మరో ముఖ్య విషయం కూడా అమికస్ క్యూరి నివేదిక పొందుపరిచింది. ముస్లింలపై మారణకాండ జరుగుతుండగా ఇద్దరు రాష్ట్ర మంత్రులు పోలీసు కంట్రోల్ రూంలో ఉన్నందునే సంజీవ్ భట్ స్టేట్ మెంట్ కు అవకాశం ఏర్పడించని ఆయన తెలిపాడు. కేసుపై విచారణ జరుపుతున్న ట్రయల్ కోర్టు అమికస్ క్యూరి అభిప్రాయాలతో అంగీకరించినట్లయితే ముఖ్యమంత్రి నరేంద్రమోడిని ప్రాసిక్యూట్ చేయడానికి రంగం సిద్ధమయినట్లే. అమికస్ క్యూరీ ప్రస్తావించిన నేరాల ప్రకారం నరేంద్రమోడి పైన విధించదగిన సెక్షన్లు ఇలా ఉన్నాయి: 153 ఎ (కమ్యూనిటీల మధ్య శతృత్వం రేకెత్తేలా ప్రకటనలు చేయడం), 153 బి (జాతీయ సమగ్రతకు భంగం కలిగేలా ప్రకటనలు చేయడం, నిందించడం), 505 (ప్రజలను మోసం చేసే ప్రకటనలు జారీ చెయ్యడం), 166 (గాయం చేసే ఉద్దేశ్యంతో చట్టం నిర్దేశించిన పద్ధతిని పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తి గౌరవించకపోవడం), ఇంకా ఇతర సెక్షన్లు. 166 సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది. పాలనా వ్యవస్ధకు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ముఖ్యమంత్రి మోడిపైన అల్లర్లు చెలరేగకుండా చూడవలసిన బాధ్యత ప్రత్యేకంగా ఉంటుంది.
జాకియా జాఫ్రి హత్య కేసుకు సంబంధించి ఆయన భార్య మోడితో పాటు 61 మందిపైన సుప్రీం కోర్టుకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పరిశోధన చేయవలసిందిగా సుప్రీం కోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నియమించింది. సిట్ తన నివేదిక సమర్పించిన అనంతరం వివిధ సాక్షులను విచారించి నివేదికను స్వతంత్రంగా మూల్యాంకనం చేయాల్సిందిగా సుప్రీం కోర్టు రాజు రాంచంద్రన్ ను అమికస్ క్యూరిగా నియమించింది. మోడి పైన కేసు మూసేయాలని సిట్ సిఫార్సు చేసిన సంగతి పత్రికల ద్వారా వెల్లడయ్యింది. పోలీసు అధికారి సంజీవ్ భట్, వివాదాస్పద వ్యక్తి అనీ, ఆధారపడడానికి వీలు లేని సాక్షి అనీ చెబుతూ, ఆ ప్రాతిపదికన మోడి పైన కేసు పెట్టలేమని నిర్ధారించింది. అయితే మోడి పైన కేసు పెట్టి విచారించడానికి సంజీవ్ భట్ సాక్ష్యమే ప్రధానంగా ఆధారపడదగినది. ఆ ఒక్క సాక్ష్యాన్ని సిట్ కొట్టిపారేయడంతో మోడి సాగించిన నరమేధంలో బాధితులైన వారికి న్యాయం దుర్లభం అయ్యింది. ఈ పరిస్ధితుల్లో అమికస్ క్యూరి నివేదిక కీలకంగా మారింది.
ముస్లింలపై హత్యాకాండ సాగుతుండగా పోలీసు కంట్రోల్ రూంలో తిష్టవేసిన ఇద్దరు మంత్రులు పోలీసు విధుల్లో జోక్యం చేసుకున్నారని చెప్పేందుకు తగిన భౌతిక సాక్ష్యం లేదని కూడా సిట్ తేల్చేసింది. సిట్ కు సంజీవ్ బట్ ఇచ్చిన సాక్ష్యంలో తాను ఫిబ్రవరి 27, 2002 తేదీన మోడి జరిపిన సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. హిందువులు, ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులను కోరాడు. గాంధీనగర్ లోని మోడి నివాసంలో సాయంత్రం సమయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఇతర పోలీసు అధికారులెవ్వరూ సంజీవ్ భట్ సమావేశంలో పాల్గొన్నాడని నిర్ధారించలేకపోవడంతో భట్ సాక్ష్యం అనుమానంలో పడింది.
అయితే అమికస్ క్యూరి సిట్ నిర్ధారణలతొ విభేదించినట్లుగా తెలుస్తోంది. సాక్ష్యాన్ని తూచాలి తప్ప లెక్కించకూడదనీ, (భట్ ఒక్కడే ఒకవైపు ఉండగా, ఇతర పోలీసు అధికారులు అంతా ఒకవైపు ఉన్నారు కనక) అలా తూచేపని భట్ తో పాటు మీటింగ్ లో పాల్గొన్న ఇతర పోలీసు అధికారులను కూడా ట్రయల్ కోర్టు బోనులో నిలబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేయడం ద్వారానే సాధ్యమని అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డాడు. మోడి వ్యతిరేక పార్టీ ఇతర అధికారులను ప్రశ్నించే అవకాశం కల్పించకుండా మోడిపైన కేసు ముందుగానే మూసివేయడం సరైంది కాదని అమికస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాక్ష్యులను ప్రశ్నిస్తున్న క్రమంలో క్రాస్ ఎగ్జామిన్ జరుగుతున్న క్రమంలో భట్ అబద్ధం చెప్పాడని తేలవచ్చు, లేదా ఇతర అధికారులు అబద్ధం చెప్పారనైనా తేలవచ్చు అని అమికస్ తెలిపాడు.
పోలీసు కంట్రోల్ రూం లో హోం మంత్రిత్వ శాఖకు సంబంధం లేని ఇద్దరు మంత్రులు ఉండడమే భట్ స్టేట్ మెంట్ నిజం కావడానికి ఆస్కారం కనిపిస్తున్నదని అమికస్ క్యూరి అభిప్రాయ పడ్డాడు. ఆ మంత్రులిద్దరికీ ముఖ్యమంత్రి మద్దతు పూర్తిగ ఉందని సిట్ స్వయంగా పేర్కొనడం దీనికి మరింత మద్దతు లభిస్తోంది. (మంత్రులిద్దరూ పోలీస్ కంట్రోల్ రూంలో ఉండడం ద్వారా మోడీ ఆదేశాలతోనే అక్కడ ఉన్నారన్న అనుమానాలు రేకేత్తింపజేసారు అని సిట్ అధిపతి రాఘవన్ అన్నట్లుగా తెహెల్కా పత్రిక రాసింది.) అమికస్ క్యూరి అభిప్రాయాన్ని సిట్ తిరస్కరించినట్లయితే ఆ నిర్ణయాన్ని ఎహసాన్ జాఫ్రీ, ఆమె సహ వాది తీస్తా సెతెల్వాద్ లు ట్రయల్ కోర్టులో సవాలు చేయవచ్చని తెలుస్తోంది. ట్రయల్ కోర్టు కూడా అమికస్ నివేదికపైన తన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.
మొత్తం మీద నరేంద్ర మోడి భవిష్యత్తు అంధకారంలో చిక్కుకున్నట్లేనా? ఆయన ప్రధాన మంత్రి పదవి ఆశలు దాదాపు ముగిసినట్లే కావచ్చు. కాని వందల మందిని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బలి తీసుకున్న ఆరోపణలున్న నరేంద్రమోడి లాంటి వ్యక్తులపై నేరం ఎలా రుజువవుతుంది?