‘టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం’ పేరుతో ఆల్-ఖైదా పై అమెరికా యుద్ధం ప్రకటించిన సంగతి విదితమే. ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అంతం చేశామని కూడా ప్రకటించిన అమెరికా అదే సంస్ధకు చెందిన టెర్రరిస్టులకు ఆయుధాలు ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టిందని ప్రముఖ అమెరికా చరిత్రకారుడు, రచయిత, ఆర్ధికవేత్త, జర్నలిస్టు అయిన వెబ్స్టర్ టార్ప్లే తెలిపాడు. ప్రాంతీయంగా టర్కీ ప్రధాని ఎర్డోగన్, విదేశీ మంత్రి దవుతోగ్లు ల దురభిమానాన్ని, అత్యాశను రెచ్చగొట్టి సిరియా కిరాయి తిరుగుబాటులో దింపింది అమెరికాయేనని కూడా టార్ప్లే తెలిపాడు.
“ఆల్-ఖైదా ను నాటో యొక్క ఇర్రెగ్యులర్ ఇన్ఫాంట్రీ దళంగా, గెరిల్లా శక్తిగా ఆల్-ఖైదా ను ఒక్క సారి ఊహించుకోండి. నాటో కి అది సాధ్యమే. టర్కిష్ భూభాగంపై ఈ నిర్మాణం ఇప్పటికే ఉనికిలో ఉంది” అని ఆయన ప్రెస్ టి.వి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. సిరియా పొరుగునే ఉన్న టర్కీ భూభాగంపై ఆశ్రయం పొందుతూ సిరియాలో ఆల్-ఖైదా గెరిల్లా దాడులు నిర్వహిస్తోందని టార్ప్లే అంతరార్ధం. ఆయన ఇంకా ఇలా అన్నాడు.
“Al-Qaeda was an integrated part of this from the very beginning and they have been there because they have been brought in by NATO.”
“ఆల్-ఖైదా మొదటినుండీ ఇందులో సమగ్ర భాగస్వామి. నాటో తీసుకురావడం వల్లనే అది అక్కడ ఉంటోంది.”
“టర్కీ ఖచ్చితంగా ఇందులోకి ఈడ్చబడింది. ఎర్డోగన్ (టర్కీ ప్రధాని), దవుతోగ్లు (టర్కీ విదేశాంగ మంత్రి) ల దురభిమానం, అత్యాశ లను ఒక పద్ధతి ప్రకారం రెచ్చగొట్టి ఒబామా టర్కీ ని లాగాడు” అని వెబ్స్టర్ మంగళవారం తెలిపాడు. టర్కీ, దాదాపు రెండు డజన్ల వరకూ మనిషి ప్రయోగించగల వాయు రక్షణ మిసైళ్లను (MANPADs: man-portable air-defense systems) సిరియాలో ప్రవేశపెట్టిందని ఎన్.బి.సి న్యూస్ మంగళవారం ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.
దక్షిణ టర్కీలోని అదానా రాష్ట్రంలో గల ‘ఇన్సిర్లిక్’ వైమానిక స్ధావరం నుండి సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు, మందుగుంటు సామాగ్రి అందుతున్నాయని వెబ్స్టర్ తెలిపాడు. భూమినుండి గాలిలోకి ప్రయోగించే మిసైళ్లను కూడా టర్కీ సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు సరఫరా చేసిందని టర్కీ వార్తా సంస్ధలు జులై చివరి వారంలో ప్రకటించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది.
సిరియాలో టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లు సాగిస్తున్న కిరాయి తిరుగుబాటు దుర్మార్గాన్ని అర్ధం చేసుకోవడానికి కాశ్మీరు పరిస్ధితిని ఒకసారి స్మరించుకుంటే సరిపోతుంది. కాశ్మీరులోకి పాకిస్ధాన్ (లేదా ఐ.ఎస్.ఐ) ప్రేరేపిత టెర్రరిస్టులు ప్రవేశించి తిరుగుబాటు రెచ్చగొడుతున్నారని భారత్ దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. దీనిని సీమాంతర ఉగ్రవాదంగా ఇండియా చెబుతుంది. ఈ పనిలో పాకిస్ధాన్ కి చైనా వెన్నుదన్ను ఉందని కూడా కొంతమంది ఆరోపిస్తారు. అది నిజమా కాదా అన్నది పక్కనబెట్టి సరైందా కాదా అని చూస్తే కాదనే భారత ప్రభుత్వ నిశ్చితాభిప్రాయం.
సిరియాలో టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్ లు చేస్తున్నది ఇదే. సిరియాలో ప్రజలపై భయోత్పాత దాడులు చేస్తూ ఊచకోత కోస్తున్న టెర్రరిస్టులు లిబియా, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, ఆఫ్ఘనిస్ధాన్, బహ్రెయిన్ తదితర దేశాల నుండి సేకరించబడినవారు. వీరిలో అనేకులు ఆల్-ఖైదా సభ్యులుగా టెర్రరిస్టు హత్యాకాండకు పాల్పడుతున్నారు. ఈ టెర్రరిస్టులకు టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్సు లు ఆయుధ, ధన, మానవ సాయాన్ని చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ లకు చెందిన మిలట్రీ గూఢచారులు టెర్రరిస్టులకు చురుకుగా సలహా, సంప్రదింపులు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని నిన్న మొన్నటివరకూ అమెరికా నిరాకరిస్తూ వచ్చినప్పటికీ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లు సాక్ష్యాధారాలతో వెల్లడి చేయడంతో ఇప్పుడు నిరాకరించడం మానేశాయి లేదా నామమాత్రంగా ఖండిస్తున్నాయి.
ఆల్-ఖైదా పైన అమెరికా ప్రకటించిన ప్రపంచ యుద్ధం ఒట్టి మోసం. ఆల్-ఖైదాను పెంచి పోషించింది అమెరికాయే. అమెరికా, యూరప్ లు మార్కెట్ల కోసం సాగించే దురాక్రమణ యుద్ధాలకు ఒక బూచి కావాలి. కోల్డ్ వార్ ముగియడంతో రష్యా బూచి లేకుండా పోయింది. ఆ స్ధానంలో వచ్చి చేరిందే టెర్రరిజం. అత్యంత పాశవిక టెర్రరిస్టు రాజ్యం అయిన అమెరికా టెర్రరిజం పై యుద్ధం ప్రకటించడమే మోసం.
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు