్యాలు కోర్టు కేసుల రూపంలో వ్యక్తం కావలసిన చోట కులం కూడా పాత్ర వహించిందన్నదే ఇక్కడ విషయం. అసలు కేసే లేకుండా, కోర్టు ఆదేశాలే లేకుండా, అధికార పరిధి కూడా లేకుండా మాయావతి పై కేసు పెట్టడం ఎలా సాధ్యం అయింది? దానికి ప్రోద్బలం ఏమిటి? కులం పాత్ర లేకుండా మాయావతి పై ఇంత ఘోరంగా తొమ్మిదేళ్ల పాటు కేసు నడవడం సాధ్యమా? ఈ కేసులో ఇవి చర్చాంశాలు.

    భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధ కొనసాగుతోందని మీరు అంగీకరిస్తే, అది ప్రధానంగా కులం రూపంలో ఉందని కూడా గుర్తించాలి. పునాది నుండి ఉపరితలం వరకూ విస్తరించిన కుల వివక్ష భారత దేశంలోని వర్గాల పొందికను మరింత సంక్లిష్టం కావించింది. అందువల్ల వర్గాల బలాబలాలు మీరు చెప్పినంత స్పష్టంగా ‘నలుపు తెలుపు’ లా విడదీయదగ్గ స్ధాయిలో లేకుండా పోయింది.

  5. విశెఖర్ గారూ. ప్రదానంగా వున్న వర్గానికీ, మిగతా ఉపరితల అంశాలకూ, వర్తింప చేయలేమని నా అభిప్రాయం. ఒక మహిళా అధికారి కింద పురుషుడైనా వంగి వంగి సలాములు చేయవలసిందే. ఇక్కడ ఏ లింగం అనేది అనవసరం అధికారి యవరన్నదే ముఖ్యం.అలాగే అక్కడ పెట్టుబడిదారీ వర్గాన్ని , కార్మిక వర్గాన్ని చుస్తాం గాని అందులొ ఏ కులం ఏంటి అనేది అనవసరం. మీరన్నట్టు భారత దేశంలొ భుస్వామ్య వ్యవస్త వుండగానే పెట్టుబడిదారీ వ్యవస్త దానిపైన పుట్టుకవచ్చింది. దాని చాయలు పెట్టుబడిదారి వర్గంలొ కుడా వుంటాయి అయితే అది చాలా చాలా భలహీనం. ప్రస్తుత పరిస్తితులలొ. ఇప్పుడు అగ్రవర్నానలొ కుడా మార్పు వస్తుంది గతం లొకి ఇప్పటికీ చాలా తేడా వుంది.

    అన్నేళ్ళ పాటు కులం పాత్రవల్లె కేసు నడిచిందని అనగలమా?

  6. “ప్రప్రధమ దళిత ముఖ్యమంత్రిగా మన్ననలు అందుకున్న మాయావతి”
    ఇక్కడేదో లెక్క తప్పింది. తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య గారు కదా. కథనం కింద మాత్రం సరిగానే రాశారు ప్రప్రథమ దళిత మహిళా ముఖ్యమంత్రి అంటూ.

    సిబిఐ అతి ఈ సందర్భంలోనే కాదు కదా. జగన్ కేసు విషయంలో కూడా తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత ప్రత్యక్షంగా అది అతి చర్యలకు పాల్పడుతూనే ఉంది. రేపు ఈ కేసులలో సిబిఐ అతి అంటూ తీర్పులు రావచ్చు కూడా.

  7. రామ్మోహన్ గారు, భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధ కొనసాగుతోందన్న విషయంలో మీ అవగాహనలో కొంత విభేదం కనిపిస్తోంది. పెట్టుబడిదారీ వర్గంలో భూస్వామ్య ఛాయలు బలహీనం అని మీరంటున్నారు. ఏమిటి దీనర్ధం?

    వర్గపరంగా చూసినపుడు భారత దేశంలో ఉన్నది అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధ. ఈ వర్గీకరణ మీరు విన్నదేనా? “అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధ” అన్న వర్గీకరణపై మీకున్న అవగాహనను బట్టి ఈ అంశంలో మరింత చర్చించవచ్చు.

    భారత దేశంలో పెట్టుబడిదారీ వర్గం జన్మతః దళారీ వర్గం. పెట్టుబడిదారీ వర్గానికీ, భూస్వామ్య వర్గానికి ఉండవలసిన సహజ శతృ వైరుధ్యం భారత దేశంలో లోపించింది. భూస్వాములే పెట్టుబడిదారీ వర్గంగా కూడా అవతరించడం వారు విదేశీ సామ్రాజ్యవాదులతో మిలాఖతు కావడం బ్రిటిష్ వాడి వల్ల జరిగిన పరిణామం. (మావో ధాట్ అంటే ఏమిటి అన్న ఆర్టికల్ లో ఈ విషయంపై మరి కొంత వివరణ చూడగలరు) దీనివల్ల ఇండియాలో పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల మధ్య వైరుధ్యం కంటే కుమ్మక్కు ఎక్కువగా ఉంది. భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులూ పరస్పరం కలిసిపోవడం వల్ల వారి మధ్య వైరుధ్యం ఒక విధంగా అప్రస్తుతంగా కూడా మారిపోయింది. ఈ అవగాహనలో చూసినపుడు పెట్టుబడిదారీ వర్గంలో భూస్వామ్య రూపం అయిన కులం ఛాయలు బలహీనం అని అనడం సాధ్యం కాదు.

    “ఒక మహిళా అధికారి కింద పురుషుడైనా వంగి వంగి సలాములు చేయవలసిందే. ఇక్కడ ఏ లింగం అనేది అనవసరం అధికారి యవరన్నదే ముఖ్యం”

    స్త్రీ పురుష వివక్షను చూడవలసింది ఇలా కాదు గదా. మహిళా అధికారి కింద వంగి వంగి సలాములు చేసే పురుషుడు ఆ అధికారిణిని మహీళగా వివక్షతో చూడడని భావించలేము. అతనికి వివక్ష ఉన్నట్లయితే అధికారికంగా వంగి ఉన్నా, మహిళగా ఆధిపత్యానికే ప్రయత్నిస్తాడు. వివక్ష అన్నది ఏ అధికార దర్పానికి తలవంచదు. తలవంచితే అది వివక్షగా చూడవలసిన అవసరం ఉండబోదు.

    “అలాగే అక్కడ పెట్టుబడిదారీ వర్గాన్ని , కార్మిక వర్గాన్ని చుస్తాం గాని అందులొ ఏ కులం ఏంటి అనేది అనవసరం.”

    భారత దేశంలో సంక్లిష్టత ఇంత తేలికగా లేదన్నదే నేను చెబుతున్నది. వర్గ రాజకీయాలను ఆధారంగా మాత్రమే పని చేస్తే కమ్యూనిస్టు పార్టీలకు ఆదరణ లభించడం లేదు. చరిత్రే దానికి సాక్ష్యం. వర్గ దోపిడీని కనిపించకుండా చేస్తున్న కుల రాజకీయాలు ప్రధానంగా కనిపిస్తున్నపుడు వర్గ, కుల సంక్లిష్టత లను వదిలి కేవలం వర్గం పై ఆధారపడలేము. దానర్ధం కుల రాజకీయాలు చేయాలని కాదు. కుల వ్యతిరేక రాజకీయాలు ఆచరణాత్మకంగా చేయాలని దానర్ధం.

    మాయావతి విషయానికి వస్తే ఆమెపై సాగే కులవివక్షతను వ్యతిరేకించే పనికి కమ్యూనిస్టులు పూనుకోవాలి. ఆమె బూర్జువా ప్రతినిధే అయినా అణచివేతకు గురైన కులానికి చెందిన వ్యక్తి. ఆమె ఎదుర్కొన్న కుల అణచివేతను షేర్ చేసుకునే కార్మిక వర్గం భారత దేశంలో ప్రబలంగా ఉంది. కుల వ్యతిరేకతను షేర్ చేసుకోకుండా నువ్వు కార్మిక వర్గం కాబట్టి నా వెనుక రా అనంటే కమ్యూనిస్టుల మాటలు దళితులు వినవలసిన అవసరం లేదు. దళిత ప్రజలంతా ఎదుర్కొనే కుల వివక్షను వ్యతిరేకించకుండా వారిలో కొంతమందిగా ఉన్న బూర్జువా వర్గాన్ని వారి నుండి వేరు చేయలేము. భారత దేశంలో ఇది మౌలికాంశం. అందుకే మాయావతి లాంటి బూర్జువా ప్రతినిధులపై సాగే కుల వివక్షతను వ్యతిరేకించకుండా వారి వెనుక కులపరంగా సమీకృతులైన కార్మికవర్గాన్ని వర్గపరంగా కూడా సమీకరించలేము. అందుకు వారు ఒప్పుకోరు. మాయావతి పై వివక్షను వ్యతిరేకించడం కులం కోసం కాదు, వర్గం కోసం.

  8. రామ్మోహన్ గారూ మరో విషయం మరిచాను. ఏళ్లపాటు కేసు నడవడం అనేది భారత దేశ న్యాయవ్యవస్దకు సంబంధించినది. ఆర్టికల్ లో చెప్పినట్లు కేసు లేకుండా, అధికారం లేకుండా, ఆదేశాలు లేకుండా అన్నేళ్లు కేసు కొనసాగడాన్ని నేను ప్రస్తావించాను. వివక్ష అన్నది కేసు మోపడంలోనే ఉంది. ఆ తర్వాత అన్నేళ్లు కొనసాగడం మరో లక్షణం.

  9. రాజు గారూ, మొదటిసారి మహిళ అన్నది మిస్ అయింది.

    సి.బి.ఐ అతి అని కోర్టు చెప్పింది ‘కేసు లేకుండా, సుప్రీం ఆదేశాలు లేకుండా, కనీసం అధికార పరిధి కూడా లేకుండా’ కేసు పెట్టడం గురించి. జగన్ విషయంలో బోలెడంత కేసు ఉంది. ఆయన విషయంలో సి.బి.ఐ చేస్తున్నది అతి అనాల్సిన అవసరం లేదనుకుంటా. కుల, ధన రాజకీయాల వల్ల జగన్ అరెస్టు కి వచ్చిన ప్రాముఖ్యత వల్లనే సి.బి.ఐ విధి కూడా అతి గా కనిపిస్తొంది. నిజానికి జగన్ పై సాగుతున్న విచారణ సాధారణంగా అలాంటి కేసులన్నింటిలోనూ చట్టపరంగా జరగవలసినవే. వివిధ రాజకీయాలు, కుమ్మక్కుల వలన ఇతరుల విషయాల్లో అది జరగలేదు. దానితో అలా జరగడమే అతి అయినట్లు కనిపిస్తొంది.

  10. విశెఖర్ గారూ.పెట్టుబడిదారీ సమాజంలొ భుస్వామ్య వ్యవస్త బలహీనం అన్నది నేను భావజాలం విషయంలొ గతానికీ, ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని నా అభిప్రాయం మాయావతి విషయంలొ కుల ప్రస్తావన గురించి అన్నాను.

    “ఒక మహిళా అధికారి కింద పురుషుడైనా వంగి వంగి సలాములు చేయవలసిందే ” నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుక వచ్చానంటె పునాదికీ, ఉపరితలానికీ, వర్తింప చేయాలని మీరన్నప్పుడు అలా సాద్యం కాదని చెప్పడానికి.

    వివక్ష అనేది ఏఅధికార దర్పానికీ తలవంచదని అంటున్నారు ఇది యలాసాద్యం వివక్ష అనేది అధికారానికీ,ఆర్దికానికీ, విడిగా వుంటుందా? పునాదిని బట్టెకదా ఉపరితలం ఆదారపడేది. అతని దగ్గర ఏఆయుదం లేనప్పుడు వివక్ష ఏలాచుపుతాడు.

    “వర్గ రాజకీయాలను ఆదారంగా మాత్రమే పని చేస్తె కమ్యునిస్టు పార్టీలకు ఆదరణ లభించడం లేదు. దానికి చరితే సాక్ష్యం.”

    దీనికి ఒక్క ఉదాహరణ చెప్పండి చాలు. స్వాతంత్ర పొరాటం గానీ, తెలంగాణా సాయుధ పొరాటం గానీ ఈ పొరాటాలు యలాజరిగాయి ? కులాలూ, మతాలూ, ప్రతిపతిన జరిగాయా? భరతదేశంలొ జరిగే చిన్న చిన్న ఉద్యొగాల పొరాటాలు గాని లేక మరేదైనా గాని ఏలాజరుగుతున్నాయి. ఇవి దేనికి సాక్ష్యం? ఇండియాను తీసి పక్కన పెట్టినా అనేక జాతులు కలసిన పొరాటాలు అనేకం వున్నాయి.

    మీరు అంతలొనే కుల వ్యతిరేక రాజకీయాలు చేయాలంటున్నారు.మీరు పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు చెబుతున్నారు.

    ఏదైనా ఒక సమస్య మీద పొరాడటానికి కులాన్ని ఆసరాగా తీసుకొవలసిన అవసరం లేదు. ఆభదను అనుభవించేవాళ్ళు సహజంగానే వస్తాలు. దానికి చరిత్రే సాక్ష్యం. కులం బౌతిక అవసరం కాదు. కులవివక్ష పొరాటమనేది కార్మిక వర్గ పొరాటానికి లొభడి వుంటుంది అంతే గాని ప్రత్యెకంగా విడిగా వుండదు. షెర్ చేసుకొవడమంటే ఇదే అని నేననుకుంటున్నాను. ఇది కాకుండా వేరే ఏమైనా వుంటే చెప్పండి.

    “దళిత ప్రజలు ఎదుర్కునే కుల వివక్షను వ్యెతిరేకించకుండా వారిలొ కొంతమందిగా వున్న బుర్జువా వర్గాన్ని వేరు చేయలేము. ”

    శెఖర్ గారూ చాలా గొప్ప విషయం చెప్పినారు. అలా అయితే మాకులంలొ కుడా కొంతమంది బుర్జువాలు వున్నారు వాళ్ళను కుడా వేరు చేయలేము, మా ఊరికి దూరంగా ఒక కులముంది వాళ్ళలొనూ కొంతమంది బుర్జువాలు వుంటారు వాళ్ళనూ వేరు చేయలేము. ఇంక వేరు చేయవలసింది యవరిని? బుర్జువాలు లేరు శ్రమ దొపిడీ లేదు ఉన్నది కులాలు మాత్రమే. కదా? చాలా గొప్ప తియరీ కనిపెట్టినారు. కులాన్ని వ్యెతిరేకించడమంటే ఎలా వ్యెతిరేకిస్తె వ్యెతిరేకించినట్టు అవుతుంది.సాదారణంగా ఆసందర్భం వచ్చినప్పుడు.దాన్ని చైతన్యం ఉన్నవాళ్ళు ఎలానూ ఖండిస్తారు. అలా కాకుండా ఉద్యమ రూపంలొ ఉండాలనుకుంటున్నారా? కులాన్ని వ్యెతిరేకించకుండానే వేల లక్షల పొరాటాలు జరిగినాయి.అలా జరగవని మీరంటున్నారు ఎలానొ వివరించండి.

  11. విశెఖర్ గారూ. తెలకపల్లి రవి గారి విషయంలొ మీతొ చెప్పినాను. దాన్ని మరచిపొయినట్టు వున్నారు దాని పైన కుడా మీ అభిప్రాయం చెప్పండి తెలుసుకుంటాము.

  12. రామ్మోహన్ గారూ

    కుల వివక్ష ను పునాదికీ, ఉపరితలానికి వర్తింపజేయాలా లేదా అన్నది మీ, నా చేతుల్లో లేదు. కులం ఉపరితల అంశమా లేక పునాది అంశమా అన్న సమస్య కమ్యూనిస్టులకూ, దళిత సంఘాలకు మధ్య చాలా కాలంగా ఒక చర్చగా ఉంది. పునాది అయిన ఆర్ధిక రంగంతో పాటు, ఉపరితల అంశాలైన సాంస్కృతిక రంగాల్లో కూడా కుల వివక్ష ఉన్నందున అది పునాది, ఉపరితలాలకు రెండింటిలోనూ విస్తరించిన అంశంగా విప్లవ రాజకీయాలు ఇప్పుడు చెబుతున్నాయి.

    దళితుల్లో విద్యాధికులైన వారు ప్రధానంగా రిజర్వేషన్ల వల్ల పైకి వచ్చినవారు. అందువల్ల వారు సహజంగానే అంబేడ్కర్ పట్ల ఆరాధనతో ఉన్నారు. వారికి వర్గ చైతన్యం లేదు. కానీ కుల వ్యతిరేక చైతన్యం ఉంది. కానీ ఆ చైతన్యం కులాన్ని అంటిపెట్టుకుని ఉంది. అంటే, కుల అణచివేతకి వ్యతిరేకంగా చైతన్యం ఉన్నప్పటికీ అది కులాల నుండి బైటపడాలనేంత వరకూ ఎదగలేదు. ఆ పరిమితులను మనం గుర్తించాలి.

    ఇలా దళితుల్లో చైతన్యం పొందిన వారే దళితులకు నాయకత్వం వహించి వర్గ రాజకీయాల వైపుకి నడిపించవలసిన వారు. కానీ వారు ఉన్నది దళిత రాజకీయాల ప్రభావంలో. వర్గ రాజకీయాలకూ, వర్గ రాజకీయాల్లో కోర్ గా పని చేయవలసిన కార్మికవర్గానికీ (వీరు ప్రధానంగా దళితుల్లో ఉన్నందున) మధ్య దళిత రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలకు కుల వివక్ష నిర్మూలన ప్రధాన లక్ష్యం. (వారి రాజకీయాలు వారి లక్ష్యాన్ని చేరుకోవన్నది వేరే సంగతి)

    కుల వ్యతిరేకత అన్నది ఆ సందర్భం వచ్చినపుడు చేయవలసినది అని మీరు చెబుతున్నారు. ఈ అవగానను దళిత వర్గాలు (చైతన్యం పొంది సిద్ధాంతం చెబుతున్నవారు) స్వీకరించడం లేదు. దానికి కారణం కులం పునాదులు బలంగా కొనసాగుతుండడమే. ఆ పునాది లేకుండా వారి వాదనలకు బలం చేకూరదు. అంబేద్కర్ ఆరాధన కూడా దానికి జత కూడింది. కులం బలహీనపడిందని మీ వ్యాఖ్యలో ఉంది. నా అవగాహన అది కాదు. కులం, రూపంలో బలహీనపడినట్లు కనిపిస్తున్నదే కానీ సారం లో అలాగే కొనసాగుతోంది. కుల వివక్ష బలహీన పడిందా లేదా అన్న విషయం నిర్ణయించేటపుడు దళితులు అనుభవాలను ప్రధానంగా తీసుకోవాలి. బైటనుండి పరిశీలిచేవారు పూర్తిగా చెప్పగల విషయం కాదది. అంతే కాకుండా కులం బలహీనపడింది అనేందుకు సైద్ధాంతిక వివరణ ఉండాలి. కులం బలహీనపడింది అని చెప్పడం అంటే దేశంలో (అర్ధ) భూస్వామ్య వ్యవస్ధ పునాదులు బలహీనపడినట్లు చెప్పడమే. ఆర్ధిక పునాదులు బలహీనపడకుండా అలా కాలక్రమేణా అర్ధ భూస్వామ్యం బలహీనపడడం సాధ్యమేనా? ఒక సారి ఈ సంగతి ఆలోచించండి.

    సందర్భం వచ్చినపుడు కుల వ్యతిరేకత చూపవచ్చన్న మీ సూచన ఆచరణలో పని చేయలేదు. కారంచేడు, నీరు కొండ లాంటి దాడులు జరిగినపుడు విప్లవ పార్టీలు కుల వ్యతిరేకత రాజకీయాలు చెప్పినప్పటికీ వారు అగ్రకులం అన్న సాకు చూపి ఆ గ్రామాల ఛాయాలకు కూడా రానివ్వలేదు. కత్తి పద్మారావు లాంటి నాయకులు చాలా తేలికగా కులం పేరు చెప్పి విప్లవ రాజకీయాల బారిన పడకుండా దళిత ప్రజలను దారి తప్పించగలిగారు. ఇలా అనేకసార్లు జరిగింది. దళితులపై కుల దాడులు జరిగినపుడు విప్లవ పార్టీలు ఎంతగా కృషి చేసినా దళితుల్లోకి వెళ్లలేకపోయాయి.

    ఈ పరిస్ధితి నుండి విప్లవ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకున్నాయి. వర్గ రాజకీయాలు మాత్రమే చెబుతూ కూర్చుంటే, సందర్భం వచ్చినపుడు కుల వ్యతిరేక రాజకీయాలు చెప్పినా, కార్మిక వర్గం ప్రధానంగా ఉన్న దళిత ప్రజలలోకి వెళ్లలేకపోతున్నామని వారు తమ ఆచరణను సమీక్షించుకున్నారు. కుల వివక్ష పై కూడా రెగ్యులర్ ఆచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. ఈ ఆత్మ విమర్శ ఫలితంగా కొన్ని విప్లవ పార్టీలు ప్రత్యేకంగా కుల వివక్ష వ్యతిరేక సంఘాలు నిర్మించాయి. (దీనిని నేను సమర్ధించను) అయితే వీరి తీర్మానం ఆచరణలో కనీస స్ధాయిలో నైనా ప్రతిబింబించిన దాఖలా లేదు. అందువల్ల దళిత సెక్షన్లలో దళిత సంఘాల హవా కొనసాగుతోంది.

    ఈ నేపధ్యంలో కుల వివక్ష బలంగా కొనసాగుతున్న నేపధ్యంలో, దళిత సెక్షన్లలో కుల వ్యతిరేక చైతన్యం పెరుగుతున్న పరిస్ధితుల్లో కుల అణచివేతను సందర్భం వచ్చినపుడు చూసుకుందామని చెప్పి వాయిదా వేసే పరిస్ధితి లేదు. వాయిదా వేసి దళితుల్లో వర్గ రాజకీయాలు చెప్పే పరిస్ధితి అసలు లేదు.

    ఇది ఆచరణ. ఈ ఆచరణను నేను దగ్గరి నుండి పరిశీలించాను. స్వయంగా విద్యార్ధి రాజకీయాల్లో పాల్గొన్నాను. స్వయంగా దళిత రాజకీయాలనూ, విప్లవ రాజకీయాలనూ దగ్గరి నుండి పరిశీలించాను. ఇరువురి మధ్య సాగిన చర్చోప చర్చలను, వాదప్రతివాదనలనూ, ఘర్షణలనూ, దగ్గరి నుండి చూశాను, విన్నాను, పాల్గొన్నాను. ఈ అనుభవాల నుండి నేను కుల, వర్గ సంక్లిష్టతలపై మాట్లాడుతున్నాను.

    స్వాతంత్ర్య పోరాటం, తెలగాణా సాయుధ పోరాటం ఇవన్నీ ఉన్నత పోరాట రూపాలు. ఈ పోరాటాలు ఉన్నత ఆచరణ రూపం ధరించక ముందు అనేక సంవత్సరాల, దశాబ్ధాల ప్రాధమిక ఆచరణ ఉంది. ప్రాధమిక ఆచరణ లేకుండా ఏ ఉన్నత పోరాటమూ ఉండదు. అలాంటి ప్రాధమిక ఆచరణే నేను చర్చిస్తున్నది.

    కుల వివక్ష పోరాటం అనేది ప్రత్యేకంగా విడిగా ఉండదు అన్నది పూర్తి నిజం కాదు. వర్గపోరాటంతో కుల వ్యతిరేకతను జత చేయాలన్నది సిద్ధాంతం. ఆచరణలో కుల వివక్ష వ్యతిరేక పోరాటాలను ప్రత్యేకంగా చేపట్టవలసిన పరిస్ధితులు అనేకం ఎదురవుతాయి. పోరాటాలు అనగానే కమ్యూనిస్టులు, ప్రజలు మాత్రమే ఉండరు. మధ్యలో అనేక రకాల సంఘాలు, సంస్ధలు, పార్టీలు, ఉంటాయి. వారు కూడా ప్రజలపై ప్రభావం కలిగి ఉంటారు. వీరందరి ప్రభావాన్ని పూర్వపక్షం చేసేలా విప్లవ రాజకీయాలు ఉండాలి. అలా ఉండాలంటే అందుకు తగిన ఆచరణాత్మక కార్యక్రమాలు ఉండాలి. ఆ కార్యక్రమాలు ఆర్ధిక దోపిడీతో పాటు కుల దోపిడీని కూడా వ్యతిరేకిస్తామన్న సందేశం ఇవ్వాల్సిందే. ఉపన్యాసాల్లో, సిద్ధాంతాల్లో ఇచ్చే చైతన్యం వేరు, ఆచరణలో అనుభవాత్మకంగా ఇచ్చే చైతన్యం వేరు. రెండో చైతన్యమే విప్లవ రాజకీయాలకైనా, ఏ రాజకీయాలైనా అక్కరకు వస్తుంది.

    “దళిత ప్రజలు ఎదుర్కునే కుల వివక్షను వ్యెతిరేకించకుండా వారిలొ కొంతమందిగా వున్న బుర్జువా వర్గాన్ని వేరు చేయలేము. ”

    ఇది నేను రాసిన వాక్యం. ఇందులో ఏమిటి మీకు అభ్యంతరం?

    దళితులు రెండు అణచివేతలను ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక, కుల అణచివేతలు. దళిత బూర్జువాలు కులం పేరు చెప్పి దళిత కార్మికులను తమ ఆధీనంలో ఉంచుకుంటారు. (అలాగే ఇతర కులాల బూర్జువాలు కూడా. కుల వివక్ష గురించి చెప్పుకుంటున్నాం గనక దళిత కులాల గురించి చెబుతున్నా.) వారిని దళిత కార్మికుల నుండి వేరు చేయాలి. వేరు చేయడం అంటే దళిత బూర్జువాల ప్రభావం నుండి దళిత కార్మికులను వేరు చేయడం అని అర్ధం. అలా వేరు చేయాలంటే దళిత బూర్జువాలు చెప్పే కుల వివక్షకు వ్యతిరేకంగా తామూ పోరాడతామని, తమ పోరాటమే నిజమనీ కమ్యూనిస్టులు దళితులను నమ్మించగలగాలి. అలా నమ్మించాలంటే తామూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడతామని ఆచరణాత్మకంగా చూపాలి. ఆచరణాత్మకంగా చూపాలంటే ప్రతి రోజూ “ఎక్కడరా కులం?” అంటూ కత్తి పుచ్చుకుని బయలుదేరమని కాదు. కుల వివక్ష దళితుడి జీవితంలో ప్రతి అంశలో ఉంటుందని గ్రహించగలిగితే కుల వివక్ష వ్యతిరేక పోరాటం (కొన్ని సార్లు కులం పేరు చెప్పకుండా కూడా) ఎలా చేయవచ్చో గ్రహించవచ్చు. అది గ్రహించలేకపోతే ప్రత్యేకంగా నేను చెప్పేది కూడా ఏమీ ఉండదు.

    నేను రాసిన పై వాక్యానికి మీరేవో పెడార్ధాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మీ వ్యంగ్యం దేని గురించో కూడా నాకు సరిగా అర్ధం కాలేదు. అర్ధం అయినంతవరకు పై పేరాలో వివరించాను.

    ఇంకో విషయం చెప్పాలి. మీ విశ్లేషణల్లో ధియరీ పట్ల వ్యక్తమయ్యే ఆరాధన ఆచరణపై కూడా చూపించాలన్న ధ్యాస కనిపించడం లేదు. ధియరీని ఆచరణలోకి తెచ్చేటపుడు అనేక ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను అధిగమించే ఆలోచన కూడా చేయాలి. భారత దేశం ఎదుర్కొంటున్న అత్యంత జఠిలమైన ఆచరణాత్మక సమస్య కుల సమస్య. ఇందులో వ్యంగ్యాలకూ, సిద్ధాంతారాధనకూ తావు ఉండకూడదు. చేయగలిగింది చర్చలే తప్ప ఎత్తిపొడుపులు కాదు. చర్చకు అలాంటివి సహకరించవని మీరు గుర్తించాలి.

  13. I have read Ranganayakamma’s book about dalit question in 2006. I wrote three letters to Ranganayakamma about Telakapalli Ravi and also I requested her to place her book about dalit question on Kinige. Telakapalli Ravi is a covert anticommunist in sense and we should be always careful about such suspicious people.

  14. విశెఖర్ గారూ. పైన మీ కామెంట్ కూ , కింద మీరిచ్చిన వివరణకూ, చాలా తేడా వుంది నా కామెంట్ లొ ఒక దగ్గర వ్యెగ్యంగా రాసినాను దాన్ని నేను వెనక్కు తీసుకుంటున్నాను. పునాదీ, ఉపరితల అంశాలూ, పరస్పరం ఘర్షన చెందుతాయి అంతమాత్రాన కులం పునాదిలొనూ, ఉపరితలంలొనూ, రెండింటిలొనూ ఉండటం ఎలా సాద్యం? ఇక్కడ విప్లవ పార్టీలు ఎమనుకుంటున్నారొ మాత్రమే చెప్పెరు.మీ అభిప్రయం స్పష్టంగా చెప్పలేదు.

    రొజువారీ వ్యవహారాల్లొ వాళ్ళ సమస్యపైన పొరాడుతునే వున్నారు కదా దళితులు కుల పొరాటాలు లేవు కనుక మేము మా సమస్యపైన పొరాడమని చెపుతున్నారా? సమ్మ్మెలు లాంటి వాటిల్లొ అన్ని కులాలు అన్ని మతాలూ, కలసి పొరాడు తున్నాయి కదా మనం రొజూ చుస్తున్నదే. మరి వీళ్ళు ఎలా కలుస్తున్నారు? విప్లవ పార్టీలని మీరు వేటిని ఉద్దేశించి అంటున్నారొ నాకు అర్దం కావడం లేదు. కమ్యునిస్టు పార్టీలు నిజంగా సమస్యపైన పొరాటానికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తారు. అలా కాకుండా ఓత్లకొసం పై పైన నాటకాలకొసం అయితే ఒకటి రొండు సార్లు వస్తారు మొడొసారి రారు.

    కుల రాజకీయాలు చేసేవాళ్ళు ఎక్కువకాలం మన్నలేరు. వాళ్ళ సమస్యపైన నిజాయితీతొ నిబద్దతతొ వాళ్ళతొ కలసి పొరాడుతూ సమస్యపైన సరైన అవగాహన కల్పిస్తూ వుంటె విప్లవ రాజకీయలవైపు రాకుండా వుండలేరు. అంటె ఇది ఒకటి రొండు రొజుల్లొ చెయ్యగలమని కాదు. యెళ్ళు పట్టవచ్చు. అది వ్యక్తి గతంగా కుడా చెయ్యగలిగే పనికాదు. మంద కౄష్ట్న మాదిగ లాంటి వాళ్ళు కులాలు వుండాలని గట్టిగా చెపుతున్నారు. వాళ్ళకులం వాళ్ళకు గొప్పయితే మాకులం మాకు గొప్ప అంటూ పేరు చివర మాదిగ పెట్టుకున్నారు. ఆయన అనుకున్నత మాత్రాన గొప్పయిపొతుందా? సమాజంలొ వున్న తక్కువ భావాన్ని అంత తేలికగా తీసివేయగలరా? దళితుల్లొనే దాడులు జరగడం లేదు అనేక మతాల్లొనూ జరుగుతున్నాయి ఒకే కులానికి చెందిన వ్యక్తులు కుడా దాడులు చెసుకుంటున్నారు. రూపాలు వేరు అంతే తేడా.

    మీరు చాలా చొట్ల పరస్పర విరుద్దమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.ఒక సారి రొండు కామెంట్లనూ జాగ్రత్తగా గమనించండి . నేనేమీ పెద్ద పెద్ద పొరాటాలలొ పొల్గొనలేదు. మా ఊరిలొ నీటి సమస్యగానీ, రొడ్ల సమస్య గానీ, వాటిపైన ఉమ్మడిగా వెళ్ళి మా సమస్యపైన చిన్న స్తాయిలొ పొరాటం చేసినాము సమస్యను పరిస్కరించుకున్నాము మీరు చెప్పినట్టు కుల రాజకీయాలు చెయ్యవలసి అవసరం రాలేదు. అసలు కుల ప్రస్తావనే రాలేదు. నా తియరీ, ఆచరణ రొండూ ఒకేవిధంగా వున్నాయి. ఆచరణ విషయంలొ వ్యక్తిగతంగా ఎంతవరకు చెయ్యగలమొ అంతవరకు మాత్రమే చెయ్యగలము.యవరైనా సరే. ఉమ్మడి విషయాలలొ వ్యక్తిగా యవరూ ఎమీ చెయ్యలేరు.

    “భారత దేశం ఎదుర్కుంటున్న అత్యంత జఠిలమైన ఆచరణాత్మక సమస్య కుల సమస్య ఇందులొ వ్యెగ్యాలకూ, సిద్దాంత ఆరాధనకూ, తావులేదు.”

    వ్యెగ్యానికైతే తావు లేదు గాని సిద్దాంతానికైతే తావుంది కదా? నాది ఆరాదననుకుంటున్నారా? అయితే మీ ఇష్టం నేచేయగలిగింది ఏమీ లేదు.

  15. విశేఖర్ గారూ
    పునాది, ఉపరితలం రెండింటిలో కులం అనే భావనకు సంబంధించి సైద్ధాంతిక, ఆచరణాత్మక రంగాల్లో నా దృష్టికి వచ్చిన కొన్ని ఆంగ్ల కథనాల లింకులు ఇక్కడ ఇస్తున్నాను. మన సామాజిక ఆర్థిక నేపధ్యంలో ఈ కథనాలు సిద్ధాంత, ఆచరణలకు సంబంధించి స్పష్టమైన అవగాహనను ఇస్తాయని అనుకుంటున్నాను.

    భారతీయ గ్రామీణ సమాజంపై మార్క్స్ ఎంగెల్స్ రచనలు, వాటికి ఆధునిక చేర్పులు, ప్రత్యేకించి యాంటీ-క్యాస్ట్ అనే బ్లాగ్ -anti-caste.org- లోని కథనాలు భారతీయ కులవ్యవస్థ గురించి మార్క్సిస్ట్ కోణంలో ఒక అవగాహనను అందిస్తున్నాయి. ఇవి చాలా విస్తృత ప్రాతిపదికన సాగిన ప్రామాణిక చర్చావ్యాసాలు, కథనాలు కాబట్టి తీరిగ్గా మాత్రమే చదవాలి.

    అందరి అవగాహనకు ఇవి కాస్త ఉపయోగపడతాయని భావిస్తున్నాను.

    తెలుగులో కులసమస్య పై వచ్చిన అన్ని కథనాలు, వ్యాసాలు ఇలాగే ఆన్‌లైన్ లింకుల ద్వారా ఒక చోట చేరిస్తే, లభ్యమైతే బాగుండు. నా వంతుగా కొంత ప్రయత్నించి దొరికిన మేరకు నా కొత్త బ్లాగులో చేర్చే ప్రయత్నం చేస్తున్నాను.

    కింది లింకులను చూడండి.

    1.
    “MARX ON INDIA” BY SUNITI KUMAR GHOSH
    [published in Monthly Review (January 1, 1984)]
    http://www.anti-caste.org/marx-on-india-suniti-kumar-ghosh.html

    2.
    MARX ON CASTE AND THE VILLAGE COMMUNITY
    http://www.anti-caste.org/marx-on-caste-and-the-village-community.html

    3.
    KARL MARX ON THE INDIAN VILLAGE COMMUNITY
    http://www.anti-caste.org/karl-marx-on-the-indian-village-community.html

    4.
    MARX ON INDIA: A Clarification by Aijaz Ahmad

    Chapter Five of: In Theory: Classes, Nations, Literatures.
    1992 Verso London and New York.
    http://maximumred.blogspot.in/2005/02/aijaz-ahmad-on-marx-on-india.html

    5.
    MARX AND ENGELS ON INDIA AND COLONIALISM
    http://www.anti-caste.org/marx-and-engels-on-india-and-the-colonial-question.html

    6.
    WHAT IS CASTE?
    http://www.anti-caste.org/caste-what-is-caste.html

    7.
    WHY MARXISTS MUST TAKE UP THE FIGHT AGAINST SPECIAL OPPRESSION
    http://www.anti-caste.org/special-oppression-lenin-marxists-must-fight.html

    8.
    FIGHTING CASTE IN INDIA: MARXISM VS. PETTY-BOURGEOIS DALIT POLITICS
    http://www.anti-caste.org/dalit-marxism-caste-india.html

    9.
    LETTER TO ANTI-CASTE: WHAT DOES MARXISM HAVE TO DO WITH CASTE?
    http://www.anti-caste.org/caste-marxism.html

    10.
    Anty-caste
    July 01, 2012
    http://www.anti-caste.org/caste/
    11.
    READING ON CASTE IN INDIA
    http://www.anti-caste.org/on-caste-in-india.html

    12.
    The annihilation of Caste By DR. B.R Ambedkar
    http://ccnmtl.columbia.edu/projects/mmt/ambedkar/web/index.html
    Rare online edition in separate pages

    13.
    CASTE DISCRIMINATION: A GLOBAL CONCERN
    A Report by Human Rights Watch for the United Nations World Conference Against Racism, Racial Discrimination, Xenophobia and Related Intolerance. Durban, South Africa, September 2001.
    http://www.hrw.org/legacy/reports/2001/globalcaste/

    14.
    Caste and Class
    Country Studies
    http://www.country-studies.com/india/caste-and-class.html

  16. రామ్మోహన్ గారూ,

    * * * విప్లవ పార్టీలు అంటే పార్లమెంటు పంధాను తిరస్కరించిన పార్టీలు అని. మావోయిస్టు పార్టీ, న్యూడెమొక్రసీ, జనశక్తి లాంటివి. విప్లవ కార్యాచరణకు సంబంధించి ఈ పార్టీలకే అనుభవాలున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం ల పార్లమెంటరీ పంధాను తిరస్కరించి ఇవి బైటికి వచ్చాయి. అయితే బైటికి వచ్చేటపుడు ఉమ్మడిగా ఒకే నిర్మాణ రూపంలో రావడానికి బదులు వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బైటికి వచ్చి వివిధ గ్రూపులుగా ఏర్పడ్డారు. వారి మధ్య ఆచరణ విషయంలో వచ్చిన సైద్ధాంతీక విభేధాల వల్ల కూడా గ్రూపులు ఏర్పడ్డాయి. గ్రూపుల సంగతి ఎలా ఉన్నా ఇప్పటికయితే వారి అనుభవాలే ప్రామాణికం. వీరి అనుభవాలనూ, సిద్ధాంతాలనూ, విబేధాలనూ స్ధూలంగా నేను అధ్యయనం చేశాను.

    భారత దేశంలో విప్లవ కార్యాచరణ ప్రాధమిక దశను కూడా దాటలేదు. దానికి కమ్యూనిస్టు పార్టీల వైఫల్యంతో పాటు మరొక ముఖ్య కారణంగా కులం ఉంది. కులం లాంటి సామాజిక అంశాలను కంక్లూజీవ్ గా తేల్చిపారేయడంలో తొందరపాటు పనికి రాదు.

    * * * మీకు మరోసారి చెప్పదలిచిన విషయం ఏమిటంటే కమ్యూనిస్టు సిద్ధాంతం ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది. పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు; పునాది, ఉపరితలం; మిత్ర, శత్రు వైరుధ్యాలు; సాధారణ, నిర్దిష్ట వైరుధ్యాలు; అభావం అభావం చెందడం ఇవన్నీ సిద్ధాంతం. వాటిని భారత దేశ పరిస్ధుతులకు అనుగుణంగా ఆచరణలో పెట్టడమే మిగిలి ఉంది. కులం అన్నది ప్రధానంగా ఆచరణ సమస్య. భారత దేశంలో విప్లవ ఆచరణేమో చాలా తక్కువ. కనుక ‘నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం ఏంటీ?’ అని తేల్చేసుకునే బదులు చర్చించడంలో ఎక్కువ ఉపయోగం ఉంటుంది. దానర్ధం అభిప్రాయాలూ చెప్పుకోగూడదని కాదు. చెబుతున్నవన్నీ అభిప్రాయాలే.

    * * * కులం పునాదిలోనూ, ఉపరితలంలోనూ ఎలా ఉంటుంది? విప్లవకార్యాచరణకీ, దళిత కార్యాచరణకీ మధ్య తలెత్తిన మౌలిక ప్రశ్న ఇది. దళిత కార్యకర్తలకూ, సంస్ధలకూ, విప్లవ పార్టీలు ఇంకా కన్వీన్సింగ్ గా (లేదా తిరుగులేని ఆచరణతో) చెప్పడానికి మిగిలి ఉన్న ప్రశ్న. విప్లవ పార్టీల ఆచరణ డెసిసివ్ గా ఉంటూ అభివృద్ధి చెందుతున్నట్లయితే (లేదా పార్లమెంటరీ పార్టీలను వదిలి విప్లవపార్టీలనే కార్మికవర్గం విశ్వసిస్తున్నట్లయితే) కులం సమస్య పై ఇంతగా గింజుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.

    భారత దేశంలో వర్గ పోరాటం అంటే ప్రధానంగా భూపోరాటం. కానీ భూముల ఆక్రమణకు కదలని దళిత కూలీలు ఎం.ఆర్.పి.ఎస్ ఇచ్చిన కుల (వ్యతిరేక) పిలుపుకు కుప్పలు తెప్పలుగా కదిలారు. మా ఊరిలో నేను స్వయంగా చూశాను. కులం బలం పట్ల పెద్దగా అవగాహన లేకుండా వర్గ పోరాటాలకు కుల పోరాటాలు లోబడి ఉండాలని సైద్ధాంతికంగా నమ్ముతూ వచ్చిన నేను, ‘ఒక కులం వాళ్ళు మన ఉద్యోగాలు లాక్కుంటున్నారు. తిరగబడదాం’ అని ఇచ్చిన పిలుపుకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేని కూలీ జనం పెద్ద ఎత్తున కదలడం చూసి మ్రాన్పడిపోవలసి వచ్చింది. (దీనర్ధం వర్గపోరాటాలకు, కుల పోరాటాలు లోబడి ఉండాలన్న అవగాహననుండి నేను బైటికి వచ్చినట్లు కాదు.) ఈ పరిస్ధితి రాష్ట్ర వ్యాపితంగా సంభవించింది.

    అందువల్ల భారత దేశంలో వర్గం అన్నది ప్రత్యక్ష రూపంలో లేదు. అనేక పొరలు దానిని కమ్మేసాయి. అందులోనూ కులం పొర దళసరిగా కమ్ముకుని ఉంది. కనుక కులం వర్గానికి లోబటి ఉండాలి అని సిద్ధాంతం చెప్పి ఊరుకుంటే సరిపోదు. అది ఆచరణలో తేల్చాలి.

    * * * సమ్మెలు సాధారణ పోరాట రూపాలు. ప్రాధమిక కార్యాచరణ తర్వాత కనిపించే పోరాటాలవి. వాటిలో కనిపిస్తున్న కుల ఐక్యత కూడా రూపంలో కనిపిస్తున్న ఐక్యతే తప్ప సారాంశంలోని ఐక్యత కాదు. అదే కాక సమ్మెలు, ధర్నాలు, ఊరేగింపులు ఇవి పెద్దగా నిర్మాణ బలం లేకుండానే జరిగిపోతుంటాయి. విప్లవ కార్యాచరణకు వీటితో పెద్దగా ఉపయోగం ఉండదు. రూపంలోని ఐక్యతను మాత్రమే ప్రతిబించించే ఈ పోరాట రూపాలను ప్రామాణికంగా తీసుకుని వర్గ పోరాటాలలో కుల ఐక్యత సాధిస్తున్నాం గదా అని సింపుల్ గా తేల్చలేము.

    “మా ఊరిలొ నీటి సమస్యగానీ, రొడ్ల సమస్య గానీ, వాటిపైన ఉమ్మడిగా వెళ్ళి మా సమస్యపైన చిన్న స్తాయిలొ పొరాటం చేసినాము సమస్యను పరిస్కరించుకున్నాము మీరు చెప్పినట్టు కుల రాజకీయాలు చెయ్యవలసి అవసరం రాలేదు.”

    నీరు, రోడ్డు లాంటి సమస్యల్లో కుల రాజకీయం చేయాలనా నేనన్నది? కార్యాచరణలో కుల సమస్య పట్ల అవగాహన ఉండడమూ, కుల రాజకీయాలు చెయ్యడమూ ఒకటి కాదు. కుల వివక్ష వ్యతిరేక కార్యాచరణను వర్గ కార్యాచరణకు లోబడాలనడం సిద్ధాంతం. కాగా ఆచరణలో అది వాయిదా వెయ్యడం గా కనిపిస్తోంది. దళిత కార్యకర్తల అభ్యంతరానికి అది చాలు. వాళ్ళేమనుకుంటే మనకేంటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే భారత దేశ కార్మిక వర్గం, అందులోనూ కోర్ అనదగ్గ ఆస్తిపాస్తులు లేని వర్గం, ప్రధానంగా దళితుల్లో ఉంది.

    వ్యక్తులుగా, సమూహాలుగా వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోవడాన్ని విప్లవ కార్యాచరణగా చూడమంటున్నారా? ఎంత చిన్న సమస్యపైనైనా సరే రాజకీయ పార్టీగా కృషి చేయడం వేరు, స్వతంత్ర వ్యక్తులుగానో సమూహాలుగానో కృషి చేయడం వేరు. రాజకీయ పార్టీ కింద సమీకృతం కావలసిన పరిస్ధితి ఎదురైనపుడు ప్రజలకు అనేక రిజర్వేషన్లు ఉంటాయి. వాటినన్నింటినీ అధిగమించేలా పిలుపివ్వడం, అమలు చేయడం రాజకీయ సంస్ధలకు అంత తేలిక కాదు. ప్రజలకు అప్పటికే కొన్ని రాజకీయ అభిప్రాయాలూ ఉండడమే అందుకు కారణం. ఆ రాజకీయ అభిప్రాయాలను వదులుకుని విప్లవ రాజకీయాలను ప్రజలు అవలింబించేలా కార్యాచరణ చేయగలగడమే విప్లవ కార్యాచరణ.

    * * * ఫలానాది తేడాగా ఉందనీ, పరస్పర విరుద్ధ అభిప్రాయాలూ చెబుతున్నానని మీరంటున్నది నిజం కాదు. వైరుధ్య సూత్రాల్లో ‘సాధారణ, నిర్ధిష్ట వైరుధ్య సూత్రం’ (generality of contradiction and particularity of contradiction) ఉంటుంది. ఈ వైరుధ్య నియమాన్ని మావో గొప్పగా, విస్తృతంగా వివరించాడు. నిర్ధిష్ట వైరుధ్యంలో సాధారణ వైరుధ్య లక్షణాలు ఉన్నట్లే దానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేక మైన లక్షణాలు కూడా ఉంటాయి. వాటిని అధ్యయనం చేయకపోతే ఆ వైరుధ్యాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు.

    వర్గ వైరుధ్యం సాధారణ వైరుధ్యం. కుల వైరుధ్యం నిర్దిష్ట వైరుధ్యం. కుల వైరుధ్యంలో వర్గ వైరుధ్య లక్షణాలున్నట్లే కులానికే ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాంటి ప్రత్యేక లక్షణాలను చర్చిస్తున్నపుడు సాధారణ వైరుధ్యమైన వర్గ వైరుధ్యాన్ని దాటి వచ్చినట్లు భ్రమ కలుగుతుంది. కానీ అది భ్రమ మాత్రమే. కుల వైరుధ్యాన్ని పరిష్కరించే ప్రయాణంళో వర్గ వైరుధ్య పరిష్కార క్రమాన్ని చేరుకోవాలంటే కులం యొక్క నిర్దిష్టతను పూర్తి స్ధాయిలో అధ్యయనం చెయ్యక తప్పదు. అలాంటి కులం యొక్క నిర్ధిస్టతలను చర్చిస్తున్న క్రమంలోనే మీకు తేడా, విరుద్ధత ఉన్నట్లు కనిపిస్తోంది. కుల సమస్య యొక్క నిర్దిష్టతను చూసే విషయంలో మీకూ నాకూ మధ్య పరిమాణాత్మక తేడా ఉంది. ఇది paradox error మాత్రమే. దీనివల్ల నేను చెబుతున్న దానిలో వైరుధ్యాలున్నట్లు కనిపిస్తోంది. కులంపైన నేను చేస్తున్న విశ్లేషణ అంతా వర్గ విశ్లేషణలో భాగంగా భావిస్తూ చేస్తున్నది. అయితే అది చర్చనీయం.

  17. రాజుగారూ, మీరు ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారం కాదు. అధ్బుతమైనది. ఇలాంటి అంశాల కోసం నేను గతంలో వెతికాను. పెద్దగా దొరకలేదు. ఇంటర్నెట్ వల్ల సమాచారం అందుబాటులోకి రావడం ఎంత నిజమో కదా. మీ కృషికి అభినందనలు.

  18. విశెఖర్ గారూ. కులం అనేది పునాదా, లేక ఉపరితలమా అనే విషయం అంత తల బద్దలు కొట్టుకొవలసిన అవసరంలేదు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ఉపరితల అంశమేనని

    కార్మిక వర్గ రాజకీయ చైతన్యం సాదారణంగా తక్కువ స్తాయిలొ వుంటుంది. కార్మిక వర్గం జీతాల పెంపుకొసం సమ్మెలు లాంటివి చేస్తాయి. అదే కార్మిక వర్గం జీతాల వ్యవస్త రద్దుకొసం పిలుపునిస్తె అంతగా స్పందన కనిపించదు. అది వాళ్ళ మానసిక స్తాయికి అందకపొవడమే కారణం సిద్దాంతపరంగా శ్రమ, విలువ, లాంటివి తెలియకపొవడం వల్ల. అందువల్లనే రష్యా, చైనాలు తిరొగమనం పట్టెయి. నాయకులనే వాళ్ళు వాళ్ళను క్రమంగా చైతన్యవంతులను చేయడం మీదే ఆదారపడి వుంటుంది. మీ ఊరిలొ అలా వెళ్ళెరంటె అది చాలా సహజం.

    కులం వర్గ పొరాటానికి లొబడి వుండాలని ఆచరణ ద్వారా కుడా చుపించవచ్చు. ఉపరితలం అంశాలైన మతం, కులం , లాంటివాటిపైన ఎంతపొరాడినా ఉపయొగం లేదని వాళ్ళకు ఓపిగ్గా వివరించి చెప్పగలగాలి. అంతేగాని వాళ్ళు దాని పైన మొగ్గు చుపుతున్నారు కాబట్టి మనం కుడా అటే వెల్లడం సరైన పద్దతి కాదు.

    ” సమ్మెలు సాదారణ పొరాట రూపాలు. ప్రాదమిక కార్యాచరణ తర్వాత కనిపించే పొరాట రూపాలివి వాటిలొకనిపిస్తున్న ఐక్యత రూపంలొ కనిపిస్తున్న ఐక్యతే తప్ప సారాశం లొ ఐక్యత కాదు”.

    అయితే మీరు చెప్పేదాని ప్రాకారం ముందు సారాశంలొ ఐక్యత సాదించిన తర్వాతే వర్గ పొరాటాలకు దిగాలంటారా? మరి సారాశంలొ ఐక్యత ఎలా సాద్యం అవుతుంది? ఒక పక్క గొచిపాత రాయుళ్ళు మరొపక్క భుములనూ, ఘనులనూ, సకల సంపదనూ, తమచేతిలొపెట్టుకుని వుండే పెట్టుబడిదారీ వర్గం వుండగా సారాంశంలొ ఐక్యత ఎలా సాద్యం అవుతుంది? తెలగాణా పొరాటంలొ సారాంశంలొ ఐక్యత లేకుండానే అక్కడ పొరాటం జరగలేదా? స్వాతంత్ర పొరాటం ఐక్యత ముందుజరిగిందా తర్వాత జరిగిందా అసలంటూ ఐక్యత జరిగిందా? సమాజంలొ అసమానతలు వుండగా ఐక్యత జరగడమనేది అసాద్యం.

    కులం, మతం లాంటి వాటికి స్వంత అస్తిత్వం అంటూ లేదు. వాటి మీద ఎంత పొరాడినా ఆ వర్గానికి వచ్చిన నష్టం అంటూ ఏమీలేదు. అది ఆ వర్గానికి అర్దమయ్యెటట్టు చెప్పాలి అంతేగాని వాళ్ళు కులపొరాటానికే ఆసక్తి చుపుతున్నారు కాబట్టి మనం కుడా వంత పాడాలా?

    వ్యక్తులుగా సమూహాలుగా పరిస్కరించుకొవడం విప్లవమని నేననుకొవడం లేదు. నిజమైన కార్మిక వర్గ కమ్యునిస్టు పార్టీ ప్రజలను ఒక టాటిపై తేవడం కష్టమే అసాద్యమైతే కాదు. కావలసింది నిబద్దత అలాంటి నిబద్దతగల పార్టీ ప్రస్తుతానికైతే లేదు కదా.

  19. రామ్మోహన్ గారు

    “కులం వర్గ పొరాటానికి లొబడి వుండాలని ఆచరణ ద్వారా కుడా చుపించవచ్చు.”

    ఆచరణాత్మకంగా చూపించడమే కదా కావలసింది. చెప్పడం చాలామంది చేశారు. చేసి చూపడమే మిగిలి ఉంది. (ఇది మీకు సవాలు కాదు. పరిస్ధితి చెబుతున్నాను.) అంతే కాకుండా పైన మరో వ్యాఖ్యలో ‘ఆచరణ విషయమ్లో వ్యక్తిగతంగా ఎవరికి ఎంత సాధ్యమో అంతే చేయగలరు’ అనంటున్నారు. అలా అయితే విప్లవాలు తర్వాత సంగతి కనీస ఉద్యమాలు కూడా సాధ్యం కాదు.

    కులం అనే నిర్ధిష్టం అంశానికి నేను ఇస్తున్న వివరణని సాధారణీకరించి వర్గానికి అప్లై చేస్తున్నారు. ఆ విధంగా పెడార్ధాలు తీస్తున్నారు. రూపం, సారం విషయాలపై నేను చెప్పిన అంశాలను వేగ్ గా అనువదిస్తున్నారు. గమనించగలరు.

    “అలాంటి నిబద్దతగల పార్టీ ప్రస్తుతానికైతే లేదు కదా.”

    నేను చెప్పిన పార్టీలు నిబద్ధత కలిగినవే. ఆచరణలో వైఫల్యాలు ఉన్నంతమాత్రాన నిబద్ధత లేదని చెప్పలేము.

    ఇతర అంశాలు పైన చర్చించినవే.

  20. కులం వర్గపొరాటానికి లొబడి వుండాలని ఆచరణ ద్వారకుడా చుపించవచ్చు. దాని చరిత్రే సాక్ష్యం. చైనాలొ సాంసౄతికి విప్లవం జరిగినప్పుడు పునాది మారలేదనే విషయం గ్రహించి పునాది వైపు అడుగులు వేయడం జరిగింది అంత దూరం పొవలసిన అవసరం లేదు ఉదాహరణకు మీ ప్రకారమే కుల పొరాటమే ప్రదానం చెసుకుందాం మరి కులాలు దేనిపైన ఆదారపడి వున్నాయి? అవి ఎలాపొతాయి? మీరే చెప్పండి మీ ప్రకామే చెసుకుంటారు.

    నేనేమన్నాను వ్యక్తిగతంగా సాద్యమయ్యెటివి వ్యక్తిగతంగా చేసుకుంటారు.ఉమ్మడిగా చేయగలిగేటివి వ్యక్తిగతంగా చేయలేరన్నాను.

    సారాంశంగా ఐక్యంగా లేరు అని అంటున్నారు అది నిర్దిస్టమా? మరి వర్గాని అప్లై చేయకుండా ఇంకెలా చేయాలి? నేను మిమ్మలను ప్రశ్నించటం పెడార్దాలు తీయడమా? అలా అయితే చెప్పండి ప్రశ్నించను. నేనేం పెడార్తాలు తీశానొ చెప్పండి . రూపం సారం విషయాలను వేగ్ గా అనువదిస్తున్నానా?

    నేనడిగిన దానికి ఒక్క దానికీ సమాదాం ఇవ్వలేదు అన్నీ దాట వేతలు తప్ప.

  21. రామ్మోహన్ గారూ, చూడబోతే కుల సమస్యనే ఇక్కడే పరిష్కరించేట్లున్నారు.

    “ఉదాహరణకు మీ ప్రకారమే కుల పొరాటమే ప్రదానం చెసుకుందాం ”

    కుల పోరాటాన్ని ప్రధానం చేయాలని ఎక్కడన్నాను?

    “సార్వజనీన వైరుధ్యం, నిర్దిష్ట వైరుధ్యం’ నియమం గురించి మీ అవగాహన వివరించండి. దాన్ని బట్టి నిర్దిష్టత పై చర్చిద్దాం.

  22. విశేఖర్ గారూ, రామ్మోహన్ గారూ..
    చర్చ ఆసక్తికరంగా, ఎడ్యుకేటివ్ గా ఉంది.

    విశేఖర్ గారూ…
    మీరు ఉటకించిన ఉదాహరణ గురించి ఓ సందేహం…

    >> కులం బలం పట్ల పెద్దగా అవగాహన లేకుండా వర్గ పోరాటాలకు కుల పోరాటాలు లోబడి ఉండాలని సైద్ధాంతికంగా నమ్ముతూ వచ్చిన నేను, ‘ఒక కులం వాళ్ళు మన ఉద్యోగాలు లాక్కుంటున్నారు. తిరగబడదాం’ అని ఇచ్చిన పిలుపుకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేని కూలీ జనం పెద్ద ఎత్తున కదలడం చూసి మ్రాన్పడిపోవలసి వచ్చింది. (దీనర్ధం వర్గపోరాటాలకు, కుల పోరాటాలు లోబడి ఉండాలన్న అవగాహననుండి నేను బైటికి వచ్చినట్లు కాదు.) ఈ పరిస్ధితి రాష్ట్ర వ్యాపితంగా సంభవించింది. >>

    ఎమ్మార్పీపీఎస్, మాల మహానాడుల గురించే కదా మీరు చెపుతోంది? ఉద్యోగాలు రావటం/ రాకపోవటం అనేది ‘ఆర్థికపరమైన’ అంశం. వేరే కులం వాళ్ళ వల్ల తమ పిల్లల భవిష్యత్తుకు గండి పడుతుందనే ఆందోళన వారిని కదిలించటం సహజమే కదా… ఆ స్పందన రావటంలో అంతగా ఆశ్చర్యపడాల్సింది ఏముంది? ఆర్థిక అంశం లేకుండా కేవలం కులపరమైన అంశంలో ఆ స్థాయి స్పందన వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

  23. వేణు గారూ, ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు.

    ఉద్యోగాలు రావడం/రాకపోవడం అనే ఆర్ధిక అంశంపై కదలడానికి ఇక్కడ కులమే డ్రైవింగ్ ఫోర్స్ గా పని చేసింది కదా. ఫలానా కులం వాళ్ళు ఉద్యోగాలు లాక్కుంటున్నారా అని ప్రశ్నించుకుంటూ పెద్ద ఎత్తున కదిలారు. వారి కదలికలో ఫలానా కులం వాళ్ళు అంత మొనగాళ్లా అన్న ఆవేశమే తప్ప పిల్లల భవిష్యత్తు గురించిన అవగాహన అక్కడ లేదు. వారికి నాయకత్వం వహించిన నిరుద్యోగ యువకులకు ఆ చైతన్యం ఉందే తప్ప వారి వెనుక కదిలిన జనానికి ఆ ధ్యాసే లేదు.

    ఆ ఊరిలో మాదిగలకి చెరువు కింద భూములు ఉన్నాయి. వంద సంవత్సరాలకు పైబడి సాగు చేసుకుంటున్నారు. అన్ని శిస్తులూ చెల్లిస్తున్నారు. కాని వారికి పట్టాలు రాకుండా కమ్మ, రెడ్లు అడ్డుకుంటున్నారు. పట్టాలు వస్తే నీటిపారుదల సౌకర్యం వస్తుంది. సాగర్ కాలవ నీళ్లు వాటికి అందుతాయి. అది జరిగితే మాదిగలు మాట వినరని పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిపైన కదిలించడానికి స్ధానికంగా యువకులు, టీచర్లు అనేకసార్లు ప్రయత్నీంచినా వారు కదల్లేదు. ఉద్యోగాలు చదువుకున్నవారికే. కాని భూములు దాదాపు ప్రతికుటుంబం ఆర్ధిక పరిస్ధితిని మార్చివేస్తుంది. అయినా వారు సిద్ధపడలేదు.

    ఉద్యోగం సుదూరం. భూమి తక్షణం కళ్లెదుట కనిపిస్తున్నది. అయినా ఎందుకు కదిలించలేకపోయింది.

    ఇంకో ఉదాహరణ చెబుతాను. ఓ సారి ఒక అగ్ర కులం వాళ్లు పల్లెపైన దాడి చేస్తున్నారని మరో అగ్రకులం ద్వారా కబురు వచ్చింది. యువ టీచర్ల ఆధ్వర్యంలో అంతా కర్రలు కత్తులతో సిద్ధమైనారు. గతంలో లాగా మాదిగలం పడి ఉండాలా అని చాలామంది ఆవేశంతో స్పందించారు. ఇక్కడ కులదాడి అన్న కబురు వారిలో ఆవేశం నింపింది తప్ప ఏ ఆర్ధిక ప్రయోజనమూ లేదు. అగ్రకులాలతో సంబంధం లేకుండానే మా బతుకు మేము బతగ్గలం అన్న నమ్మకం వారిలో ఏర్పడి ఉంది. ఒక పని కాకపోతే మరొక పని దొరికే అవకాశం అభివృద్ధి చెందడంతో వారు అగ్రకుల దాడిని ఎదిరించడానికి సిద్ధపడినట్లు వారి మాటల్లో వ్యక్తం అయింది.

    కారంచేడు, నీరు కొండ లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాపితంగా దళితుల్లో వచ్చిన స్పందన అలాంటిదే కదా. అందులో కుల వ్యతిరేకత తప్ప ఆర్ధిక ప్రయోజనాలేవీ లేవు కదా.

    ఈ ఉదాహరణల అర్ధం కుల పోరాటాలు చేయాలని కాదు. కుల వ్యతిరేక చైతన్యం వర్గ పోరాటాలలో భాగంగా ఇవ్వాలన్న సిద్ధాంతానికి ఆచరణలో ఎదురయ్యే సమస్యలు చెప్పడానికి ఈ ఉదాహరణలు.

  24. బహుశా, “మీరు చదువుకుంటే బాగుపడతారు, మీరు ఇలా ఉండడానికి కారణం చదువు, ఉద్యోగాలు లేకపోవడం” అనే స్టీరియోటైప్‌లు చేసే వాదనని నమ్మడం వల్ల కావచ్చు. లేదా తమ పిల్లలని చదివించడానికి అయ్యే ఖర్చు గురించి తెలియకపోవడం కూడా కావచ్చు. నేను ఒక విషయం గమనించాను. రిజర్వేషన్‌ల విషయంలో మాల, మాదిగలకి ఉన్నంత పట్టింపులు రెల్లి, బుడగజంగం కులస్తులకి లేవు. ఈ రెండు కులాలూ మాదిగల కంటే వెనుకబడిన కులాలే. బుడగజంగం కులస్తులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉన్నారు. రెల్లి కులస్తులు కోస్తా ఆంధ్రలోని అన్ని పట్టణాలలోనూ (ఉత్తరాంధ్రలో గ్రామీణ ప్రాంతాలలో కూడా) ఉన్నారు. వర్గీకరణ విషయంలో మాదిగ నాయకులు రెల్లి నాయకులతో కొన్ని సార్లు చర్చించారు. కానీ ఈ రెండు కులాలూ ఐక్య పోరాటం మాత్రం చెయ్యలేదు. బుడగజంగాలు రిజర్వేషన్‌ల పోరాటాలు చేసిన సందర్భాలు ఎక్కడా చూడలేదు.

    నేను ఒక ఉదాహరణ చెపుతాను. నేను ఇంటర్నెట్ కేఫ్ నడిపే రోజులలో స్కాలర్‌షిప్‌ల కోసం అప్లికేషన్‌లు పెట్టడానికి నా దగ్గరకి వచ్చినవాళ్ళలో ఎక్కువ మంది మాల కులస్తులే. మాలలలో ఎక్కువ మంది చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి స్కాలర్‌షిప్‌ల గురించి తెలుసు. ఆ తరువాత రెల్లి కులస్తులు వచ్చారు. మా పట్టణంలో రెల్లి కులస్తులు ఉండే వీధులు ఆరు లేదా ఏడు ఉన్నాయి. మాదిగ కులస్తులు ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. బుడగజంగం కులం నుంచి ఒక్కరు కూడా రాలేదు. బుడగ వాయించుకుంటూ అడుక్కునే & మేకలూ, గొఱ్ఱెలూ పెంచుకునే వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో వాళ్ళకి రిజర్వేషన్‌లు & స్కాలర్‌షిప్‌ల గురించి తెలిసే అవకాశం లేదు. అందుకేనేమో బుడగజంగాలు నా దగ్గరకి రాకపోయి ఉండొచ్చు.

  25. ప్రవీణ్ గారూ,
    పై లింకులో మీరిచ్చిన కథనం చదివాను. లక్షింపేట ఘటనపై కింది లింకును కూడా చూడగలరు
    సారాంశం, సామాజిక సంక్షోభమే!
    – కె. శ్రీనివాస్
    http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/1/edit/1edit1&more=2012/jul/1/edit/editpagemain1&date=7/1/2012

    మీ కార్మిక వర్గ రాజకీయాలు సైట్‌లో వ్యాఖ్య పెట్టడం అంత భయంకరానుభూతిని నేనింతవరకు ఎక్కడా చూడలేదు. ఇకపై ప్రయత్నించను కూడా. కానీ మీ కథనం మాత్రం స్థానికంగా ఉన్న పరిస్థితులను బాగా చిత్రించింది.

    దళిత సమస్య పరిష్కారానికి పుస్తకం బయట షాపుల్లో కూడా దొరుకుతోంది కదా..

  26. విశేఖర్ గారూ,
    మాయావతిని దళిత బూర్జువా వర్గ ప్రతినిధిగా గుర్తించడమే సరైన వర్గ పరిశీలన అని నా భావన. మాయావతిపై మీరు ఎందుకో కాస్త సాఫ్ట్ కార్నర్‌ చూపిస్తున్నారనిపిస్తోంది. కాని దీన్ని నేను నెగటివ్‌గా తీసుకోవడం లేదు. అదే సమయంలో మాయావతి దోపిడీ పాలకవర్గంలో దళిత ప్రతినిధి అనే విషయం మర్చిపోరాదు.

    ఆమె వెయ్యి చెప్పుల కొనుగోలు వ్యవహారాలు, బతికుండగానే సొంత విగ్రహాల స్థాపనలు -పరమ illogical చేష్ట్య ఇది- వంటి వ్యవహారాలు పక్కన బెట్టి బహుజన వర్గాలకు రాజ్యాంగ పరిధిలో పరిమితుల్లో అయినా సరే ఆమె పాలనలో ఏమైనా మేలు జరిగి ఉంటే, మొత్తం సమాజంపై అవి ప్రభావం చూపి ఉంటే వాటి గురించి చర్చిస్తే బాగుంటుంది.

    దళిత కులంలో పుట్టినంత మాత్రానే ఆమె ప్రస్తుత సంపన్న స్థాయిని, పాలక వర్గంలో ఆమె స్థానాన్ని మర్చిపోవడం ఎలా? దళితులు సంపన్నులు, భూస్వాములు, పాలకవర్గ ప్రతినిధులుగా మారకూడదని ఎవరన్నా అన్నా సమాజ గమనం అందుకు ఒప్పుకోదనుకోండి. ఇతర వర్గాలకు మల్లే దళితుల్లో కూడా కొందరు పాలకవర్గ నిచ్చెన మెట్లను ఎక్కితే ఎక్కనివ్వండి. కాని దళితులపై ఈ దళిత బూర్జువా ప్రతినిధుల ప్రభావాన్ని కుల సమస్య అధ్యయనాన్ని ఒకటిగా చేయకూడదనుకుంటాను

    క్లుప్తంగా నా అభిప్రాయం ఏమిటంటే పాలక వర్గ ప్రతినిధిగా మాయావతి ఈ దేశంలో నిజమైన దళిత ప్రజలకు ఒరగబెట్టేదేమీ లేదనే. ఇప్పుడామె దళితమూలానికి చెందిన వ్యక్తి కాదు. ఆర్థికంగా, కులపరంగా కూడా ఆమె దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో దళితుల, బహుజనుల ఓట్లను ఆమె పెద్ద స్థాయిలో పొంది ఉండవచ్చు. కాని ఆమె దళిత బూర్జువా అని గుర్తించడంలో ప్రకటించడంలో మనం ఊగిసలాడరాదనుకుంటాను.

    దళిత బూర్జువా ప్రతినిధులపై భ్రమలను, రిజర్వేషన్లపై శాశ్వత భ్రమలను దళిత కులాలు వదులుకోకపోతే, కుల భ్రమల నుంచి బయటపడకపోతే గడచిన కాలమే కాకుండా మరికొన్ని వేల సంవత్సరాల పాటు కూడా వాళ్లు కులవ్యవస్థ కోరల్లో పడి కృశిస్తూనే ఉంటారని రంగనాయకమ్మ గారు తన MARX ON CASTE వ్యాసంలో స్పష్టం చేశారు.

    “Following Marx’s repeated observations, if we examine classes in India, all the lower castes are part of working class. Further, these are sections that are subjected to exploitation of labour to a large extent. They have to liberate themselves from exploitation. They have to change the division of labour that exploitative societies created. For that, they have to go along the path of class struggle only. If they do not recognize that path and go in that direction, there will not be a way out for them from this problem. The same situation will continue in future also just as they have been languishing in the caste system for the past hundreds and thousands of years. It is not possible to escape from it in any other way.”

    “Imagine that there formed a government in India where in the representatives of Scheduled Castes, Scheduled Tribes and Backward Castes constitute the majority! What can that government do in respect of elimination of caste? What will be their programmes in that respect? How will it abolish exploitative property relations? With what programmes will it change the economic conditions of lower castes that are living by performing all kinds of unclean labour?”

    “We are seeing governments of lower castes also. Their entire aim is to create Dalit BahujanBourgeoisie. Do you know what it means? Nothing but the exploitation of the ordinary masses of lower castes by the bourgeoisie of the lower castes! Governments of lower castes will achieve this wonderfully.”

    మావోఆలోచనా విధానంపై మీ రెండోవ్యాసం ద్వారా, వేణు గారి ద్వారా దాదాపు 25 ఏళ్ల తర్వాత రంగనాయకమ్మ గారితో, బాపు గారితో తిరిగి ఈ మధ్యే పరిచయం ఏర్పడింది. అందుకు మీకు కృతజ్ఞతలు. ఆలస్యంగా చెబుతున్నందుకు ఏమనుకోవద్దు. శ్రమ సంబంధాల పరిశీలన నుంచే చదవాలని వారు ఇప్పటికీ పదే పదే చెబుతున్నారు. దళిత సమస్య కూడా మౌలికంగా శ్రమసంబంధాలకు సంబంధించినదే. పెట్టుబడి పరిచయాన్ని ఒకటికి పదిసార్లు చదవాలని వారు కోరుతున్నారు.

    కులసమస్యపై రంగనాయకమ్మ గారు రాసిన రెండు సైద్ధాంతిక కథనాల లింకులు ఇక్కడ ఇస్తున్నాను. తప్పనిసరిగా మీరు వీలు చూసుకుని ఈ రెండు కథనాలను చదవండి. కులసమస్యపై రంగనాయకమ్మ గారి భావనలు శిలాసదృశం కావని, వాటితో విభేదించి చర్చించవచ్చని మీకు చెప్పనవసరం లేదు కదా.. ఇవి తెలుగులో కూడా ఆన్‌లైన్‌లో లభిస్తే చాలా బాగుండేది. అడిగి చూస్తాను.

    MARX ON CASTE
    http://www.ranganayakamma.org/Marx%20on%20Caste.htm

    Gender and Caste
    http://www.ranganayakamma.org/Gender_caste.htm

    రామ్మోహన్ గారు మీ ఈ కథనం విషయంలో విస్తృత చర్చ చేశారు. కొండొకచోట వ్యంగ్య ప్రకటనలున్నా మొత్తం మీద ఒకరకంగా మీతో తలపడ్డారనే చెప్పాలి. చర్చకు అది మంచే చేసింది. తనకు అభినందనలు.

  27. రాజశేఖర్ గారూ, మాయావతి బూర్జువా ప్రతినిధి అనడంలో సందేహం లేదు. ఆమె దళితురాలు గనక దళిత బూర్జువా అంటున్నాము.

    మాయావతి పై నేను చేసిన విశ్లేషణ ఆమెకు సానుభూతిగా కాదు. ఆమెకు మద్దతుగా వచ్చే దళిత కార్మిక నాయకులతో నాకు తీవ్రవాదోపవాదాలు, భావోద్వేగాలతో, జరుగుతుంటాయి.

    కుల సమస్యకు పరిష్కారం కుల పోరాటాలు కాదు. ఆ అవగాహన నాకు లేదు. వర్గ పోరాటాలే కుల సమస్యకు అంతిమ పరిష్కారం.

    కానీ కుల సమస్య వర్గ సమస్య కాదు గనక (లేదా ఉపరితలంలోని సామాజిక సమస్య కనుక) వర్గ పోరాటంలో కుల వ్యతిరేక పోరాటలకు తక్షణ స్ధానం లేదని కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలతో సహా, భావిస్తూ వచ్చాయి. కాని దళితుల్లో చైతన్యం వచ్చాక వారికి ప్రతి అంశంలోనూ కనిపిస్తున్నది కులమే గనుక, ఆ పేరుతో (వివక్ష వ్యతిరెక చట్టాల రూపంలో) కొన్ని లాభాలు కూడా వస్తున్నాయి కనుక, కుల అస్తిత్వం ప్రధానంగా వారికి కనిపిస్తోంది.

    ఈ పరిస్ధితి వర్గ అవగాహనకు భిన్నంగా ఉందన్నది నా అవగాహన కాదు. ఆ పరిస్ధితి వర్గ పోరాటాలకు దళితులను సమీకరించడానికి ఆటంకంగా ఉందన్నదే నా అవగాహన. స్త్రీ పురుష వైరుధ్యం, శారీరక మేధో శ్రమల వైరుధ్యం, పట్టణ గ్రామీణ వైరుద్య్యం ఇలాంటి వైరుధ్యాలను వర్గ పోరాటం అనంతరం పరిష్కరించుకోగల వైరుధ్యాలుగా పక్కన బెట్టడం చాలా తేలిక. పక్కన పెట్టినా అడిగేవారు ఉండరు.కానీ కుల సమస్య ఆ విధంగా పక్కనబెట్టేటంత తేలికగా లేదు. పక్కన బెట్టి దళితులను సమీకరించే పరిస్ధితి లేదు. భారత దేశ కార్మిక వర్గంలోని ‘కోర్’ గా భావించగల దళిత కార్మికులు, కూలీలు ఉన్నది ప్రధానంగా దళితుల్లోనే. అందువల్ల దళితుల సమీకరణ తప్పనిసరి. కాని వారు దళిత మేధావుల, కార్యకర్తల, నాయకుల చెప్పుచేతల్లో ఉన్నారు.

    ఈ పరిస్ధితికి తోడు కులం సమాజంలో ఇంకా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అన్ని అధికారిక కార్యకలాపాల్లో, పరిశ్రమల్లో, ఆఫీసుల్లో, కోర్టులతో సహా, కులం పాత్ర ఉంది. దానితో కులాన్ని విస్మరించలేని స్ధితిలో దళితులూ ఉన్నారు, విప్లవకారులూ ఉన్నారు.

    ఈ చర్చ లేవనెత్తడంలో నా ఉద్దేశ్యం, కుల సమాజంలో వర్గ పోరాటానికి ఎదురవుతున్న ఆటంకాలను చర్చకు తేవడమే. అది సమస్య కానట్లయితే భారత విప్లవోద్యమానికి ప్రజల వైపునుండి పెద్దగా సమస్యలేవీ లేనట్లే. (ఆర్గనైజింగే మిగిలిందని అర్ధం) ఆ సమస్య లేకపోతే మరెందుకు విప్లవ పార్టీలు బలం పుంజుకోవు? అది ఒక సమస్య. అలాంటి సమస్యను చర్చకు తేవడానికి మాయావతి కేసు ఒక సందర్భం. అది ఆమెపై సానుభూతిగా కాదు. సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలపై చర్చలను అంతవరకే పరిమితం చేస్తే ఉపయోగం.

    (అపోహ కలిగే అవకాశం ఉన్నందున ఈ వ్యాఖ్యకు సవరణ చేశాను. -విశేఖర్)

  28. నేను ఈ పోస్ట్ http://4proletarianrevolution.mlmedia.net.in/144660218 లో వ్రాసిన విషయం ఇది:
    >>>>>
    పాలక వర్గంవాళ్ళు దళిత అస్తిత్వవాదాన్ని ప్రోత్సహించి ఎన్ని వోట్లు వెయ్యించుకున్నా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్‌లు మాత్రం పెట్టరు. ఆ ప్రొపోజల్ ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకి నచ్చదు. పెట్టుబడిదారీ వర్గంవాళ్ళకి నచ్చని ఇలాంటి నిర్ణయాలు మన పాలకవర్గంవాళ్ళు తీసుకుంటారని అనుకోను. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్‌లు పెడితే కొత్త పెట్టుబడులు రావని మన పాలకవర్గంవాళ్ళు ప్రచారం చేస్తారు (డైరెక్ట్‌గా కాకపోయినా ఇన్‌డైరెక్ట్‌గా తమ వర్గానికి చెందిన మేతావుల చేత ప్రచారం చెయ్యిస్తారు). దళిత అస్తిత్వవాదం, మహిళా సాధికారికత అనేవి పాలక వర్గంవాళ్ళు నాలుగు వోట్ల కోసం చెప్పుకునే కబుర్లు మాత్రమే. కానీ ఫైనల్‌గా వాళ్ళు ప్రయోజనం కలిగించేది తమకి ప్రియమైన ధనిక వర్గానికి మాత్రమే.
    >>>>>

  29. విశేఖర్ గారూ
    రంగనాయకమ్మ గారు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంపై స్పందనగా నాకు తెలిసిన సమాచారం వారితో పంచుకున్నాను. దాంట్లో కొంత ఇక్కడ పొందుపరుస్తున్నాను.

    “ఆ లక్షణాలు, అడుగు కులాల వారికో, పై కులాల వారికో, తప్పనిసరిగా వుంటాయనడానికి లేదు. ఏ కులంలో అయినా, శ్రమ చేసే మనుషుల్లో వున్న సుగుణం – శ్రమ చెయ్యడం ఒక్కటే. అది తప్ప, మిగతా అన్ని అంశాల్లోనూ, శ్రామికులంతా, భూస్వామ్య, బూర్జువా సమాజాల్లో పుట్టి పెరుగుతూ, అవే భావాలతో కిక్కిరిసి వున్నవారే. శ్రమ చేసే మనిషికి, శ్రమ దోపిడీకి గురి అవుతున్నానని తెలిసే వరకూ, ఆ హృదయంలో ఏ విప్లవ భావ బీజమూ మొలకెత్తదు. అంటే, అడుగు కులాల వారు, ఆ కులాల్లో పుట్టినందుకే, తమ పుటకతోనే, విప్లవకారులుగా వుంటారనేది పెద్ద భ్రమ!”

    సమానత్వ శ్రమ విభజనే మార్గం
    – రంగనాయకమ్మ
    http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/10/edit/10edit4&more=2012/jul/10/edit/editpagemain1&date==7/10/2012

    … … …

    … … …

    అక్షరం ముక్క రానివారు, ప్రాధమిక చదువు మాత్రమే చదివిన వారు పార్టీలోకి వస్తున్నప్పుడు వారికి విద్యాభ్యాసం చేయించడంతో పార్టీ డాక్యుమెంట్లనైనా అర్థం చేసుకునే స్థాయికి తేవడమే విప్లవపార్టీకి కఠిన తరమైన పరీక్షలాంటిది. ఆ పరీక్ష నెగ్గక ముందే ఎంతోమంది మెరికల్లాంటి యువతీయువకులు నేలకొరుగుతూ వచ్చారు. భారత విప్లవోద్యమ చరిత్రలో నాయకత్వ కంటిన్యుటీ లేకపోవడం, పార్లమెంటరీ భ్రమలు, ఆశలు అన్ని వర్గాల ప్రజలలో ఇప్పటికీ బలంగా ఉండటం అనేదే విప్లవోద్యమాల కృషిని బలీయంగా అడ్డుకుంటోంది

    పాలక వర్గాలు అమలు చేస్తున్న విప్లవ వ్యతిరేక రాజకీయ ఆర్థిక సంస్కరణలు, రిజర్వేషన్లు ఇస్తున్న కొద్దో గొప్పో అవకాశాలు వంటి అనేక అంశాలు దళిత బలహీన వర్గాలకు చెందిన యువతరాన్ని… వ్యక్తి స్వార్థానికి, స్వప్రయోజనాలకు దూరంగా ఉండే విప్లవోద్యమాలవైపు పోకుండా అడ్డుకుంటున్నాయి. కుల సమస్యను పట్టించుకోనందుకే దళితులు విప్లవోద్యమాలను అనుమానంతో చూస్తున్నారనడం పాక్షిక సత్యమే అని నా ఉద్దేశ్యం.

    పాలకవర్గ ఓట్ల రాజకీయ విధానాలతో బేరమాడే శక్తి, తమ ఆర్థిక, ఉపాధి, తదితర డిమాండ్లను అంతో ఇంతో స్థాయిలో నెరవేర్చుకునే శక్తి దళిత బలహీన వర్గాలకు ఏర్పడింది కాబట్టే వారికి మూకుమ్మడిగా విప్లవోద్యమాలలో చేరే భౌతిక ఆవశ్యకత లేదని నేననుకుంటున్నాను.

    కాని పాలకవర్గంతో బేరమాడే శక్తిని శరవేగంగా పోగొట్టుకుని వీధిలో నిలబడిన పేద, మధ్యతరగతి బ్రాహ్మణ వర్గానికి చెందినవారు విప్లవోద్యమంలోకి ఒక స్థాయిలో వస్తున్న పరిస్థితి కూడా ఉంది. త్యాగ పూరిత ఆచరణలో, ప్రాణార్పణలలో బ్రాహ్మణ యువతీ యువకుల పాత్ర గణనీయంగానే ఉంది.

    భారత చరిత్రలో మొదటిసారిగా బ్రాహ్మణ కులస్థులు ఈ దేశంలోని నిరుపేద దళిత కులాలతో మనసా వాచా కలిసిపోయారంటే, వారి తిండి అలవాట్లతో సహా అలవర్చుకున్నారంటే ఆ ఘనత విప్లవ ఉద్యమానికే దక్కుతుంది. నేను భావోద్వేగానికి గురై ఈ విషయం చెప్పడం లేదు శేఖర్ గారూ.. …

    విప్లవ పార్టీలలో వర్గ ప్రాతిపదికన కేడర్ పాలసీ ఉంది కాబట్టే బ్రాహ్మణులతో సహా అన్ని అగ్రకులాలవారు పార్టీలో స్వచ్చందంగానే చేరి పని చే్స్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ఆ విధంగా విప్లవోద్యమంలో చోటు చేసుకుంటున్న ప్రాణత్యాగాలకు కుల స్వభావం లేదు.

    1950ల మొదట్లో తెలంగాణా సాయుధ పోరాటం తర్వాత భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా దళిత బలహీన వర్గాల ప్రయోజనాలు పునాదిగా పని చేసినది విప్లవ పార్టీలే అనే విషయం మనలో ఎవ్వరూ మర్చిపోకూడదు.

    విప్లవ పార్టీలు కులసమస్యను పట్టించుకోలేదనే విమర్శ లేదా ఆరోపణలలో పాక్షికంగా అయినా కొంత సత్యం ఉండవచ్చేమో కాని వీళ్లు కూడా కులసమస్యను కమ్యూనిస్టు పార్టీల్లాగే పట్టించుకోలేదనే విమర్శలను చూసినప్పుడు నాకయితే కొంచెం కష్టంగా ఉంటుంది. … విప్లవ పార్టీలు ఈదేశంలో పట్టించుకున్నదే ప్రధానంగా దళితులను, ఆదివాసీలను. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇది సత్యం.

  30. రాజుగారూ, నేను సాధారణ అవసరంగా రాసిన విషయంలో మీరస్సలు లేరు. మీకా అనుమానమే అవసరం లేదు. మీ నుండి నొప్పించే అంశం నేనింతవరకు ఎదుర్కోలేదు. (అయినా, సైద్ధాంతిక నిబద్ధతను అనుమానించవలసింది ఆచరణ ద్వారానే తప్ప మాటల్లో కాదు. మాటలకేముంది? ఎన్నైనా చెప్పొచ్చు, రాసుకోవచ్చు)

    చర్చలో వ్యంగ్యం వద్దని చెప్పడానికీ, నా సైద్ధాంతిక నిబద్ధతను అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పడానికీ మాత్రమే అది రాశాను. అది కూడా మిమ్మల్ని ఉద్దేశించి కాదు.

    మీ వ్యాఖ్యలో కొన్ని అంశాలు వదిలేస్తాను. కొన్ని అత్యవసరమైన అంశాలు ఉన్నాయి. ఎడిట్ చేసి రేపు ప్రచురిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s